Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 16

16 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణ, సితార వాద్యాలను వాయించేవారు. యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

దావీదు కృతజ్ఞతా స్తోత్ర గీతం

యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
    యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
    యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
    యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖసంతోషాలు పొందెదరు గాక!
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డలారా,
    యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
14 యెహోవాయే మన దేవుడు
    ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!
15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.
    ఆయన మాట వేయితరాల పంట!
16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక.
    అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం
17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు.
    అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.
18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను.
    వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!”
    అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.
19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే.
    వారు ఆ రాజ్యంలో పరాయి వారు.
20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు.
    వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.
21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు.
    యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.
22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు;
    నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!”
    అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.
23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి!
    యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!
24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి.
    దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి
    అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.
26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే!
    కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు.
    యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!
28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి!
    మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి
    యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!
30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి.
    కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.
31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక!
    “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక!
    పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబుచ్చుగాక!
33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి!
    ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.
34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు!
    యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.
35 “మా సంరక్షకుడవగు ఓ దేవా!
    మమ్ములను రక్షింపుము!
మమ్ములను ఒక దగ్గరికి చేర్చి
    మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము.
అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము.
    మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
    సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక!

అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు. 38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెడ్రి పేరు యెదూతూను.

39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు. 40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక. 42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.

యాకోబు 3

నాలుకను మచ్చిక చేసుకొండి

నా సోదరులారా! దేవుడు మిగతావాళ్ళకన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.

మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు. చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళ్ళెం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము. ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది.

చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.

మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. 10 స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు. 11 ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా? 12 నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పునీటి ఊటనుండి మంచి నీళ్ళు ఊరవు.

తెలివిగల వాళ్ళు

13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.

ఓబద్యా

ఎదోముకు శిక్ష

ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును[a] గురించి ఈ విషయం చెప్పాడు:

దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము.
    వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
“మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.

ఎదోముతో యెహోవా మాట్లాడటం

“చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.
    ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు.
    నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది.
అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’
    అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”

ఎదోము తగ్గంచబడుతుంది

దేవుడైన యెహోవా ఇది చెప్పాడు:
“నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా,
    నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా,
    అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను
నీవు నిశ్చయంగా నాశనమవుతావు!
    దొంగలు నీవద్దకు వస్తారు!
రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు!
    ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు!
ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు,
    వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు.
ఏశావు[b] రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు.
    వాటిని వారు కనుగొంటారు!
నీ స్నేహితులైన ప్రజలంతా
    నిన్ను దేశంనుండి పంపివేస్తారు.
నీతో సంధి చేసుకొన్నవారు
    నిన్ను మోసగించి, ఓడిస్తారు.
నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు,
    నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు.
వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’”

యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున
    ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును.
తేమానూ, నీ యోధులు భయపడతారు.
    ఏశావు పర్వతంమీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు.
    అనేక మంది చంపబడతారు.
10 అవమానం నిన్ను ఆవరిస్తుంది.
    నీవు శాశ్వతంగా నాశనమవుతావు.
    ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబుపట్ల చాలా క్రూరంగా ఉన్నావు.
11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు
    ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు.
పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి,
    యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు.
    ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు.
12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు.
    నీవాపని చేసియుండకూడదు.
ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు.
    నీవలా చేసియుండకూడదు.
యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు.
    నీవది చేసియుండకూడదు.
13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి,
    నీవు వారి సమస్యలను చూసి నవ్వావు.
నీవది చేసియుండకూడదు.
    వారికి కష్టకాలం వచ్చినప్పుడు.
నీవు వారి ఆస్తిని దోచుకున్నావు.
    నీవాపని చేసియుండకూడదు.
14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు.
    నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునేవారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు.
    నీవాపని చేయకుండా ఉండవలసింది.
15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది.
    నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు.
అదే కీడు నీకూ జరుగుతుంది.
    అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.
16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు.
    అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు.
నువ్వు అంతరిస్తావు
    నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది.
17 కాని సీయోను కొండమీద మాత్రం మిగిలినవారు ఉంటారు.
    వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.
యాకోబు వంశం తనకు చెందిన
    వస్తువులను తిరిగి తీసుకొంటుంది.
18 యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది.
    యోసేపు[c] సంతతివారు మంటలా తయారవుతారు.
కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది.
    యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు.
యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు.
అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.”
    దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
19 యూదాకు దక్షిణానగల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు.
    కొండకింది (మైదాన) ప్రాంతంవారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు.
ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు.
    గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది.
20 ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలిపోయేలా ఒత్తిడి చేయబడ్డారు.
    కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు.
యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు
    దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించుకొంటారు.
21 జయించినవారు సీయోను కొండమీద ఉంటారు
    ఆ మనుష్యులు ఏశావు కొండమీద నివసిస్తున్న వారిని పరిపాలిస్తారు.
    అప్పుడు రాజ్యం యెహోవాకు చెంది ఉంటుంది.

లూకా 5

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)

ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు. యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.

ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.

సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.

సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు.

యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.

11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.

యేసు రోగిని నయం చేయటం

(మత్తయి 8:1-4; మార్కు 1:40-45)

12 యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు.

13 యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. 14 ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు.

15 కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. 16 కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మత్తయి 9:1-8; మార్కు 2:1-12)

17 ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు,[a] శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. 18 కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. 19 కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. 20 ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు.

21 పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు.

22 వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? 23 ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? 24 కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

25 ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. 26 అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.

లేవి (మత్తయి) యేసును వెంబడించటం

(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)

27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి[b] అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. 28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.

29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. 30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.

31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. 32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)

33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.

34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? 35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు. 37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. 38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. 39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International