Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 10

సూర్యుడు కదలక నిలచిన రోజు

10 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు. అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీసెదెకు, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు. యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు. “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బ్రతిమిలాడాడు.

అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులు వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియు వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.

గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.

కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు. యెహోవా, “ఆ సైన్యాల విషయమై భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.

యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.

10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు. 11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హోరోను నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.

12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు:

“ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు,
    ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”

13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. 14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!

15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు. 16 యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులు పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో వారు దాగుకొన్నారు. 17 అయితే ఆ అయిదుగురు రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కనుక్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది. 18 యెహోషువ ఇలా చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి. 19 కానీ మీరు అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రువుల్ని తిరిగి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం ఇచ్చాడు.”

20 కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు తప్పించుకొని, వారి పట్టణాలకు వెళ్లి దాగుకోగలిగారు. వీళ్లు చంపబడలేదు. 21 పోరాటం అయిపోయిన తర్వాత యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో ఒక్కరూ లేకపోయారు.

22 యెహోషువ ఇలా చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకొని రండి” అని. 23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులను గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు. 24 కనుక ఆ ఐదుగురు రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటికి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.

25 అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో.

26 అప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజులను చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయంత్రంవరకు చెట్లకు వేలాడనిచ్చాడు. 27 సూర్యాస్తమయమప్పుడు ఆ శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహలోనే ఉన్నాయి.

28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు.

దక్షిణ ప్రాంతాలను ఓడించటం

29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు. 30 ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.

31 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లిబ్నా విడిచి, లాకీషుకు ప్రయాణమయ్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్నా దగ్గర్లోనే ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు. 32 ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే. 33 ఇదే సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతణ్ణి, అతని సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ మనుష్యులు ఎవరూ బ్రతికి బయటపడలేదు.

34 అప్పుడు యెహోషువ, అతని ప్రజలందరూ లాకీషునుండి ఎగ్లోనుకు ప్రయాణ మయ్యారు. వారు ఎగ్లోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు. 35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్టణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు చేసిందికూడ ఇదే.

36 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎగ్లోను నుండి హెబ్రోనుకు ప్రయాణమయ్యారు. అప్పుడు వారు హెబ్రోను మీద దాడి చేసారు. 37 ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్లోనుకు చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, అందులోని ప్రజలందరినీ చంపివేసారు.

38 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి చేసారు. 39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.

40 కనుక నెగెవు, కొండ ప్రాంతపు పట్టణాల రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యోహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యెహోషువ ప్రాణాలతో విడిచిపెట్టలేదు.

41 కాదేషు బర్నేయనుండి గాజా వరకు గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. గోషేను (ఈజిప్టు) దేశం నుండి గిబియోను వరకుగల పట్టణాలన్నింటినీ అతడు స్వాధీనం చేసుకొన్నాడు. 42 ఆ ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా చేయగలిగాడు. 43 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరు గిల్గాలు లోని వారి గుడారాలకు తిరిగి వెళ్లారు.

కీర్తనలు. 142-143

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

దావీదు స్తుతి కీర్తన.

143 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
    నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
    నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
    వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
    నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
    నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
    నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
    యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
    నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
    సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
    నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
    నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
    నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
    నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.

యిర్మీయా 4

ఇదే యెహోవా వాక్కు.
“ఇశ్రాయేలూ, నీవు రావాలనుకుంటే,
    తిరిగి నా వద్దకు రమ్ము
నీ విగ్రహాలను విసరివేయి!
    నానుండి దూరంగా పోవద్దు!
నీవు ఆ విధంగా చేస్తే,
    నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు
‘నిత్యుడైన యెహోవా తోడు’
    అని నీవనగలవు
నీవీ మాటలు సత్యమైన,
    న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు.
నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు.
    యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.”

యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు:

“మీ భూములు దున్నబడలేదు.
    వాటిని దున్నండి!
    ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు.
యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి.
    మీ హృదయాలను మార్చుకోండి[a]
యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే
    నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది.
    నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది.
ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది?
    మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”

ఉత్తర దిశ నుండి విపత్తు

“ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము:

“యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము,
    ‘దేశమంతా బూర వూది’
బాహాటంగా ఇలా చెప్పుము,
    ‘మీరంతా కలిసి రండి!
    రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’
సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము.
    మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు!
ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి[b] నేను విపత్తును తీసుకొని వస్తున్నాను.
    నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.”
తన గుహనుండి ఒక “సింహం” బయటికి వచ్చింది.
    రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు.
నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు ఇల్లు వదిలి వస్తున్నాడు.
నీ పట్టణాలు ధ్వంసమవుతాయి.
    వాటిలో నివసించటానికి ఒక్కడూ మిగలడు.
కావున నారబట్టలు[c] ధరించండి. మిక్కిలిగా విలపించండి!
    ఎందువల్లనంటే యెహోవా మీపట్ల చాలా కోపంగా ఉన్నాడు.
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
    “ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయకులు తమ ధైర్యాన్ని కోల్పోతారు.
యాజకులు బెదరిపోతారు!
    ప్రవక్తలు భయపడి, విస్మయం పొందుతారు!”

10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతుకలమీద కత్తి ఉంది!”

11 ఆ సమయంలో యూదా,
    యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది:
“వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది.
    అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది.
అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి
    పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.
12 ఇది దీనికంటె బలమైన గాలి;
    పైగా అది నావద్ద నుండి వీస్తుంది.
ఇప్పుడు, యూదా ప్రజలపై నా న్యాయనిర్ణయం ప్రకటిస్తాను.”
13 చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు!
    అతని రధాలు సుడిగాలిలా కన్పిస్తాయి!
    అతని గుర్రాలు గ్రద్దలకంటె వేగం కలవి!
అది మనకు హానికరం!
    మనం సర్వ నాశనమయ్యాము!

