Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 6:6-27

యెరికోతో యుద్ధం

కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.

“ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.

యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు. ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తున్నవాళ్లు బూరలు ఊదారు. 10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.

11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్కసారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.

12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు. 13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు. 14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.

15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు. 16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు! 17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యెహోవాదే.[a] వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు. 18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు. 19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యెహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”

20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు. 21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.

22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”

23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.

24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి. 25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.

26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు:

“ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే
    వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు.
ఈ పట్టణానికి పునాది వేసే మనిషి
    తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు.
ద్వారాలు నిలబెట్టేవాడు
    తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”

27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.

కీర్తనలు. 135-136

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

136 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
యెహోవా దేవున్ని స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి.
    ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు.
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి!
    ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

యెషయా 66

జనములన్నింటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు

66 యెహోవా చెబుతోంది ఇదే,
“ఆకాశాలు నా సింహాసనం.
    భూమి నా పాదపీఠం.
అందుచేత నాకు ఒక గృహం నిర్మంచగలం అని మీరనుకొంటున్నారా?
    లేదు, నిర్మించ లేరు.
నా అంతట నేనే అన్నింటినీ చేశాను.
    అన్నింటిని నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
“నేను ఏ ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పేదప్రజల్ని నేను లక్ష్యపెడతాను.
    వీరు చాల దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్యపెడతాను
కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు.
    కానీ వారు ప్రజల్నికూడా కొడతారు.
ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు.
    అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు.
మరియు పందుల[a] రక్తం వారు నాకు అర్పిస్తారు.
    ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు.
ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటారు.
    భయంకరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.
కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను.
    అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం.
నేను ఆ ప్రజలను పిలిచాను
    కాని వారు వినిపించుకోలేదు.
నేను వారితో మాట్లాడాను
    కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను.
నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు.
    నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”

యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా,
    మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి.
“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు.
    మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు.
యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము.
    అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు.
    ఆ మనుష్యులు శిక్షించబడతారు.”

శిక్ష మరియు ఒక క్రొత్త జనం

వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.

7-8 “ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక క్రొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక క్రొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు – ఒక క్రొత్త దేశానికి—జన్మనిస్తుంది. అదే విధంగా ఏదో క్రొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.”

యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ క్రొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు.

10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి.
    విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి.
    ప్రజలారా, మీరు పాలు త్రాగుతారు.
    మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.

12 యెహోవా చెబుతున్నాడు:
“చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది.
    భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి.
మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు.
    మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు.
    మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు.
    ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”

14 మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు.
    మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు.
యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు.
    కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.
15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు.
    యెహోవా సైన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు.
యెహోవా కోపంగా ఉన్నప్పుడు,
    ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు.
16 యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
    తర్వాత యెహోవా తన ఖడ్గంతోను, అగ్నితోను ఆ ప్రజలను నాశనం చేస్తాడు.
    యెహోవా అనేకమంది ప్రజలను నాశనం చేస్తాడు.

17 ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో[b] ఆరాధించుకొనేందుకు, వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి, వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. “పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)

18 “ఆ మనుష్యులకు దుష్టతలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు. 19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూదు, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు. 20 మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు. 21 ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచుకొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)

క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి

22 “నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను. మరియు నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతంగా నిలుస్తాయి. అదే విధంగా మీ పేర్లు, మీ పిల్లలు శాశ్వతంగా నాతో కూడ ఉంటారు. 23 ప్రతి ఆరాధన రోజు, ప్రజలంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు నాడూ, ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు.

24 “ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”

మత్తయి 14

హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం

(మార్కు 6:14-29; లూకా 9:7-9)

14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.

యోహాను తల నరకటం

అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.

హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.

ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.

అయిదువేల మందికి భోజనం

(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)

13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.

15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.

17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.

యేసు నీళ్ళపై నడవటం

(మార్కు 6:45-52; యోహాను 6:16-21)

22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. 23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. 24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.

25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. 26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.

27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.

28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.

29 “రా” అని యేసు అన్నాడు.

అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. 30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.

31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.

32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. 33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.

యేసు రోగులనేకులను నయం చేయటం

(మార్కు 6:53-56)

34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. 35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి. 36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International