Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 32

32 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
    భూమి నానోటి మాటలు వినునుగాక!
నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
    నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
    మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది.
    కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!

“ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
    ఆయన పని పరిపూర్ణం!
    ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
    నమ్ముకోదగ్గ దేవుడు.
ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా.
    మీరు నిజంగా ఆయన పిల్లలు కారు.
మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు.
    మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా?
    మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు,
యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు.
    ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.

“పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి,
    అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి.
మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు;
    మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు.
    ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు.
తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని
    ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
ఆయన ప్రజలే యెహోవా వంతు;
    యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.

10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు,
    వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి,
ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు.
    యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు.
    పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది.
అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది.
    అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది.
మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది.
    యెహోవా అలాగే ఉన్నాడు.
12 యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు.
    యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు.
13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు,
    పొలంలోని పంటను యాకోబు భుజించాడు
యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి
    రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు.
14 మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు
    గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు,
అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు.
    ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.

15 “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు.
    వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది.
వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు.
    వాడు ఆ బండను (యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
16 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు.
    యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు.
17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు.
    వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు.
    ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
    మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.

19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల
    ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు,
‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.
    వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను.
ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు
వారు అపనమ్మకమైన పిల్లలు.
21-22 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు.
    పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు.
నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను.
    ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను.
నా కోపం అగ్నిని రాజబెట్టింది;
    నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని,
    దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది.
    నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.

23 “‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను.
    నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.
24 ఆకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడిచేత.
    భయంకర నాశనంచేత వారు నాశనమైపోతారు.
బురదలో ప్రాకే పాముల విషం,
    మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను.
25 బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది;
    లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది.
యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని,
    తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.

26 “‘నేనంటాను: ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా ఊదేస్తాను.
    ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచిపోయేటట్టు నేను చేస్తాను.
27 ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు
    అది నాకు చికాకు కలిగిస్తుంది.
ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని,
    మా స్వంత శక్తితో మేము గెలిచాము
    ఇది యెహోవా చేయలేదు’ అనవచ్చును.

28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
29 వారు తెలివిగల వాళ్లయితే
    వారు దీనిని గ్రహిస్తారు.
    భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలోచిస్తారు.
30 ఒకడు 1,000 మందిని తరిమితే
    ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు?
యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే
    అలా జరుగుతుంది.
ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే,
    యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
31 ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ[a] (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు.
ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
32 ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా[b] పొలాలలోని దాని వంటిది.
వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు. వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
33     వారి ద్రాక్షారసం కృర సర్పాల విషం, నాగు పాముల కఠిన విషం.

34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను
‘నా గిడ్డంగిలో తాళం వేసి దీనిని
    నేను భద్రపరుస్తున్నాను అని యెహోవా చెబుతున్నాడు.
35 ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి
    వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే;
ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది
    వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’

36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు.
    వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు.
వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు.
    బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా
    నిస్సహాయులయ్యేటట్టు ఆయన చేస్తాడు.
37 అప్పుడు ఆయన ఇలా అంటాడు,
    ‘అబద్ధపు దేవుళ్లు ఎక్కడ?
    భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ?
38 ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు.
    వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు.
కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి.
    వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి!

39 “‘అప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే
    దేవుణ్ణి. ఇంకే దేవుడూ లేడు.
ప్రజలను బ్రతకనిచ్చేది,
    చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే.
నేను ప్రజల్ని బాధించగలను,
    బాగు చేయగలను.
నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
40 ఆకాశం వైపు నేను నాచేయి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను.
నేను శాశ్వతంగా జీవించటం సత్యమయితే,
    ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడ సత్యమే.
41 నేను ప్రమాణం చేస్తున్నాను,
    తళతళలాడే నా ఖడ్గానికి పదునుపెడ్తాను.
    నా శత్రువుల్ని శిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను.
    నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
42 నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు.
నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి.
నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’

43 “దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి.
    ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక.
    తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక.
ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు.
ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”

మోషే తన కీర్తనను ప్రజలకు నేర్పుట

44 మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వినగలిగేటట్లు ఈ పాటలోని మాటలన్నీ చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ మోషేతో ఉన్నాడు. 45 మోషే ప్రజలకు ఈ ప్రబోధాలు చేయటం ముగించినప్పుడు 46 వాళ్లతో అతడు ఇలా చెప్పాడు: “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ పిల్లలు విధేయులు కావాలని మీరు వారికి చెప్పాలి. 47 ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. అవి మీకు జీవం. యొర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.”

నెబో కొండ మీద మోషే

48 ఈ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు, 49 “అబారీము పర్వతాలకు వేళ్లుము. ఎరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి ఎక్కివెళ్లు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు. 50 నీవు ఆ కొండమీద చనిపోతావు. హూరు కొండమీద నీ సోదరుడు ఆహరోను చనిపోయి, తన ప్రజలను చేరుకున్నట్టు నీవు కూడ చనిపోయిన నీ ప్రజలను చేరుకుంటావు. 51 ఎందుకంటే సీను అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు. 52 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు ఇప్పుడు నీముందర చూడ వచ్చు గాని నీవు దానిలో ప్రవేశించలేవు.”

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

యెషయా 59

చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి

59 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు. కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు. నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది. ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు. విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు.

ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి. వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు.

కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు. కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం. ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.

ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది

న్యాయం, మంచితనం అంతా పోయింది.
చీకటి మాత్రమే మనవద్ద ఉంది.
    అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి.
ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం.
    కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.
10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం.
    మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం.
అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం.
    పగటి వెలుగులో కూడా మనం చూడలేం.
    మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.
11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం.
    పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం.
మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం.
    కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు.
మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం,
    కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.
12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక.
    మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి.
ఈ పనులు చేసి మనం దోషులంగా
    ఉన్నామని మనకు తెలుసు.
13 మనం పాపంచేసి,
    యెహోవాకు విరోధంగా తిరిగాం.
మనం యెహోవా నుండి తిరిగిపోయి,
    ఆయన్ని విడిచిపెట్టేశాం.
చెడు విషయాలను మనం ఆలోచించాం.
    దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం.
వీటిని గూర్చి మనం ఆలోచించి,
    మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.
14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది.
    న్యాయం దూరంగా నిలుస్తుంది.
సత్యం వీధుల్లో పడిపోయింది.
    మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.
15 సత్యం పోయింది.
    మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.

యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
    యెహోవాకు ఇష్టం కాలేదు.
16 యెహోవా చూశాడు.
    నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు.
కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు.
    మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
    యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు.
    రక్షణ శిరస్త్రాణం ధరించాడు.
    శిక్షను వస్త్రాలుగా ధరించాడు.
    బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు
    కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
    యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు.
కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు.
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు.
    యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు.
    పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.

21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.

మత్తయి 7

ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము

(లూకా 6:37-38, 41-42)

“ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు. మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు.

“మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు? మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు? కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు.

“పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి.

నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము

(లూకా 11:9-13)

“అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.

“రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? 10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? 11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.

అతి ముఖ్యమైన నియమం

12 “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం.

పరలోకానికి, నరకానికి మార్గాలు

(లూకా 13:24)

13-14 “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.

ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది

(లూకా 6:43-44; 13:25-27)

15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. 16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. 19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. 20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. 22 ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. 23 అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.

తెలివిగలవాడు, తెలివిలేనివాడు

(లూకా 6:47-49)

24 “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము. 25 ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.

26 “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము. 27 వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.

28-29 యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International