M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడటం
1 ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువైపునగల అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు మధ్యవుంది.
2 హోరేబు కొండనుండి (సీనాయి) కాదేషు బర్నేయాకు శేయీరు కొండలద్వారా ప్రయాణం పదకొండు రోజులు మాత్రమే పడుతుంది. 3 అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒకటవ తేది. వారితో చెప్పమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు. 4 ఇది సీహోనును, ఓగును యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. సీహోను అమోరీయుల రాజు. సీహోను హెష్బోనులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్పారోతు, ఎద్రేయిలో నివసించాడు. 5 ఇప్పుడు వారు యొర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:
6 “మన దేవుడైన యెహోవా హోరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు. 7 కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూవున్న యొర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర ప్రాంతం అన్ని చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి, యూఫ్రటీసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి. 8 చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధీనం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.’”
మోషే నాయకులను ఎంపిక చేయుట
9 అప్పుడు మోషే అన్నాడు: “‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చెప్పాను. 10 మీ దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది ప్రజలను అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు. 11 మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1,000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక! 12 కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను. 13 కనుక ప్రతి వంశంనుండి కొందరు ప్రతినిధులను ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్నుకోండి’ అని మీతో చెప్పాను.
14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు.
15 “కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగాహన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1,000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిని 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారాలుగా చేసాను.
16 “ఈ నాయకులను మీకు న్యాయమూర్తులుగా ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. ‘మీ ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేలు వ్యక్తికీ, మరో పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి. 17 మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకే విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’ 18 మీరు చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయంలోనే నేను మీతో చెప్తాను.
గూఢచారులు కనాను వెళ్లటం
19 “అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనం చేసాము. మనం హోరేబు (సీనాయి) కొండను విడిచి, ఆమోరీయుల కొండ దేశంవైవు ప్రయాణం చేసాము. మీరు చూసిన ఆ మహా భయంకర అరణ్యం అంతటి గుండా మనం వెళ్లాము. కాదేషు బర్నేయాకు మనం వచ్చాం. 20 అప్పుడు నేను మీతో చెప్పాను: ‘ఇప్పుడు మీరు అమోరీయుల కొండ దేశానికి వచ్చారు. మన యెహోవా దేవుడు ఈ దేశాన్ని మనకు ఇస్తాడు. 21 చూడండి, అదిగో అదే ఆ దేశం. వెళ్లి ఆ దేశాన్ని మీ స్వంతం చేసుకోండి. మీరు ఇలా చేయాలని మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పాడు. అందుచేత భయపడకండి, దేనిని గూర్చీ చింతపడకండి!’
22 “అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి ‘ఆ దేశాన్ని చూసేందుకు మనకంటే ముందుగా మనుష్యుల్ని పంపిద్దాము, వారు తిరిగి వచ్చి మనం వెళ్లాల్సిన మార్గం మనకు చెబుతారు. మనకు వచ్చే పట్టణాలను గూర్చి కూడ వారు చెప్పగలుగుతారు అన్నారు.’
23 “అది మంచి తలంపు అని నేను అనుకొన్నాను. కనుక ఒక్కోవంశం నుండి ఒకరి చొప్పున మీలోనుండి పన్నెండు మందిని నేను ఎన్నుకొన్నాను. 24 అప్పుడు ఆ మనుష్యులు బయల్దేరి ఆ కొండ దేశానికి వెళ్లారు. వారు ఎష్కోలు లోయకు వచ్చి దానిని పరిశోధించారు. 25 ఆ దేశంలోని ఫలాలు కొన్నింటిని తీసుకొని వారు మా దగ్గరకు తిరిగి తెచ్చారు. వారు మాకు సమాచారం అందిస్తూ ‘అది మన యెహోవా దేవుడు మనకు యిస్తున్న మంచి దేశం’ అని చెప్పారు.
26 “కాని ఆ దేశంలో ప్రవేంశించటానికి మీరు నిరాకరించారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. 27 మీ గుడారాల్లో మీరు ఫిర్యాదులు చేసారు, మీరు అన్నారు: ‘యెహోవా మనలను ద్వేషిస్తున్నాడు. అమోరీయులు మనలను నాశనం చేసేటట్టు, వారికి మనలను అప్పగించటానికే ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. 28 ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని[a] మేము చూశాము’ అని వారు చెప్పారు.
29 “అప్పుడు నేను మీతో చెప్పాను: ‘దిగులు పడకండి. ఆ మనుష్యుల విషయం భయపడవద్దు. 30 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా పోరాడుతాడు. ఆయన ఈజిప్టులో చేసినట్టే దీన్నికూడ చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం 31 అరణ్యములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని మోసినట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోసిందీ మీరు చూశారు. ఇంత దూరం ఈ స్థలానికి యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు.’