14 యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి.
మీరు పరిశుద్ధ హృదయాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
    దుష్ట ఆలోచనలు చేయటం మానివేయండి.
15 వినండి! దానునుండి[d] వచ్చిన
    వార్తాహరుడు మాట్లాడుతున్నాడు.
కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము[e] నుండి
    ఇతడు దుర్వార్త తెస్తున్నాడు.
16 “దానిని ఈ దేశమంతా ప్రకటించండి.
    ఆ వార్తను యెరూషలేము నగరవాసులకు తెలియజేయండి.
బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తున్నాడు.
యూదా నగరాలపై శత్రువులు
    యుద్ధ ధ్వని చేస్తున్నారు.
17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులున్నట్లు
    యెరూషలేమును శత్రువులు చుట్టుముడతారు
యూదా, నీవు నాకు ఎదురు తిరిగావు!
    అందువల్లనే శత్రువు నిన్నెదిరించి వస్తున్నాడు!”
ఇది యెహోవా వాక్కు.

18 “నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే
    ఈ విపత్తును తీసికొని వచ్చాయి.
నీ దుష్టజీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.”

యిర్మీయా రోదన

19 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను.
    నేను బాధతో క్రుంగి పోతున్నాను.
అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను.
    నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది.
నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను.
    అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!
20 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర!
    దేశం యావత్తూ సర్వనాశనమయ్యింది.
అనుకోని విధంగా నా డేరాలన్నీ నాశనం చేయబడ్డాయి!
    నా పరదాలు (తెరలు) చించబడ్డాయి!
21 యెహోవా, నేనెంత కాలం యుద్ధ ధ్వజాలను చూడాలి?
    ఎంతకాలం యుద్ధ నాదం నేను వినాలి?

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు.
    వారు నన్నెరుగరు.
వారు మంద బుద్ధిగల పిల్లలవలె ఉన్నారు.
    వారికి అవగాహనే లేదు.
కాని వారు చెడు చేయటంలో నేర్పరులు.
    మంచిపని ఎలా చేయాలో వారికి తెలియనే తెలియదు.”

ముంచుకు వచ్చే ముప్పు

23 నేను భూమివైపు చూశాను.
    భూమి ఖాళీగా ఉంది;
    దానిపై ఏమీ లేదు.
నేను అకాశంవైపు చూశాను.
    వెలుగు పోయింది.[f]
24 నేను పర్వతాల వైపు చూశాను,
    అవి కదిలిపోతున్నాయి.
    కొండలన్నీ కంపించి పోతున్నాయి.
25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు.
    ఆకాశంలో పక్షులు లేకుండా పోయాయి.
26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది.
    ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.

27 యెహోవా ఇలా అన్నాడు:
“దేశం యావత్తూ నాశనమవుతుంది.
    (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం చేయను)
28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు.
    ఆకాశం చీకటవుతుంది.
నా మాటకు తిరుగులేదు.
    నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”

29 గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను
    యూదా ప్రజలు విని పారిపోతారు!
కొందరు గుహలలో దాగుకొంటారు.
    కొంత మంది పొదలలో తలదాచుకుంటారు.
    మరి కొందరు కొండల మీదికి ఎక్కుతారు.
యూదా నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి.
    అక్కడ ఎవ్వరూ నివసించరు.

30 యూదా, నీవు నాశనం చేయబడ్డావు.
    నీవేమి చేస్తున్నావు?
నీ అందమైన ఎర్రని దుస్తులు ఎందుకు ధరించావు?
నిన్ను బంగారు ఆభరణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు?
నీ కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు?
    నీ అలంకరణ వ్యర్థం.
నీ ప్రేమికులు నిన్నసహ్యించుకుంటారు.
    వారు నిన్ను చంపాలని చూస్తున్నారు.
31 ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదన విన్నాను.
    అది ప్రథమ కన్పులో స్త్రీ పడిన వేదనవంటిది.
    అది సీయోను కుమార్తె[g] రోదన.
ఆమె చేతులెత్తి ప్రార్థిస్తూ,
    “అయ్యో, నేను మూర్ఛపోతున్నాను!
    హంతకులు నన్ను చుట్టుముట్టారు!” అని అంటున్నది.

మత్తయి 18

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మార్కు 9:33-37; లూకా 9:46-48)

18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.

యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.

“అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.

పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం

(మార్కు 9:42-48; లూకా 17:1-2)

“కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.

“మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.

తప్పిపోయిన గొఱ్ఱెల ఉపమానం

(లూకా 15:3-7)

10 “ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడకండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. 11 [a]

12 “ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు వున్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే, అతడు ఆ తొంబైతొమ్మిది గొఱ్ఱెల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు? 13 ఇది సత్యం, ఒక వేళ ఆ గొఱ్ఱె దొరికితే ఆ తప్పిపోని తొంబైతొమ్మిది గొఱ్ఱెలు తన దగ్గరున్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు. 14 అతనిలాగే పరలోకంలోవున్న నా తండ్రి ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు.

పాపం చేసిన సోదరుడు

(లూకా 17:3)

15 “మీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతణ్ణి మీరు జయించినట్లే! 16 ఒక వేళ అతడు మీ మాట వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. 17 వాళ్ళ మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాటకూడ వినకపోతే అతణ్ణి మీ వానిగా పరిగణించకండి.

18 “ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. 19 అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు. 20 ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”

క్షమించని సేవకుని ఉపమానం

21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[b] క్షమించాలని చెబుతున్నాను.

23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు[c] అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. 25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.

26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. 27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.

28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.

29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.

30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. 31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. 33-34 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International