Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 28

ఆలయం నిర్మాణానికి దావీదు యోచన

28 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.

రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను. కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ, వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.’

“ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు! యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం. యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.[a] సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’” అని అన్నాడు.

“ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెబుతున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.

“కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దొరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు. 10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”

11 పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన నమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి. 12 ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు ఆ నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు. 13 దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు. 14 ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు. 15 బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు[b] ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు. 16 నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు. 17 శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు. 18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి.

19 “యెహోవా నాకు సూచించిన మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు.

20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందువల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు. 21 ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.”

2 పేతురు 2

దుర్బోధకులు

కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా దుర్బోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు. ఈ దుర్బోధకులు తమలో ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి వాళ్ళ కోసం కాచుకొని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు.

దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో[a] వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.

దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమైపొయ్యారు.

దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు. ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.

విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది.

ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు. 11 వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో ఆ గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు.

12 తమకు తెలియనివాటిని ఆ దుర్బోధకులు దూషిస్తారు. వాళ్ళు అడవి జంతువుల్లాంటివాళ్ళు. ఇలాంటి జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. ఆ జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు. 13 వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు ప్రతిఫలంగా వాళ్ళకు హాని కలుగుతుంది. పట్టపగలు శారీరక వాంఛల్ని తీర్చుకోవటమే వాళ్ళకు ఆనందం.

వాళ్ళు తాము చేసిన మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం. 14 వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేనివాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు.

15 వాళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా ధనార్జన చేసిన బెయోరు[b] కుమారుడు. 16 కాని ఈ బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.

17 ఇలాంటి దుర్బోధకులు నీళ్ళు లేని బావుల్లాంటివాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు. 18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. 19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయంచినదానికి మానవుడు బానిసై పోతాడు.

20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది. 21 వాళ్ళకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది. 22 అలా వెనక్కు మళ్ళిన వాళ్ళ విషయంలో ఈ సామెతలు నిజమౌతాయి: “కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తింటుంది. దేహాన్ని కడిగిన పంది బురదలో పొర్లాడటానికి తిరిగి వెళ్తుంది.”

మీకా 5

కావున, బలమైన నగరమా, నీ సైన్యాలను సమీకరించు.
    నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు.
వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు.

బెత్లెహేములో మెస్సీయ పుట్టుక

కాని, బేత్లెహేము ఎఫ్రాతా,
    నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి.
నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది.
    అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు.
ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి,
    అనాది కాలంనుండి ఉంటూవుంది.
యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు.
    స్త్రీ[a] ప్రసవించేదాకా వారక్కడ ఉంటారు.
అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు.
    వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు.
అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు.
    యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భుత నామ మహత్తుతోను వారిని నడిపించుతాడు.
వారు నిర్భయంగా జీవిస్తారు.
    ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచులదాకా వ్యాపిస్తుంది.
    శాంతి నెలకొంటుంది.

అష్షూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది.
    ఆ సైన్యం మన పెద్ద ఇండ్లను నాశనంచేస్తుంది.
కాని ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు గొర్రెల కాపరులను ఎంపికచేస్తాడు.
    కాదు, ఆయన ఎనమండుగురు నాయకులనుఎంపిక చేస్తాడు.
వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు.
    వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు.
ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు.
    అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులనుండి రక్షిస్తాడు.
ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు.
    వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.
యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు.
    వారు పచ్చిగడ్డిపై పడే వర్షంలా ఉంటారు.
వారు ఏ మనిషి కోసమూ వేచి ఉండరు.
    వారు ఎవరికీ భయపడరు.
అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో,
    యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు అలా ఉంటారు.
గొర్రెలమందల్లో చొరబడిన కొదమసింహంలా వారుంటారు.
    సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు వెళ్లదలిస్తే అటు వెళుతుంది.
అది ఒక జంతువును ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు చేయలేడు.
    మిగిలి ఉన్న జనులు అటువంటి సింహంలా ఉంటారు.
మీరు మీ చేతిని మీ శత్రువులపైకి ఎత్తి,
    వారిని నాశనం చేస్తారు.

ప్రజలు దేవునిపై ఆధారపడుట

10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు,
“ఆ సమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి తీసుకుంటాను.
    మీ రథాలను నాశనంచేస్తాను.
11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను.
    మీ కోటలన్నిటినీ కూలగొడతాను.
12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ ప్రయత్నించరు.
    భవిష్యత్తును చెప్ప యత్నించే జనులు మీకిక ఉండబోరు.
13 మీ బూటకపు దేవుళ్ల విగ్రహాలను నేను నాశనం చేస్తాను.
    ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాళ్లను నేను పడగొడతాను.
    నీ చేతులు చేసిన వస్తువులను నీవు ఆరాధించవు.
14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంభాలను లాగివేస్తాను.
    మీ బూటకపు దేవుళ్లను నేను నాశనం చేస్తాను.
15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు.
    నేను నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను ప్రతీకారం చేస్తాను.”

లూకా 14

యేసు ఒక రోగికి నయం చెయ్యటం

14 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. దేహమంతా నీరొచ్చిన[a] ఒక వ్యక్తి యేసు ముందు కొచ్చాడు. యేసు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం శాస్త్ర సమ్మతమా? కాదా?” అని అడిగాడు. వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు. ఆ తర్వాత, “మీ కుమారుడో లేక మీ ఎద్దు విశ్రాంతి రోజు బావిలో పడితే మీరు వెంటనే పైకి లాగి రక్షించరా?” అని అడిగాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక పోయారు.

నిన్ను నీవు గొప్ప చేసికొనవద్దు

విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది.

10 “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. 11 ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.”

నీకు ప్రతిఫలము దొరుకుతుంది

12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.

పెద్ద విందు ఉపమానం

(మత్తయి 22:1-10)

15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.

16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.

21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.

22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”

నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము

(మత్తయి 10:37-38)

25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.

28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.

31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.

33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.

నీ గోప్పతనమును పోగొట్టుకొనవద్దు

(మత్తయి 5:13; మార్కు 9:50)

34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము? 35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది.

“చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International