M’Cheyne Bible Reading Plan
అహరోను ప్రధాన యాజకుడని దేవుడు రుజువు చేయటం
17 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి పన్నెండు చేతికర్రలు తీసుకురా. పన్నెండు వంశాలలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి. 3 లేవీ వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి. 4 సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. 5 ఒక్క మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ప్రజలు నీకు, నాకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపుచేస్తాను.”
6 కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి మధ్య అహరోను కర్ర ఉంది. 7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు.
8 ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది. 9 కనుక యెహోవా స్థానం నుండి మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు.
10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా వారు చావకుండా ఉంటారు.” 11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు.
12 ఇశ్రాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా నశించిపోయాము. 13 ఎవరైనా యెహోవా పవిత్ర స్థలం సమీపంగా వచ్చినా సరే చస్తారు. మేము అందరము చనిపోతామా?” అని మోషేతో అన్నారు.
యాజకుల, లేవీయుల పని
18 అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచారాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరేకంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు బాధ్యులు. 2 నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు సహాయం చేస్తారు. 3 లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు. 4 వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు.
5 “పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత, ఇశ్రాయేలు ప్రజల మీద నేను మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. 6 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం. 7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.”
8 అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా చెప్పాడు: “నాకు అర్పించబడిన అర్పణలన్నింటిమీద నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు నాకు అర్పించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. ఎప్పుడూ అవి మీకే చెందుతాయి. 9 దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి. 10 అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి.
11 “ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు.
12 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు. 13 ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ అవి తినవచ్చును.
14 “ఇశ్రాయేలులో యెహోవాకు అర్పించబడిన ప్రతిదీ నీదే.
15 “ఒక కుటుంబంలో, మనిషికి గాని జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు అర్పించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే చెందుతుంది. 16 వారు ఒక నెల వయసులో ఉన్నప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల అయిదు తులాల వెండి.
17 “అయితే ఆవులలో, గొర్రెలలో మేకలలో మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ జంతువులు పవిత్రం – పరిశుభ్రం. వాటి రక్తం బలిపీఠం మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది హోమంగా అర్పించబడిన అర్పణ. దీని వాసన యెహోవానగు నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. 18 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే. 19 పవిత్ర కానుకలుగా ప్రజలు అర్పించేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేను ఇస్తాను, ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్ధానం. నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.”
20 అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు స్వంతంగా కలిగి ఉన్నవి ఏవి నీకు స్వంతంగా ఉండవు. నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. అయితే నీకు మాత్రం నేనే నీ కానుకగా ఉంటాను.
21 “ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం. 22 అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించి మరీచస్తారు. 23 సన్నిధి గుడారంలో పనిచేసే లేవీ ప్రజలే, దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ ఆజ్ఞ భవిష్యత్ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని లేవీ ప్రజలు మాత్రం పొందరు. 24 అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతునాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.”
25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 26 “లేవీ ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు చెందుతుంది. అయితే అందులో పదోవంతు యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి. 27 పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ యెహోవాకు మీ అర్పణలు. 28 ఈ విధంగా ఇతర ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహోవాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. దానిలో పదోవంతును మీరు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29 ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానంతటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, వాటిలో శ్రేష్ఠమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యేకించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు.
30 “మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారి పంటలో నుండి, ద్రాక్షారసంలో నుండి పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో శ్రేష్ఠమైన భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి. 31 మిగిలి పోయినదంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం. 32 మరియు ఎల్లప్పుడూ దానిలోని శ్రేష్ఠ భాగాన్నే మీరు యెహోవాకు ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.”
సంగీత నాయకునికి: వాయిద్యాలతోపాడునది. దావీదు ప్రార్థన.
55 దేవా, నా ప్రార్థన వినుము.
దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
2 దేవా, దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.
నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పినదాన్నిబట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.
నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు.
వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
4 నాలో నా గుండె అదురుతోంది.
నాకు చచ్చిపోయేటంత భయంగా ఉంది.
5 నాకు భయము మరియు వణకుగా ఉంది.
నేను భయపడిపోయాను.
6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.
నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
8 నేను పరుగెత్తి పోదును.
నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.
ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.
ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.
ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే
దానిని నేను భరించగలను.
ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే
నేను దాక్కోగలను.
13 కాని, అది చేస్తున్నది నీవే.
నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
14 మనం కలిసి మధుర సంభాషణ చేసేవాళ్లము.
దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.
వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను.
ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.
యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబుతాను.
ఆయన నా మాట వింటాడు.
18 నేను చాలా యుద్ధాలు చేశాను.
కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
19 దేవుడు అనాది కాలంనుండి సింహాసనాసీనుడు.
నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు.
నా శత్రువులు వారి బ్రతుకులు మార్చుకోరు.
వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.
అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.
కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు.
వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి
కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు
ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు.
మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
23 కాని దేవా! దుష్టులను సమాధి అనే గుంటలోనికి అణచివేస్తావు.
రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్ధకాలమైనా జీవించరు.
కాని నేనైతే నీయందే విశ్వసిస్తాను.
సిరియాతో చిక్కు
7 ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.
2 దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.
3 అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.
4 “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు. 5 వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. 6 మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు.
7 నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు. 8 రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. 9 ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”
ఇమ్మానుయేలు-దేవుడు మనతో ఉన్నాడు
10 అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు. 11 యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”
12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.
13 అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. 14 కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు.
ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని,
ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
15 అతను పెరుగు, తేనె తినును
చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు.
16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే
ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయిపోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.
17 “కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.
18 “ఆ సమయంలో యెహోవా ‘జోరీగల్ని’ రప్పిస్తాడు. (ఆ ‘జోరీగలు’ ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పిస్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్షూరు దేశంలో ఉన్నాయి.) ఈ శత్రువులు మీ దేశానికి వస్తారు. 19 ఈ శత్రువులు అరణ్యపు బండ సందుల దగ్గర మెట్టల లోయల్లోను, పొదల దగ్గర, నీటి మడుగుల దగ్గర ఉంటాయి. 20 యూదాను శిక్షించటానికి యెహోవా అష్షూరును వాడుకొంటాడు. అష్షూరు కూలికి వినియోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడుతుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెంట్రుకలను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. అది యూదా గడ్డాన్ని యోహోవా గీసేస్తున్నట్టుగా ఉంటుంది.
21 “ఆ సమయంలో ఒక మనిషి ఒక ఆవును, రెండు గొర్రెలను మాత్రమే ప్రాణంతో ఉంచుకో గలుగుతాడు. 22 ఆ ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి పెరుగు, తేనె మాత్రమే తింటాడు. 23 ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షావల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్షావల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కాని ఈ పొలాలు గచ్చపొదలు, బలురక్కసి చెట్లతో నిండిపోతాయి. 24 దేశం అడవిగా తయారై, వేట ప్రదేశంగా మాత్రమే ఉపయోగపడుతుంది. 25 ఒకప్పుడు ఈ కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చపొదలతో, బలురక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.”
1 దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా:
విశ్వాసము, జ్ఞానము
2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
ధనము, దరిద్రము
9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.
పరీక్షలు, దుర్బుద్ధులు
12 పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. 13 ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. 14 దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. 15 దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది.
16 నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. 17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.
వినటం, చెయ్యటం
19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.
22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.
దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం
26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.
© 1997 Bible League International