M’Cheyne Bible Reading Plan
యూదా రాజుగా అమజ్యా
25 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ. 2 యెహోవా అతని నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు. 3 అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చంపిన అధికారులను అతడు చంపివేశాడు. 4 కాని అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే చనిపోవాలి.”[a]
5 యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశ పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి, సహస్రాధిపతులను, శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది ఏండ్ల యువకులు, అంతకు పైబడినవారు. ఈటెలు, డాళ్లు పట్టి యుద్ధానికి సిద్ధంగా వున్న మూడు లక్షల మంది నిపుణులైన సైనికులున్నారు. 6 ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి క్రింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు. 7 కాని ఒక దైవజ్ఞుడు (ప్రవక్త) అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “రాజా ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా ఎఫ్రాయిము[b] ప్రజలతో లేడు. 8 బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిట్టం చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.” 9 అమజ్యా దైవజ్ఞునితో, “అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి?” అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, “ప్రభువైన యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికంటె చాలా ఎక్కువ యివ్వగలడు!” అని చెప్పాడు.
10 అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు.
11 పిమ్మట అమాజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోము) కు చెందిన పదివేల మందిని అమజ్యా సైన్యం చంపివేసింది. 12 యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసుకొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బ్రతికే వున్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి త్రోసివేయగా వారి శరీరాలు క్రింద రాళ్ల పైబడి ముక్కలు ముక్కలై పోయాయి.
13 కాని అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ వుంది. బేత్హోరోను నుండి సమరయ (షోమ్రోను) వరకు వున్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడ మూడ వేల మందిని చంపి, చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వక పోవటంతో ఆ సైనికులు చాలా కోపగించి వున్నారు.
14 ఎదోమీయులను (శేయీరు వారిని) ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, వాటికి దూపం వేయసాగాడు. 15 అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
16 ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
17 యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించాడు. తరువాత యెహోయాషుకు ఒక వర్తమానం పంపాడు. యెహోయాషు, “మనం ఒకరితో ఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా కబురు పంపాడు. యెహోయాషు తండ్రిపేరు యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు.
18 పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజు. అమజ్యా యూదా రాజు. యెహోయాషు ఈ కథ చెప్పి పంపాడు: “లెబానోనుకు చెందిన ఒక చిన్న ముండ్ల పొద లెబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పోద, ‘నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి,’ అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసేసింది. 19 ‘నేను ఎదోమును ఓడించాను’ అని నీవు గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక నీవు ఇంటి వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు. నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశనమవ్వటం ఖాయం.”
20 కాని ఆమజ్యా ఈ సలహా వినటానికి నిరాకరించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూవుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం చేశాడు. 21 కావున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బేత్షెమెషు పట్టణం వద్ద ముఖాముఖి ఎదుర్కొన్నాడు. బేత్షెమెషు పట్టణం యూదాలో వుంది. 22 ఇశ్రాయేలు యూదాను ఓడించింది. యూదా సైన్యంలో ప్రతివాడూ తన ఇంటికి పారిపోయాడు. 23 అమజ్యాను బేత్షేమెషు పట్టణం వద్ద యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసుకొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. యోవాషు తండ్రి పేరు యెహోయాహాజు. యెహోయాషు ఆరువందల అడుగుల (నాలుగువందల మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎఫ్రాయిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడగొట్టాడు. 24 పిమ్మట యెహోయాషు వెండిని, బంగారాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకుపోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత ఓబేదెదోముది. యెహోయాషు రాజగృహం నుండి విలువైన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు.
25 యెహోయాషు చనిపోయిన తరువాత అమజ్యా పదిహేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిపేరు యూదా రాజైన యోవాషు. 26 మొదటి నుండి చివరి వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 27 అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమజ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని ప్రజలు కొందరు మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమజ్యాను అక్కడ చంపివేశారు. 28 వారతని శావాన్ని గుర్రాలమీద వేసుకొని తెచ్చి యూదా నగరంలో అతని పితరుల దగ్గర సమాధి చేశారు.
స్త్రీ, ఘటసర్పం
12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది. 14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది. 15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది. 16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. 17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
18 వారితో యుద్ధం చేయటానికి ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.
యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట యిచ్చుట
8 సర్వశక్తిమంతుడైన యెహోవానుండి వచ్చిన ఒక వర్తమానం ఇది. 2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” 3 యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. 5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. 6 చావగా మిగిలినవారు ఇదంతా అద్భుతం అనుకుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను. 8 వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు. 10 అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్నవారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. 13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”
14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! 16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. 17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటంపట్ల ఆసక్తి కనపరచకండి. ఎందుకంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
18 నేనీ వర్తమానం సర్వశక్తిమంతుడైన యెహోవానుండి అందుకున్నాను. 19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోషదాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”
20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు,
“భవిష్యత్తులో అనేక నగరాలనుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
21 ఒక నగరంనుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు,
వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు.
‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము.
మాతో రండి!’”
22 అనేక బలమైన రాజ్యాలనుండి అనేకమంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు. 23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చునా?’ అని అడుగుతారు.”
లాజరు మరణము
11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. 2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. 3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. 6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, 7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
లాజరు కుటుంబాన్ని ఓదార్చుట
17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
యేసు యేడవటం
28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది. 29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది. 30 యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు. 31 మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు. 32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.
33 ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది. 34 “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు.
“వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
35 యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
36 అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.
37 కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.
యేసు లాజరును బ్రతికించటం
38 యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. 39 “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు.
చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది.
40 అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.
41 వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి. 42 నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు. 43 ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు. 44 చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది.
యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; మార్కు 14:1-2; లూకా 22:1-2)
45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు. 46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు. 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు. 48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. 50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
51-52 యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు. 54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. 56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
© 1997 Bible League International