M’Cheyne Bible Reading Plan
అహజ్యాకు సందేశం
1 అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.
2 ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.
3 కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకులను అడగటానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము. 4 మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బయల్జెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.
5 దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.
6 దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్లు చేయడంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తావనియు యెహోవా చెప్పాడు!’”
7 “మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.
8 “ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు.
తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే అది” అని అన్నాడు.
అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము చేయుట
9 అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు.
10 ఏలీయా ఏభైమంది మనుష్యులను, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు.
అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.
11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ, క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.
12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు.
అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.
13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక! 14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”
15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు.
అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.
16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.
యెహోరాము అహజ్యా అంతఃపురాన్ని స్వాధీనం చేసుకొనుట
17 ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు.
18 అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
1 పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:
2 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక!
3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. 4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
దేవుని తీర్పు గూర్చి పౌలు చెప్పటం
5 దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్నదానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. 6 దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు. 7 ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది. 8 దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు. 9 వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు. 10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
గోడమీది వ్రాత
5 రాజైన బెల్షస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. 2 బెల్షస్సరు ద్రాక్షామద్యం త్రాగుతుండగా తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంనుంచి తీసుకువచ్చిన బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకులకు ఆజ్ఞాపించాడు. బెల్షస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. 3 కనుక యెరూషలేము ఆలయంనుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. 4 త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.
5 అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి, గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.
6 రాజైన బెల్షస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు వణకుతు ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంకాగా, అతడు నిలబడలేక పోయాడు. 7 అప్పుడు ఇంద్రజాలికుల్ని, కల్దీయుల్ని, తన సమక్షానికి తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీది ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహూకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.
8 అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు. 9 బెల్షస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్లబోయింది.
10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజుయొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్థిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు. 11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల[a] ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేకవంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్రజాలికులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు. 12 నేను మాటలాడుతున్న వ్యక్తి పేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్థాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.
13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? 14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. 15 వివేకవంతుల్నీ, ఇంద్రజాలికుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుపలేకపోయారు. 16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.
17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకో. లేకపోతే, ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.
18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తివంతుడైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. 19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడేవారు. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింపజేయ తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. ఏ మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచుకుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.
20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. 21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి గాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చుకొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించువాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించగలడని తెలుసుకొన్నాడు.
22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, 23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. 24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. 25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి:
మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.
26 “ఈ మాటలకు అర్థం ఇది:
మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.
27 టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.
28 ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”
29 తర్వాత బెల్షస్సరు ఊదారంగు బట్టలు దానియేలుకు ధరింపచేసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. 30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు. 31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.
దావీదు స్తుతి కీర్తన.
110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]
4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”
5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.
6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!
7 మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
© 1997 Bible League International