32 “అయినప్పటికీ మీరు యింకా మీ దేపుడైన యెహోవాను విశ్వసించలేదు. 33 మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పాళెము కోసం స్థలం చూసేందుకు ఆయన మీకు ముందుగా వెళ్లాడు. మీరు ఏ మార్గాన వెళ్లాల్సిందీ మీకు చూపెట్టేందుకు రాత్రివేళ అగ్నిలోను, పగటివేళ మేఘములోను ఆయన మీకు ముందు వెళ్లాడు.
కనానులోనికి ప్రవేశించేందుకు ప్రజలు అనుమతింపబడలేదు
34 “మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు: 35 ‘ఇప్పుడు జీవిస్తున్న దుష్టప్రజలైన మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు. 36 యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికి యిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక’.
37 “మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు: ‘నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు. 38 అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలోనికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’ 39 మరియు యెహోవా మనతో చెప్పాడు; ‘మీ చిన్న పిల్లలను మీ శ్రతువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్లు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు. 40 కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.’
41 “అప్పుడు మీరు, ‘మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు యెహావా దేవుడు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం యిప్పుడు మేము వెళ్లి పోరాడుతాము’ అని అన్నారు.
“అప్పుడు మీరు ఒక్కొక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం అని మీరు అనుకొన్నారు. 42 అయితే, ‘అక్కడికి వెళ్లి యుద్ధం చేయవద్దని ప్రజలతో చెప్పు, ఎందుకంటే నేను వారికి తోడుగా ఉండను, వారి శత్రువులు వారిని ఓడించేస్తారు’ అని యెహోవా నాతోచెప్పాడు.
43 “కనుక నేను మీతో మాట్లాడాను. కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. మీ స్వంత శక్తి ప్రయోగించవచ్చని మీరనుకొన్నారు. 44 అందుచేత మీరు ఆ కొండ దేశం మీదికి వెళ్లారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న అమోరీయులు మీ మీద యుద్ధానికి వచ్చారు. తేనెటీగల దండు మనుష్యులను తరిమినట్టు వారు మిమ్ములను తరిమారు. శేయీరునుండి హోర్మా వరకు మిమ్మల్ని తరిమి, అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు. 45 అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవాకు మొర్ర పెట్టారు. కాని యెహోవా మీ మొర్ర వినలేదు. మీ మొర్ర వినటానికి ఆయన నిరాకరించాడు. 46 కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.”
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
యెరూషలేమును దేవుడు శక్షిస్తాడు
29 దేవుడు చెబుతున్నాడు, “అరీయేలును చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొనసాగుతున్నాయి. 2 అరీయేలును నేను శిక్షించాను ఆ పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ అది ఎప్పటికీ నా అరీయేలే.
3 “నీ చుట్టూ సైన్యాలను ఉంచాను అరీయేలూ. నీకు విరోధంగా నేను యుద్ధగోపురాలను లేపాను. 4 నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడు ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలలోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.”
5 అక్కడ చాలామంది క్రొత్తవాళ్లు దుమ్ముకణాల్లా ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటి క్రూరమైన మనుష్యులు చాలామంది అక్కడ ఉన్నారు. 6 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, భూకంపాలు, మహా గొప్ప శబ్దాలు ప్రయోగించి యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన గాలులు, కాల్చివేసే అగ్ని ఉపయోగించి యెహోవా నాశనం చేశాడు. 7 అరీయేలు మీద ఎన్నెన్నో దేశాలు యుద్ధం చేశాయి. అది రాత్రి వేళ కలిగే భయంకరపీడ కలలాంటిది. అరీయేలు చుట్టూ సైన్యాలు వచ్చేసి దానిని శిక్షించాయి. 8 కానీ ఆ సైన్యాలకు కూడ అది ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవసరమైనవి దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కలవచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కోంటాడు, దాహంతోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యాలన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు కావాలనుకొన్నవి దొరకవు.
9 ఆశ్చర్యపడండి, విస్మయం చెందండి!
మీరు మత్తులవుతారు కాని ద్రాక్షరసంతో కాదు,
చూచి ఆశ్చర్యపడండి!
మీరు తూలి, పడతారు కానీ మద్యంతో కాదు.
10 యెహోవా మిమ్మల్ని నిద్రబుచ్చుతాడు
యెహోవా మీ కళ్లు మూస్తాడు (ప్రవక్తలే మీ కళ్లు)
యెహోవా మీ తలలు కప్పుతాడు (ప్రవక్తలే మీ తలలు.)
11 ఈ సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు గ్రహించరు అని నేను మీతో చెబుతున్నాను. మూసివేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాటల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు వుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు. 12 లేకపోతే చదవటం రానివాడికి మీరు ఆ పుస్తకం ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. ఆ వ్యక్తి, “నాకు చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు.
13 నా ప్రభువు అంటున్నాడు, “ఈ ప్రజలు నన్ను ప్రేమిస్తున్నామని వారు అంటారు. వారి నోటి మాటలతో నన్ను ఘనపరుస్తారు. కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మానవపరమైన నియమాలను కంఠస్థం చేయటం తప్ప వారు నాకు చూపించే గౌరవం ఇంకొకటి లేదు. 14 అందుచేత శక్తిగల, అద్భుత కార్యాలు ఇంకా చేస్తూనే ఉండి, నేను ఈ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాను. వారి జ్ఞానులు తమ జ్ఞానం పోగొట్టుకొంటారు. వారి జ్ఞానులు గ్రహించలేక పోతారు.”
