Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 24

బిలాము మూడో సందేశం

24 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు. బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు.
నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను.
    నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను.
    నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.

“యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
భూమి మీద మీ గుడారాలు లోయల్లా
    పరచుకొన్నాయి.
అవి నదీ తీరంలో
    తోటలా ఉన్నాయి.
యెహోవా నాటిన అది చక్కటి
    సువాసనగల మొక్కలా ఉంది.
అది నీళ్ల దగ్గర పెరిగే
    అందమైన చెట్లలా ఉంది.
మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది.
    మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు.
ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు.
    వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.

“ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు.
    వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు.
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు.
    వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు.
వారు నిద్రపోతున్న కొదమ
    సింహంలా ఉన్నారు.
దానిని మేల్కొలి పేందుకు
    ఎవడికి ధైర్యం చాలదు.
నిన్ను ఆశీర్వదించే వారు
    ఆశీర్వాదం పొందుతారు.
నిన్ను ఎవరైనా శపిస్తే వారికి
    గొప్ప కష్టాలు వస్తాయి.”

10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. 11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”

12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”

బిలాము చివరి సందేశం

15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి.
విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి.
    మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను.
    నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను.
    నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.

17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు.
    ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు.
యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది.
    ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు.
    షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు.
అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు[a] దొరుకుతాయి.

19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
పట్టణంలో ఇంకా బ్రతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”

20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది.
    కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!

21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం.
    ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు.
అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”

23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు:

“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బ్రతకలేడు.
24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి.
ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి.
    అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి.”

25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.

కీర్తనలు. 66-67

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

యెషయా 14

ఇశ్రాయేలు తిరిగి వస్తుంది

14 భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు. ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు. యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.

బబులోను రాజు గురించి ఒక గీతం

ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు.

ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు.
    కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది.
చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు.
    వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు.
బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు
    దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు
దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు.
    ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు.
అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది.
    ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు పెడుతున్నారు.
నీవు ఒక దుష్ట రాజువు
    కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది.
చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
    లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు.
    కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు.
    అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”
నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది.
    భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది.
    పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.
10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు.
    “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి.
    ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు.
11 నీ గర్వం పాతాళానికి పంపబడింది.
    నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి.
కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు.
    పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి.
12 ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా!
    నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.?
జనాంగాన్ని పతనం చేసే నీవు
    భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు.
13 నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పుకొన్నావు:
    “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను.
    పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను.
    నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను.
    పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను.
    దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.
14 మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను.
    నేను, మహోన్నతుడైన దేవునిలా ఉంటాను.”
15 కానీ అది జరుగలేదు.
    నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతిలోనికి పాతాళానికి నీవు క్రిందికి తీసుకొని రాబడ్డావు.
16 ప్రజలు నిన్ను చూచి, నీ విషయం ఆలోచిస్తారు. నీవు కేవలం చచ్చిన శవం మాత్రమేనని
    ప్రజలు గమనిస్తారు. ప్రజలు అంటారు,
“భూలోక రాజ్యాలన్నింటిలో భయం పుట్టించినవాడు వీడేనా?
17     పట్టణాలను నాశనం చేసినవాడు వీడేనా? దేశాన్ని ఎడారిగా మార్చినవాడు వీడేనా?
యుద్ధంలో మనుష్యుల్ని బంధించి, వారిని ఇంటికి వెళ్లనీయనివాడు వీడేనా?”
18 భూమిమీద ప్రతి రాజూ ఘనంగా మరణించాడు.
    ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది.
19 అయితే నీవు, దుష్ట రాజువి నీ సమాధిలోనుండి త్రోసి వేయబడ్డావు.
    నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది.
నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు.
    మిగతా సైనికులు వాని మీద నడిచారు.
ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు.
    నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.
20 ఇంకా ఎంతోమంది రాజులు చనిపోయారు. వారందరికీ వారి సమాధులు ఉన్నాయి.
    కానీ నీవు వాళ్లను చేరవు.
ఎందుకంటే, నీవు నీ స్వంత దేశాన్ని నాశనం చేశావు
    గనుక నీ స్వంత ప్రజల్నే నీవు చంపేశావు.
నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం చేయటం కొనసాగించరు. నీ పిల్లలు ఆపుజేయబడతారు.

