Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 19

లోతు అతిథులు

19 ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు. లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.”

“లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.

కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేశాడు. అందుచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేశాడు, వాళ్ల కోసం రొట్టెలు చేశాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.

ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు. “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.

లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూశాడు. “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బ్రతిమలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు. “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” అని లోతు ఆ మనుష్యులతో అన్నాడు.

“దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పి, లోతుకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.

10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేశారు. తర్వాత వాళ్లు తలుపు మూసేశారు. 11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్లు ఆ దేవదూతలు చేశారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గ్రుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.

సొదొమ నుండి తప్పించుకోవటం

12 “మీ కుటుంబాలకు చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి. 13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.

14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అని లోతు అన్నాడు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.

15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”

16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపాడు. 17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”

18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. 19 మీ సేవకుడనైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను. 20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” 21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను. 22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అన్నాడు. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)

సొదొమ, గొమొర్రాల నాశనం

23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు. 24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు. 25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేశాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.

26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి ఆ పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.

27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు. 28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు క్రిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.

29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేశాడు.

లోతు, అతని కుమార్తెలు

30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు. 31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు. 32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పడుకోవచ్చు.”

33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని త్రాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయి తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలిసికొన్నది. లోతు త్రాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పడుకొన్నదో, ఎప్పుడు లేచి వెళ్లినదో అతనికి తెలియలేదు.

34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదికి వెళ్లి ఆయనతో లైంగికంగా కలిసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.” 35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని త్రాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదికి వెళ్లి అతనితో పడుకొన్నది. అతని కుమార్తె అతనితో పడుకొన్నట్లు లోతుకు మరల తెలియలేదు.

36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి. 37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికి మోయాబు[a] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న మోయాబీయులందరికీ అతడు తండ్రి. 38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి[b] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న అమ్మోనీయులందరికీ బెన్నమ్మి తండ్రి.

మత్తయి 18

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మార్కు 9:33-37; లూకా 9:46-48)

18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.

యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.

“అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.

పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం

(మార్కు 9:42-48; లూకా 17:1-2)

“కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.

“మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.

తప్పిపోయిన గొఱ్ఱెల ఉపమానం

(లూకా 15:3-7)

10 “ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడకండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. 11 [a]

12 “ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు వున్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే, అతడు ఆ తొంబైతొమ్మిది గొఱ్ఱెల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు? 13 ఇది సత్యం, ఒక వేళ ఆ గొఱ్ఱె దొరికితే ఆ తప్పిపోని తొంబైతొమ్మిది గొఱ్ఱెలు తన దగ్గరున్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు. 14 అతనిలాగే పరలోకంలోవున్న నా తండ్రి ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు.

పాపం చేసిన సోదరుడు

(లూకా 17:3)

15 “మీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతణ్ణి మీరు జయించినట్లే! 16 ఒక వేళ అతడు మీ మాట వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. 17 వాళ్ళ మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాటకూడ వినకపోతే అతణ్ణి మీ వానిగా పరిగణించకండి.

18 “ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. 19 అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు. 20 ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”

క్షమించని సేవకుని ఉపమానం

21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[b] క్షమించాలని చెబుతున్నాను.

23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు[c] అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. 25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.

26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. 27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.

28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.

29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.

30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. 31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. 33-34 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”

నెహెమ్యా 8

ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవటం

ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.

ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు.

అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.

జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.

తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం[a] మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.

10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”

11 జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.”

12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు.

13 అటు తర్వాత, నెల రెండవ రోజున[b] అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు.

14-15 వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.”

16 సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. 17 చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!

18 ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు వరకు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.

అపొస్తలుల కార్యములు 18

కొరింథు

18 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు. అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోమా నగరం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీనుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.

ప్రతి విశ్రాంతి రోజూ సమాజమందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. మాసిదోనియనుండి సీల, తిమోతి వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు. కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.

పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు. యూదుల సమాజమందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని యింట్లోనివాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.

9-10 ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. 11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు.

పౌలు గల్లియో ఎదుటికి తీసుకురాబడ్డాడు

12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, 13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.

14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది. 15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. 16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానంనుండి తరిమివేసాడు.

17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకొన్నాడు.

అంతియొకయకు తిరిగి వెళ్ళటం

18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను, అకులను వదిలి తానొక్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు. 20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. 21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.

22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడినుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడినుండి అంతియొకయకు వెళ్ళాడు. 23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.

ఎఫెసులో అపొల్లో

24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. 25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. 26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధ విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.

27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించినవాళ్ళకు చాలా సహాయం చేసాడు. 28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International