M’Cheyne Bible Reading Plan
హోషేయా ఇశ్రాయేలు మీద తన పాలన ప్రారంభించుట
17 ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలులో షోమ్రోను నుంచి పరిపాలించసాగాడు. అహాజు యూదా రాజుగా ఉన్న 12వ సంవత్సరమున ఇది జరిగింది. హోషేయా తొమ్మిదేళ్లు పరిపాలించాడు. 2 యెహోవా తప్పనిచెప్పిన పనులు హోషేయా చేశాడు. కాని హోషేయా తనకు పూర్వికులైన ఇశ్రాయేలు రాజులవలె చెడ్డవాడు కాదు.
3 షల్మనేసెరు అష్షూరుకు రాజు. అతను హోషేయాకి ప్రతికూలంగా యుద్ధానికి వెళ్లాడు. షల్మనేసెరు హోషేయాని ఓడించాడు. మరియు హోషేయా అతని సేవకుడయ్యాడు. అందువల్ల హోషేయా షల్మనేసెరుకు పన్ను చెల్లించాడు.
4 తర్వాత, హోషేయా ఈజిప్టు రాజు సహాయం కోరుతూ దూతలను పంపాడు. ఆ రాజు పేరు సో. ఆ సంవత్సరం హోషేయా తాను ప్రతియేడు చేసేవిధంగా అష్షూరు రాజుకి కప్పం కట్టలేదు. అష్షూరు రాజు తనకు విరుద్ధంగా హోషేయా పథక రచన చేసినట్లు తెలుసుకున్నాడు. అందువల్ల అష్షూరు రాజు హోషేయాని ఖైదుచేసి చెరసాలలో వేశాడు.
5 అష్షూరు రాజు ఇశ్రాయేలులో చాలా స్థలాలపై దాడి చేశాడు. తర్వాత షోమ్రోనుకు అతను వచ్చాడు. అతను షోమ్రోనుకి ప్రతికూలంగా మూడు సంవత్సరాలు యుద్ధం చేశాడు. 6 అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున షోమ్రోనును తీసుకున్నాడు. అష్షూరు రాజు చాలా మంది ఇశ్రాయేలు వారిని బంధించి, వారిని బంధీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారినతడు గోజాను వద్ద హాబోరు నదికి ప్రక్కగా హలాహు అనే చోటను, మాదీయుల ఇతర నగరాలలోను నివసింపజేశాడు.
7 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు. 8 ఇతర జనాంగములు చేసినట్లుగానే, వారు చేయసాగారు. ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ జనాంగములను వారిని తమ ప్రదేశము వదిలి వెళ్లాలని యెహోవా చేత నిర్బంధించబడ్డారు. ఇశ్రాయేలు వారు కూడా దేవునివల్ల గాక రాజులచే పరిపాలించబడాలని ఎంచుకున్నారు. 9 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధమైన సంగుతులను రహస్యంగా చేశారు. వారు చేసినవి సరి అయినవి కావు!
తమ నగరాలన్నిటిలోను ఇశ్రాయేలువారు చిన్న పట్టణం నుంచి పెద్ద నగరం దాకా ఉన్నత స్థలాలు నిర్మించారు. 10 ఇశ్రాయేలువారు స్మారక శిలలు వేశారు. ప్రతి కొండమీదను పచ్చని చెట్ల క్రిందను అషెరా స్తంభాలు ఏర్పాటు చేశారు. 11 అన్ని ఆరాధనా స్థలాలలోను ఇశ్రాయేలువారు ధూపం వేసేవారు. యెహోవా జనాంగములను తమ కళ్ల ఎదుటే బలవంతంగా విడిచిపెట్టి వెళ్లమని చెప్పిన విధంగా, వారీ పనులు చేసేవారు. ఇశ్రాయేలువారు చేసినచెడుపనులు యెహోవాకి ఆగ్రహం కలిగించాయి. 12 వారు విగ్రహలను కొలిచారు. “మీరీ పని చేయకూడదు” అని యెహోవా ఇశ్రాయేలువారికి చెప్పాడు.
13 ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
14 కాని ప్రజలు ఆ మాటలు వినలేదు. తమ పూర్వికులవలె వారు మొండిగా వుండిరి. వారి పూర్వీకులు తమ యెహోవా దేవుని విశ్వసించలేదు. 15 ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
16 తమ యెహోవా దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించడం మానివేశారు. వారు రెండు బంగారు దూడల విగ్రహాలు చేశారు. అషెరా స్తంభాలు వారు ఏర్పాటు చేశారు. వారు ఆకాశంలోని అన్ని నక్షత్రాలను పూజించారు; బయలు దేవతలను కొలిచారు. 17 వారు తమ కొడుకుల్ని, కూతుళ్లని అగ్నిలో వేసి బలి ఇచ్చారు. భవిష్యత్తును తెలుసుకునేందుకు వారు చేతబడితనమును, ఇంద్రజాలమును ఉపయోగించారు. దుష్కార్యమని యెహోవా చెప్పినదానిని ప్రజలు చేశారు. యెహోవాని ఆగ్రహపరచేందుకు వారు అలా చేశారు. 18 అందువల్ల యెహోవా ఇశ్రాయేలుపట్ల చాలా కోపపడ్డాడు; తన దృష్టినుంచివారిని తప్పించాడు. యూదా గోత్రం తప్ప మరి ఇతర ఇశ్రాయేలువారు లేరు.
యూదా ప్రజలు కూడా దోషులే
19 యూదా ప్రజలు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలవలె నివసించారు.
