Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 7-8

ఇశ్శాఖారు సంతతివారు

ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు.

తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.

ఉజ్జా కుమారుడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా అనేవారు. వీరైదుగురు కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.

బెన్యామీను సంతతివారు

బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.

బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.

బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం. వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.

10 యెదీయవేలు కుమారుడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు అనువారు. 11 యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది యుద్ధవీరులున్నారు.

12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము.

నఫ్తాలి సంతతివారు

13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు.

వీరందరూ బిల్హా[a] సంతతిగా ఎంచబడిరి.

మనష్షే సంతతివారు

14 మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు. 15 హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకు సెలోపెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే. 16 మాకీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. పెరెషు సోదరుని పేరు షెరెషు. షెరెషు కుమారుల పేర్లు ఊలాము, రాకెము.

17 ఊలాము కుమారుని పేరు బెదాను. గిలాదు సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. మాకీరు తండ్రి పేరు మనష్షే. 18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు.

19 షెమీదా కుమారుల పేర్లు అహోయాను, షెకెము, లికీ, అనీయాము.

ఎఫ్రాయిము సంతతివారు

20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా. 21 ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు.

గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు. 22 ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు. 23 పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా[b] అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది. 24 ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.

25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. 26 తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. 27 ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.

28 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు. 29 మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.

ఆషేరు సంతతివారు

30 ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు.

31 బెరీయా కుమారులు హెబెరు మరియు మల్కీయేలు. మల్కీయేలు కుమారుడు బిర్జాయీతు.

32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి.

33 యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.

34 షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము.

35 షోమేరు సోదరుని పేరు హేలెము. హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.

36 జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హాదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేర.

38 ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా.

39 ఉల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, రిజెయా.

40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.

సౌలు రాజు కుటుంబ చరిత్ర

బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు. బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా.

3-5 బెల కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషూవ, నయమాను, అహోయాహు, గెరా, షెపూపాను, హూరాము అనువారు.

6-7 ఏహూదు సంతతి వారు గెబలో వారి వారి కుటుంబాలకు పెద్దలు. వారు బలవంతంగా ఇండ్లు విడిచి మనహతుకు పోయేలా చేయబడ్డారు. ఏహూదు సంతతి వారు నయమాను, అహీయా, గెరా అనేవారు. గెరా వారిని బలవంతంగా ఇండ్లు వదిలిపోయేలా చేసాడు. గెరా కుమారులు ఉజ్జా, అహీహూదు.

మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు. 9-10 షహరయీముకు యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యోవూజును, షాక్యా, మిర్మా అనే కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ పెద్దలయ్యారు. 11 షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.

12-13 ఎల్పయల కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, లోదును, దాని చుట్టూ వున్న గ్రామాలను షెమెదు నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యాలోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు.

14 బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు, 15 జెబద్యా, అరాదు, ఏదెరు, 16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు. 17 ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, 18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు.

19 షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది, 20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, 21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు.

22 షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, 23 అబ్దోను, జిఖ్రి, హానాను, 24 హనన్యా, ఏలాము, అంతోతీయా, 25 ఇపెదయా, పెనూయేలు అనేవారు.

26 యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా, 27 యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు.

28 వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు.

29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా. 30 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 31 గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు. 32 మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు.

33 నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు.

34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

35 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు.

36 ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా. 37 మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

38 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు.

39 ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు. 40 ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు.

వీరంతా బెన్యామీను సంతతివారు.

హెబ్రీయులకు 11

విశ్వాసము

11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.

దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.

హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.

హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.

నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.

అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు. విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసినవాటిల్లో తనతో సహవారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. 10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.

11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు. 12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.

13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.

17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.

20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.

22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.

23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.

24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.

27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.

29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.

30 ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.

31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతోసహా ఆమె మరణించలేదు.

32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.

39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.

ఆమోసు 5

ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక

ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.

ఇశ్రాయేలు కన్యక పతనమయింది.
    ఆమె ఇక లేవలేదు.
మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది.
    ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.

ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే
    అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు
వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే
    అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.”

తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా ప్రోత్సహించుట.

ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
    కాని బేతేలులో వెదకవద్దు.
గిల్గాలుకు వెళ్లవద్దు.
    సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి.
గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు.
    బేతేలు నాశనం చేయబడుతుంది.
యెహోవా దరిచేరి జీవించండి.
    మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది.
    ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు.
7-9 మీరు యెహోవా కొరకు చూడండి.
    సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే.
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు.
    పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు.
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు.
    ఆయన పేరు యెహోవా!
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు.
    మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.”

ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు

ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు.
    న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ప్రజలు చేసే చెడ్డపనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచేత ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
    ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు.
    మీరు పేదవారినుండి గోధుమ మోపులను తీసుకుంటారు.
ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు.
    కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు.
మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటుతారు.
    కాని మీరు వాటినుండి ద్రాక్షారసం తాగరు.
12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు.
    మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు.
మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు.
    చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు.
    బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు.
    ఎందుకంటే అది చెడు కాలం గనుక.
14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు.
    అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు.
అప్పుడు మీరు బతుకుతారు.
    సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు.
15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు.
    న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధరించండి.
అప్పుడు యోసేపు వంశంలో మిగిలినవారిమీద దేవుడు,
    సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.

మిక్కిలి దుఃఖకాలం రాబోవుట

16 అందువలన ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు:
“బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలపిస్తారు.
    ప్రజలు వీధులలో రోదిస్తారు.
    ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు.
17 ద్రాక్షాతోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు.
    ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” అని
    యెహోవా చెపుతున్నాడు.
18 మీలో కొంతమంది
    యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు.
అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు?
    యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై
    ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు!
ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా
    పాము కరచినవాని మాదిరి మీరుంటారు!
20 కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము
    చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు!
    ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.

ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం

21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!
    నేను వాటిని అంగీకరించను!
    మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,
    నేను వాటిని స్వీకరించను!
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు
    నేను కనీసం చూడనైనా చూడను.
23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి.
    మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.
    మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాలపాటు
    నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు.
26 కాని మీరు మీ రాజుయొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను[a] విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు.
    పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.
27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.”
    దేవుడును, సర్వశక్తిమంతుడును
    అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.

లూకా 1:1-38

యేసు జీవన చరిత్రను లూకా వ్రాయటం

గౌరవనీయులైన థెయొఫిలాకు:

మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు. 2-3 వీటన్నిటినీ నేను మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు కూడా వీటన్నిటిని క్రమపద్ధతిలో వ్రాసి మీకు అందించటం ఉత్తమమనిపిం చింది. మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను.

జెకర్యా మరియు ఎలీసబేతు

హేరోదు[a] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా[b] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.

తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.

11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ[c] ఉంటాడు.

16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో[d] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.

18 జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.

19 దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు. 20 జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”

21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.

24 కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు. 25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.

యేసు జన్మిస్తాడని ప్రవచనం

26 ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు. 27 దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ. 28 ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.

29 దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.

30 ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. 31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32 ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”

34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.

35 ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 36 నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. 37 దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”

38 మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International