Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 21

వేరే నియమాలు, ఆజ్ఞలు

21 (అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:

“హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు. ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు. బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”

“అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి. ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”

“ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు. ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు. ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”

10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి. 11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”

12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి. 13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు. 14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”

15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చంపెయ్యాలి.”

16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”

17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”

18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు. 19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.

20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి. 21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”

22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. 23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, 25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”

26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే. 27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,

28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. 29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి. 30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.

31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి. 32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”

33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. 34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.

35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది. 36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”

లూకా 24

యేసు బ్రతికి రావటం

(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; యోహాను 20:1-10)

24 ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు. అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు.

ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? 6-7 ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.

9-10 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు. 11 ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. 12 అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.

ఎమ్మాయు దారి

(మార్కు 16:12-13)

13 అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది. 14 వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు. 15 వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు. 16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు. 17 యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు.

వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది. 18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!”

19 “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు.

వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు. 20 మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు. 21 ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము.

“పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. 22 అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు. 23 కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు. 24 మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.

25 యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? 26 క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు. 27 ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.

28 వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు. 29 కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.

30 వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు. 31 అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు. 32 ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు.

33 వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు. 34 వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.

35 ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.

యేసు తన శిష్యులకు కనిపించటం

(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)

36 వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.

37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు. 38 యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? 39 నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.

40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు. 41 వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. 42 వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.

44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.

45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! 47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. 48 మీరు వీటికి సాక్షులు. 49 నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.

యేసు పరలోకానికి వెళ్ళటం

(మార్కు 16:19-20; అపొ. కా. 1:9-11)

50 ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. 51 వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. 52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.

యోబు 39

39 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా?
    తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?
యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా?
    అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి.
    అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి.
    అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.

“యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు?
    వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?
అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను).
    అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.
అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు.
    ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.
అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి.
    అక్కడే అవి గడ్డి తింటాయి.
    తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.

“యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా?
    రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది?
10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా?
    నీ కోసం అది లోయలను దున్నుతుందా?
11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు
    నీవు దానిమీద ఆధార పడగలవా?
    మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?
12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు
    అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?

13 “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది.
    (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.
14 నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది.
    ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.
15 ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని
    లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.
16 నిప్పుకోడి తన పిల్లలను చూడదు.
    ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది.
    దాని పిల్లలు చస్తే దాని ప్రయాసం అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.
17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు.
    నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.
18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది.
    ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.

19 “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా?
    లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?
20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా?
    గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.
21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది.
    అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుతుంది
22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది.
    అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.
23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది.
    దాని రౌతు వద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.
24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది.
    బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.
25 బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓహో’ అంటుంది.
    దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది.
    సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.

26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?
27 యోబూ, పక్షిరాజు ఎగరాలని,
    పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?
28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది.
    ఆ బండ పక్షిరాజు యొక్క కోట.
29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది.
    దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.
30 పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి.
    అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”

2 కొరింథీయులకు 9

మీ ఇచ్చుబడి ఆశీర్వాదం

భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. సహాయం చెయ్యాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన సంవత్సరం నుండి యివ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియ ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని ప్రోత్సాహపరిచింది. వాళ్ళు కార్యనిర్వహణకు పూనుకొన్నారు. ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. ఒకవేళ మాసిదోనియవాళ్ళు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది. కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగుచేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది.

కొంచెముగా విత్తేవాడు కొద్దిపంటను మాత్రమే పొందుతాడు. అదే విధంగా ఎక్కువగా విత్తేవానికి పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకొండి. ఆనందంగా యిచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు:

“అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు
    అతని నీతి చిరకాలం ఉంటుంది.”(A)

10 రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. 11 మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు.

12 మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. 13 మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. 14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. 15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International