M’Cheyne Bible Reading Plan
హాయి నాశనమగుట
8 అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. 2 నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”
3 కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు. 4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి. 5 నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యులు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివరకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం. 6 ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము. 7 అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.
8 “యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”
9 అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు. 11 యెహోషువతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు. 13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.
15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు. 16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు. 17 హాయి, బేతేలు ప్రజలంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండలేదు.
18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు. 19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.
20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తరమటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది. 21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటం వారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు. 22 అప్పుడు దాగుకొనియున్న మనుష్యులు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు. 23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.
యుద్ధాన్ని గూర్చి ఆలోచించటం
24 యుద్ధ సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రాయేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్లందరినీ వారు చంపేసారు. 25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు 26 ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. ఆ పట్టణంలోని ప్రజలందరూ నాశనం చేయబడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు. 27 ఆ పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచుకొన్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు.
28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది. 29 హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
ఆశీర్వాదాలు మరియు శాపాలను చదవటం
30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు. 31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసాడు. కనుక మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు. 33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారి ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు. 35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది.
యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు.
పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు.
పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి,
ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే,
“పగలు రాత్రిగా మారిపోయింది.
తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు.
రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
19 దేవా, దుర్మార్గులను చంపివేయుము.
ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు.
వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను.
నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను!
నీ శత్రువులు నాకూ శత్రువులే.
23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము.
నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
24 చూచి, నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము.
శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
విశ్వాసంలేని యూదా
2 యెహోవా యొక్క వర్తమానం నాకు వినబడింది. యెహోవా వాక్కు ఇలా వుంది: 2 “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి:
“‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు.
ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు.
ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను
నీవు నన్ను అనుసరించావు.
3 ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము:
వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం.
ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు.
ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’”
ఇది యెహోవా వాక్కు.
4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.
ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.
5 యెహోవా ఇలా చెప్పాడు:
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?
అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు?
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి
తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన
యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో
సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,
ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.
ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’
మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”
7 ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో
నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.
కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు.
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.
అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.
8 “యెహోవా ఎక్కడ అని
యాజకులు అడగలేదు.
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.
ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.
వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
9 కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను
నేను నిందిస్తున్నాను.
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి[a] వెళ్లి చూడండి.
ఒకనిని కేదారు[b] రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి.
అక్కడ ఎవరైనా ఈ రకంగా
ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను
క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా?
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని
పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.
12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.
భయకంపితులుకండి!”
యెహోవా ఇలా చెప్పాడు.
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు
పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)
కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.
14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారా?
వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా?
ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?
15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి.
సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల దేశాన్ని సింహాలు నాశనం చేశాయి.
ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి.
అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.
16 మెంఫిస్, తహపనేసు[c] వీటినుండి వచ్చిన
యోధులు నీ తల చితుకగొట్టారు.
17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం!
చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న[d]
మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు
18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి:
ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా?
నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది?
లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది?
యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.
19 మీరు చెడు పనులు చేశారు.
మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి.
మీకు కష్టాలు సంభవిస్తాయి.
ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది.
దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది.
నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!”
ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.
20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు.
నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు.
‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు.
నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుక్రింద
పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.[e]
21 యూదా, నిన్నొక మేలురకం ద్రాక్షపాదువలె నాటాను.
మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు.
కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?
22 క్షారజలంతో స్నానం చేసుకున్నా,
నీవు విస్తరించి సబ్బు వినియోగించినా
నేను నీ దోష కళంకాన్ని చూడగలను.”
ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.
23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’
నీవెలా నాకు చెప్పగలవు?
లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో.
నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో.
నీవొక వడిగల ఆడ ఒంటివలె
ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.
24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు.
సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది.
మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు.
ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు.
అప్పుడు దానిని కనుగొనటం తేలిక.
25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి.
ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు.
కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను!
నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను.
నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.
26 “ప్రజలు పట్టుకున్నప్పుడు
దొంగ సిగ్గుపడతాడు
అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు.
ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.
27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు!
దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు.
ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు.
దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు.
ఆ ప్రజలంతా అవమానం పొందుతారు.
ఆ ప్రజలు నావైపుకు చూడరు.
వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు.
కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు,
‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి?
మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము.
యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!
29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు?
మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.”
ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.
30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను.
కాని అది పనిచేయలేదు.
మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా
మీరు వెనక్కి మరలలేదు.
మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు.
మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”
31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి.
“ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా?
వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా?
‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది.
యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు.
కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?
32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.
33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు.
కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.
34 మీ చేతులు రక్తసిక్తమైనాయి![f]
అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.
35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’
అని నీవు చెప్పుకుంటూ ఉంటావు.
అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను,
ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.
36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని!
అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది.
అందుచేత అష్షూరును[g] వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు.
ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.
37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు.
అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు.
కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు.
ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 8:11-13; లూకా 12:54-56)
16 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు.
2 ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. 3 ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? 4 దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.
శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం
(మార్కు 8:14-21)
5 శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. 6 యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.
7 ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.
8 వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. 9 మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? 10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? 11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.
12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.
యేసే క్రీస్తు
(మార్కు 8:27-30; లూకా 9:18-21)
13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.
14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.
15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.
16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.
17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.
20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.
యేసు పొందనున్న మరణం
(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)
21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.
22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.
23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.
24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[a] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.
© 1997 Bible League International