21 అతని పిల్లలను చంపటానికి సిద్ధపడండి.
    వారి తండ్రి దోషి గనుక వాళ్లను చంపండి.
అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోరు.
    అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ప్రపంచాన్ని తమ పట్టణాలతో నింపరు.

22 “నేను నిలబడి ఆ ప్రజలకు విరోధంగా యుద్ధం చేస్తాను. ప్రఖ్యాత బబులోను పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. బబులోను ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను. వారి పిల్లలను, మనుమళ్లను, మునిమనుమళ్లను నేను నాశనం చేస్తాను” అని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు. యెహోవా తానే ఆ విషయాలు చెప్పాడు.

23 “బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.

దేవుడు అష్షూరును కూడా శిక్షిస్తాడు

24 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక ప్రమాణం చేశాడు. యెహోవా చెప్పాడు, “సరిగ్గా నేను తలచినట్టే ఈ సంగతులు జరుగుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం ప్రకారమే జరుగుతాయి. 25 అష్షూరు రాజును నేను నా దేశంలో నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్టాడు. యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయబడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది. 26 నేను నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలంప్రయోగిస్తాను.”

27 యెహోవా ఒక పథకం వేసినప్పుడు ఆ పథకాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రజలను శిక్షించేందుకు యెహోవా తన చేయి పైకెత్తినప్పుడు, దానిని ఎవ్వరూ అడ్డగించలేరు.

ఫిలిష్తీయులకు దేవుని సందేశం

28 విచారకరమైన ఈ సందేశం ఆహాబు రాజు చని పోయిన సంవత్సరం ఇవ్వబడింది.

29 ఓ ఫిలిష్తీ దేశమా, నిన్ను కొట్టే రాజు చనిపోయాడని నీవు సంతోషిస్తున్నావు. కానీ నీవు నిజంగా సంతోషపడకు. అతని పరిపాలన అంతమయిపోయింది, నిజమే. కానీ రాజు కుమారుడు వస్తాడు. పరిపాలిస్తాడు. అది ఒక సర్పం తనకంటె మరింత ఎక్కువ ప్రమాదకరమైన సర్పానికి జన్మ ఇచ్చినట్టు ఉంటుంది. 30 కానీ నా దీన ప్రజలు మాత్రం క్షేమంగా భోజనం చేయగలుగుతారు. వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ దీనప్రజలు పండుకొని, క్షేమంగా ఉంటారు. కానీ నేను మీ కుటుంబాన్ని ఆకలితో చంపేస్తాను. మిగిలిన మీ ప్రజలంతా చనిపోతారు.

31 పట్టణ ద్వారం దగ్గర ఉండే ప్రజలారా కేక వేయండి.
    పట్టణ ప్రజలారా, గట్టిగా కేకలు వేయండి.
ఫిలిష్తియాలోని ప్రజలారా, మీరు భయపడతారు.
    మీ ధైర్యం వేడి మైనంలా కరిగిపోతుంది.

ఉత్తరంగా చూడండి.
    అక్కడ ధూళి మేఘం ఉంది.
అష్షూరు నుండి ఒక సైన్యం వస్తోంది.
    ఆ సైన్యంలో మనుష్యులంతా బలంగా ఉన్నారు.
32 ఆ సైన్యం, వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు ఏమని చెబుతారు?
    ఫిలిష్తియా ఓడిపోయింది. అని వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బలపర్చాడు.
    ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి వెళ్లారు.

1 పేతురు 2

అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.

మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:

“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
    పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)

ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:

“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
    రాయి మూలకు తలరాయి అయింది.”(B)

మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:

“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
    ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)

దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.

కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.

10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
    ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
    కాని యిప్పుడు లభించింది.

దేవుని కోసం జీవించండి

11 ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 12 యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.

పరిపాలకుల పట్ల, అధికారుల పట్ల వినయం

13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, 14 లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు. 15 మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక. 16 స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి. 17 అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.

క్రీస్తు శ్రమకు మాదిరి

18 బానిసలారా! మీ యజమానులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి, పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి. 19 ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. 20 నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది. 21 దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.

22 “ఆయన ఏ పాపం చేయలేదు!
    ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”(D)

23 వారాయన్ని అవమానించినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. 24 ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి. 25 ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International