15 ఆ ప్రజలు విషయాలను యెహోవాకు తెలియకుండా దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు. యెహోవా గ్రహించలేడు అని వారు అనుకొంటారు. వారు తమ చెడుకార్యాలను చీకట్లో చేస్తారు. “మనల్ని ఎవరూ చూడలేరు. మనం ఎవరయిందీ ఎవరూ తెలుసుకోలేరు” అని వారు చెప్పుకొంటారు.
16 మీరు గందరగోళం అయ్యారు. మట్టి, కుమ్మరికి సమానం అని అనుకొంటారు మీరు. “నీవేమి నన్ను తయారు చేయలేదు” పొమ్మని సృష్టించబడినది, తనను సృష్టించిన వానితో చెప్పొచ్చని మీరు తలస్తారు. “నీకు తెలియదులే” అని కుమ్మరితో కుండ చెప్పినట్టుంది ఇది.
ఒక మంచి సమయం వస్తుంది
17 అసలు సత్యం ఇది. కొంచెం కాలం తర్వాత కర్మెలు పర్వతంలాగే లెబానోను పర్వతం కూడ మంచినేల అవుతుంది. మరియు కర్మెలు పర్వతం దట్టమైన అరణ్యంలా ఉంటుంది. 18 చెవిటివారు కూడ గ్రంథంలోని మాటలు వింటారు. గ్రుడ్డివారు చీకటి, మంచుగుండా చూస్తారు. 19 పేద ప్రజలను యెహోవా సంతోషపరుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునిలో పేద ప్రజలు ఆనందిస్తారు.
20 నీచులు, కృ-రులు అంతమయిన తర్వాత ఇది జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది. 21 (ఆ మనుష్యులు మంచివాళ్లను గూర్చి అబద్ధం చెబుతారు. వారు న్యాయస్థానంలో ప్రజలను మోసం చేయాలని చూస్తారు. నిర్దోషులను వారు నాశనం చేయాలని చూస్తారు.)
22 కనుక యాకోబు వంశంతో యెహోవా మాట్లాడుతున్నాడు. (ఈ యెహోవాయే అబ్రాహామును విడిపించింది.) యెహోవా చెబుతున్నాడు: “ఇప్పుడు యాకోబు (ఇశ్రాయేలు ప్రజలు) ఇబ్బందిపడడు, సిగ్గుపడడు. 23 అతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా నామం పవిత్రం అని చెబు తాడు. ఈ ప్రజలందర్నీ నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరిశుద్ధుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు చెబుతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మానిస్తారు. 24 ఈ ప్రజల్లో చాలా మందికి అర్థం గాక చెడ్డపనులు చేశారు. ఈ ప్రజలు అర్థం చేసికోలేదు కానీ వాళ్ల పాఠం వాళ్లు నేర్చుకొంటారు.”
1 నా ప్రియ మిత్రుడైన గాయునకు,
పెద్దనైన నాకు నీపట్ల నిజమైన ప్రేమ ఉంది.
2 ప్రియ మిత్రమా! నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను. 3 కొందరు సోదరులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. నీవేవిధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. 4 నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.
5 ప్రియ మిత్రమా! ఆ సోదరులు నీకు పరాయి వాళ్ళయినా వాళ్ళకోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో చేస్తున్నావు. 6-7 నీ ప్రేమను గురించి వాళ్ళు సంఘానికి చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళనుండి సహాయం కోరక క్రీస్తు పేరు కోసం బయలుదేరారు. నీవు దేవునికి నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేసావు. 8 సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి.
9 నేను సంఘానికి వ్రాసాను. కాని దియొత్రెఫే తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు కనుక, మనకు సుస్వాగతం చెప్పలేదు. 10 దానితో తృప్తి పడక సోదరులకు సుస్వాగతం చెప్పటానికి అంగీకరించటం లేదు. పైగా సుస్వాగతం చెప్పేవాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘంనుండి బహిష్కరిస్తున్నాడు. అందువల్ల నేను వస్తే అతడు మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడుతున్నాడో కనుక్కుంటాను.
11 ప్రియ స్నేహితుడా! చెడుననుసరించటం మాని మంచిని అనుసరించు. మంచి చేసినవాణ్ణి దేవుడు తనవానిగా పరిగణిస్తాడు. చెడు చేసినవాడెవ్వడు దేవుణ్ణి ఎరుగడు.
12 దేమేత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో మాట్లాడుకొంటారు. సత్యమే అతణ్ణి గురించి సదాభిప్రాయము కలిగిస్తుంది. మేము కూడా అతణ్ణి గురించి సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము చెపుతున్నది నిజమని నీకు తెలుసు.
13 నేను నీకు వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాని సిరాతో, కలంతో వ్రాయాలని అనిపించటం లేదు. 14 నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. 15 నీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు.
© 1997 Bible League International