M’Cheyne Bible Reading Plan
అబ్రాముతో దేవుని ఒడంబడిక
15 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, “అబ్రామా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అని దేవుడు అన్నాడు.
2 అయితే అబ్రాము అన్నాడు: “యెహోవా దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. 3 చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు ఉన్న ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”
4 అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకు ఉన్నవాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”
5 అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”
6 అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. 7 అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”
8 అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”
10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు. 11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు.
12 తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. 13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై, వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు. 14 అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.
15 “నీవు మట్టుకు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. 16 నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”
17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి, ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస[a] చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం.
18 కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను. 19 కేనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు, 20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు, 21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయుల దేశమిది.”
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మార్కు 6:14-29; లూకా 9:7-9)
14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. 2 అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.
యోహాను తల నరకటం
3 అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. 4 పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. 5 ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.
6 హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. 8 ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.
9 ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
అయిదువేల మందికి భోజనం
(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.
15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.
17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
యేసు నీళ్ళపై నడవటం
(మార్కు 6:45-52; యోహాను 6:16-21)
22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. 23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. 24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.
25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. 26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.
28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.
29 “రా” అని యేసు అన్నాడు.
అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. 30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.
31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.
32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. 33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.
యేసు రోగులనేకులను నయం చేయటం
(మార్కు 6:53-56)
34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. 35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి. 36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.
సన్బల్లటు, టోబీయా
4 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మిస్తున్నామన్న వార్తను సన్బల్లటు విన్నాడు. అతను కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను ఎగతాళి చెయ్యనారంభించాడు. 2 సన్బల్లటు తన మిత్రులతోనూ, షోమ్రోను సైన్యంతోనూ మాట్లాడాడు. అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అనుకుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అనుకుంటున్నారా వీళ్లు? బహూశః ఒక్క రోజులో ప్రాకార నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్లుంది వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, ధూళి కుప్పలు!”
3 సన్బల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీయా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!”
4 నెహెమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా దేవా, మా మొర ఆలకించు. వీళ్లకి మేమంటే ద్వేషం. ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తున్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్లు చెయ్యి దేవా. బానిసలుగా, చెరబట్టబడిన వాళ్ల మాదరిగా వాళ్లను సిగ్గుపడనియ్యి. 5 వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి పాపాలను క్షమించవద్దు. ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహపరిచారు.”
6 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము.
7 కాని, సన్బల్లటు, టోబియా, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్డోదువాసులు, కోపంతో నిండు కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంతలను పూడుస్తున్నట్లు వాళ్లు విన్నారు. ఈ విషయమై వాళ్లు అధికముగా కోపగించుకొని 8 ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు. 9 అయితే, మేము మా దేపుణ్ణి ప్రార్థించాము. అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలిగేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్లు కాపలా కోసం కాపలావారిని పెట్టాం.
10 అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము. 11 పోతే, మన శత్రువులేమో ఇలా అంటున్నారు: ‘యూదులపై మనము అకస్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను చూడకముందే, మనం ఎవరమో తెలిసికోకముందే మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.’”
12 తర్వాత మన శత్రువుల మధ్య నివసించే మన యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మనచుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు ప్రత్యక్షమౌతున్నారు” అంటూ పదే పదే చెప్పారు.
13 అందుకని, నేను కొందర్ని గోడ బాగా పోట్టిగా వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, శూలాలు, విల్లమ్ములతో నిలిపాను. 14 అప్పుడు నేను ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన జనంతో ఇల చెప్పాను: “మన శత్రువులంటే భయపడకండి. మన ప్రభువును తలుచుకోండి. యెహోవా గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం పోరాడాలి! మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం పోరాడాలి!”
15 తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రువులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్లు గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు. 16 ఆనాటి నుంచి నా మనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈటెలు, బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో నిమగ్నులయ్యారు. సేనాధిపతులు ప్రాకార నిర్మాణంలో నిమగ్నులైన యూదా ప్రజలందరి వెనుక నిలిచారు. 17 గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు. 18 పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన ప్రక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు నా ప్రక్కన నిలబడ్డాడు. 19 అప్పుడు నేను ఆయా ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం ఒకరికొకరం దూరంగా వున్నాము. 20 అందుకని, మీకు బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరుగున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు!”
21 ఈ విధంగా మేము యెరూషలేము ప్రాకార నిర్మాణపు పని కొనిసాగించాము. మాలో సగం మంది శూలాలు ధరించి నిలబడ్డారు. మేము ఉదయం పొద్దు పొడిచినప్పటినుంచి రాత్రి చుక్కలు పొడిచే దాకా పనిచేశాము.
22 అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా చెప్పాను: “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయకుడూ రాత్రివేళ యెరూషలేములోనే వుండిపోవాలి. అప్పుడు వాళ్లు రాత్రుళ్లు కాపలాదార్లుగా, పగళ్లు పని వాళ్లుగా ఉండగలుగుతారు.” 23 సరే, నేనుగాని, నా సోదరులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లుగాని, మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో ప్రతిఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు వెళ్లినప్పుడూ సైతం, ఆయుధాలు ధరించేవున్నాము.
ఈకొనియలో
14 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు. 2 వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.
3 కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేసాడు. 4 ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.
5 యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు. 6 కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 7 ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.
లుస్త్ర, దెర్బే పట్టణాల్లో
8 లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. 9 పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి, 10 “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు.
11 పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు. 12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. 13 వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు.
14 కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: 15 “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.
16 “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. 17 కాని ఆకాశంనుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.”
18 ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.
19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు. 20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.
పిసిదియ ప్రాంత సేవను బలపర్చటం
21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. 22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు. 23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించినవాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.
24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంఫూలియ చేరుకొన్నారు. 25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు. 26 అత్తాలియనుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.
సిరియా అంతియొకయకు తిరిగి రావటం
27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. 28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.
© 1997 Bible League International