20 యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరిని త్రోసిపుచ్చాడు. అతడు వారికి ఎన్నో ఇబ్బందులు కలుగ జేశాడు. ఇతరులు తమను నాశనం చేసేటట్లు చేసుకున్నారు. చిట్టచివరికి, ఆయన తన దృష్టినుండి వారిని త్రోసిపుచ్చాడు. 21 యెహోవా దావీదు వంశం నుంచి ఇశ్రాయేలుని విడగొట్టాడు. మరియు ఇశ్రాయేలువారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. యరొబాము యెహోవాను అనుసరించని వారుగా వారిని గుర్తించాడు. ఇశ్రాయేలువారు మహా పాపం చేసేలా యరొబాము చేశాడు. అందువల్ల 22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు. 23 యెహోవా తన దృష్టినుండి ఇశ్రాయేలుని దూరముగా తీసుకుపోయే వరకు, వారు ఆ పాపాలు చేయడం మానలేదు. మరియు ఇలా జరుగునని యెహోవా చెప్పాడు! ఆయన ప్రజలకు ఇలా జరుగుతుందని చెప్పమని ప్రవక్తలను పంపించాడు. అందువల్ల ఇశ్రాయేలువారిని తమ దేశంనుండి అష్షూరుకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ వారు నేటిదాకా వున్నారు.
విదేశీయులు ఇశ్రాయేలులో స్థిరపడుట
24 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమ్రోను నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్యా, హమాతు, సెపర్వయీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. అతను వారినందరిని షోమ్రోనులో ఉంచాడు. ఆ ప్రజలు షోమ్రోనును గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగరాలలో నివసింపసాగారు. 25 ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి. 26 కొందరు అష్షూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి షోమ్రోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని సింహాలు చంపివేశాయి” అని చెప్పారు.
27 అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు షోమ్రోను నుండి కొందరు యాజకులను తీసుకున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని తిరిగి షోమ్రోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆ యాజకుడు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించగలడు.”
28 అందువల్ల అష్షూరుకు తీసుకుపోయిన ఒక యాజకుడు బేతేలులో నివసించాడానికి వచ్చాడు. ఈ యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి బోధించాడు.
29 కాని ఆ మనుష్యులందరు తమతమ దేవుళ్ల విగ్రహలను చేసి షోమ్రోనుల ఉన్నత స్థానాలలో ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు. 30 బబులోను మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్బెనోతును కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు. 31 అవ్వాకు చెందినవారు అసత్య దేవుడైన నిబ్హజు తర్తాకులను కల్పించుకున్నారు. హమాతు ప్రజలు అబద్ధపు దేవుడైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీయుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్లయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
32 కాని ఆ ప్రజలు యెహోవాని కూడా పూజించారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకులను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు అర్పించారు. 33 వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించినట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.
34 నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసిస్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు. 35 యెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అనుసరించకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరాధించకూడదు; వారికి బలుల కూడా సమర్పించకూడదు. 36 కాని యెహోవాని అనుసరించాలి. ఈజిప్టు నుంచి మిమ్ము తీసుకువచ్చిన యెహోవాయే దేవుడు. యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి వినియోగించాడు. మీరు యెహోవాని ఆరాధిస్తూ మరియు గౌరవించి ఆయనకు బలులు సమర్పించాలి. 37 ఆయన మీ కోసం వ్రాసిన నిబంధనలు, న్యాయ సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలైన వాటిని మీరు పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. మీరు ఇతర దేవతలను గౌరవించరాదు. 38 మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు. 39 మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.
40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. 41 అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.
విశ్వాసులు చేయవలసిన విధులు
3 పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించు. 2 ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపమని బోధించు.
3 గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు, సుఖాలకు లోనై, అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము. 4 అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. 5 మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు. 6 పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. 7 ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. 8 ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి.
అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించినవాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.
9 కాని మూర్ఖంగా వాదించేవాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించేవాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించేవాళ్ళకు, పోట్లాడేవాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు. 10 చీలికలు కలిగించేవాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో. 11 అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.
చివరి మాట
12 అర్తెమానును, తుకికును నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను. 13 న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి. 14 మనవాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.
15 నాతో ఉన్నవాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైనవాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము.
మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!
ఐశ్వర్యాలే ఇశ్రాయేలునువారిని విగ్రహారాధనకు నడిపించుట
10 విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు.
ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి.
కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ
బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు.
అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది.
కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు.
2 ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని
చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి.
వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు.
వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు.
ఇశ్రాయేలీయుల చెడు తీర్మానాలు
3 ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము. అయినా రాజు మాకు ఏమీ చేయలేడు.” అని ఇశ్రాయేలీయులు చెపుతారు.
4 వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చెపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిలబెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయమూర్తులు, దున్నబడిన పొలంలో విషపు కలుపు మొక్కల్లాంటివారు.
5 సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది. 6 అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది. 7 సమరయ బూటకపు దేవుడు నాశనం చేయబడతాడు. అది నీటిమీద తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది.
8 ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.
ఇశ్రాయేలు తన పాపానికి పరిహారం చెల్లించుట
9 “ఇశ్రాయేలూ, గిబియా కాలంనుండి నీవు పాపం చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్ధం నిజంగా పట్టుకొంటుంది. 10 వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి.
11 “ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధాన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.”
12 నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు!
13 కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు. 14 కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు. 15 మీకు కూడ బేతేలువద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేతనంటే, మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వనాశనం చేయబడతాడు.
యాత్ర కీర్తన.
129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
కాని వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
“యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
యాత్ర కీర్తన.
131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
© 1997 Bible League International