M’Cheyne Bible Reading Plan
పవిత్ర గుడారపు ప్రతిష్ఠ
7 పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.
2 అప్పుడు ఇశ్రాయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లెక్కబెట్టారు. 3 ఈ నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు.
4 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: 5 “నాయకుల దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.”
6 కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు. 7 గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. 8 తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. ఆ మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు బాధ్యుడు. 9 కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని.
10 బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు. 11 “ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు.
12-83 [a] పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా:
ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది.
ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి.
మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడు, అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడు, అమీహోదు కుమారుడైన ఎలీషామా తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాని తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడు, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకొని వచ్చాడు.
84 కనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకులనుండి వచ్చిన కానుకలు. మోషే ప్రత్యేక తైలము పోసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారు ఈ వస్తువులను తెచ్చారు. వెండి పళ్లెములు పన్నెండు, వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు వారు తీసుకుని వచ్చారు. 85 ఒక్కో వెండి పళ్లెం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 తులాలు. వెండిపళ్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 2,400 తులాల బరువు. 86 ధూపద్రవ్యంతో నిండిన పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపార్తులు కలిసి 120 తులాల బరువు కలవి.
87 దహనబలి అర్పణకు మొత్తం జంతువులు పన్నెండు కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి. 88 సమాధాన బలిగా వధించి ఉపయోగించేందుకు కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. ఈ జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్లలు 60 బలిపీఠం ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ అర్పణలుగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా బలిపీఠం మీద ప్రత్యేక తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ప్రతిష్ఠించారు.
89 యెహోవాతో మాట్లాడేందుకు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడుతున్న యెహోవా స్వరం అతడు విన్నాడు. ఒడంబడిక పెట్టెపైనున్న కరుణాపీఠంమీది రెండు కెరూబుదూతల మధ్య భాగంనుండి ఆ స్వరం వస్తోంది. ఇలా దేవుడు మోషేతో మాటలాడాడు.
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
2 దేవా, నీవే నా క్షేమ స్థానం.
నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
నేనెందుకు విచారంగా ఉండాలి?
3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
నా దేవుడే నాకు సహాయము.
అతను అంటాడు
5 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను,
నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను,
తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను
నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను.
ప్రేమికులతో స్త్రీలు అంటారు
ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి!
ప్రేమను త్రాగి మత్తిల్లండి!
ఆమె అంటుంది
2 నేను నిద్రించానేగాని
నా హృదయం మేల్కొనేవుంది.
నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను
“నా ప్రియ సఖీ, ప్రేయసీ, నా పావురమా, పరిపూర్ణవతీ! తలుపు తెఱువు.
నా తల మంచుతో తడిసింది
నా జుట్టు రేమంచు జడికి నానింది.”
3 “నేను నా పైవస్త్రం తొలగించాను,
దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు.
నేను నా పాదాలు కడుక్కున్నాను.
అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”
4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు[a]
నేనతని పట్ల జాలినొందాను.[b]
5 నా చేతుల నుంచి జటామాంసి జారగా,
నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవ్యం తలుపు గడియ పైకి జాలువారగా
నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.
6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను,
కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు!
అతడు వెళ్లిపోయినంతనే
నా ప్రాణం కడగట్టింది.[c]
నేనతని కోసం గాలించాను.
కాని అతడు కనిపించలేదు.
నేనతన్ని పిలిచాను,
కాని అతడు బదులీయలేదు.
7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు
నన్ను కొట్టి,
గాయపరిచారు.
ప్రాకారం కావలివారు
నా పైవస్త్రాన్ని కాజేశారు.
8 యెరూషలేము స్త్రీలారా,
నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.
ఆమెకు యెరూషలేము స్త్రీల ప్రశ్నలు
9 అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి?
ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ?
అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?
యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం
10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు.
పదివేలలోనైన గుర్తింపుగలవాడు.
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి
నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి.
పాల మునిగిన పావురాలవలెను,
బంగారంలో పొదిగిన రత్నాల వలెను,
13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల
పరిమళ పుష్పరాశులవలెను,
అతని పెదవులు అత్తరువారి బోళంతో
తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు).
14 అతని చేతులు వజ్రాలు పొదిగిన
బంగారు కడ్డీల సమానం
అతని శరీరం నీలాలు తాపిన నున్నటి
దంత దూలము వలెను,
15 అతని పాదాలు బంగారు దిమ్మమీది
పాలరాతి స్తంభాల వలెను,
అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది
నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయును.
16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు,
అతని అధరం పెదవి అత్యంత మధురం
అతనే నా ప్రియుడు,
నా ప్రాణ స్నేహితుడు.
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
మీరింకా పసికందులు
11 ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది. 12 నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. 13 పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు. 14 కాని, ఆహారం ఎదిగినవాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.
© 1997 Bible League International