M’Cheyne Bible Reading Plan
కళ్లము దగ్గర రూతు, బోయజు
3 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం. 2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు. 3 నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు. 4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
6 రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు. 7 తిని తాగడం అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్లాడు బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే ఆమె పండుకొంది.
8 సుమారు మధ్యరాత్రి బోయజు ప్రక్కకు దొర్లాడు (నిద్రలోనుంచి మేల్కొన్నాడు) అతను చాలా ఆశ్చర్య పోయాడు. తన పాదాల దగ్గర ఒక స్త్రీ పండుకొనివుంది. 9 “ఎవరు నీవు” అన్నాడు బోయజు.
“నీ సేవకురాలనైన రూతును. నన్ను కాపాడాల్సింది నీవే. నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు.
10 అందుకు బోయజు, “నా కుమారీ! యెహోవా నిన్ను దీవించునుగాక! నాపై నీవు చాలా దయ చూపెట్టావు. మొదట్లో నీవు నయోమి మీద చూపెట్టిన దయకంటె, ఇప్పుడు నామీద చూపెట్టిన దయ చాలా ఎక్కువ. నీవు పెళ్లి చేసుకొనేందుకు ధనవంతుడో, పేదవాడో మరో యువకుడిని చూసుకుని ఉండాల్సింది, కాని నీవు అలా చేయలేదు. 11 కనుక చూడు బిడ్డా! నీవేమి భయపడకు. నీవు అడిగింది నేను చేస్తా. నీవు చాలా మంచిదానివని మన ఊళ్లో అందరికీ తెలుసు. 12 నేను నీకు చాలా దగ్గర బంధువును అవడం కూడ సత్యమే. అయితే, నాకంటే నీకు మరింత దగ్గర బంధువు ఒకాయన ఉన్నాడు. 13 ఈ రాత్రికి నీవు ఇక్కడ ఉండు. అతను నీకేమైనా సహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలుసు కుందాము. నీకు సహాయము చేయటానికి అతను నిర్ణయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి అతను నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక నేనే నిన్ను పెళ్లాడి ఎలీమెలెకు భూమిని నీ కోసము మళ్లీ కొని యిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే వరకు ఇక్కడే పడుకో.”
14 అందుచేత తెల్లారేవరకు రూతు అతని కాళ్ల దగ్గరే పడుకొంది. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది.
“రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో. 15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు.
అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు.
16 రూతు తన ఆత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి (గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది.
(రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిందంతా చెప్పింది. 17 “నీకు కానుకగా ఇమ్మని బోయజు ఈ యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
18 “నా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంతవరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాత్రం ఏమిచేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది నయోమి.
బోయజు మరియు మరో బంధువు
4 పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.
2 తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
3 అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది. 4 ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.
5 “నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయినవాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చనిపోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.
6 ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.” 7 (పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా, విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). 8 “కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.
9 అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 10 నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”
11 పట్టణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు దీనికి సాక్షులు.
“ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా
ఈమెను రాహేలు,
లేయా వలె చేయునుగాక!
రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశ పుత్రదాతలు. ఎఫ్రాతాలో
నీవు శక్తిమంతుడవు అవుదువు గాక.
బెత్లెహేములో నీవు ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక!
12 తామారు యూదా కుమారుడు పెరెసును కన్నది
అతని కుటుంబం చాలా గొప్పది
అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను యెహోవా నీకు ప్రసాదించును గాక!
నీ కుటుంబము కూడ అతని కుటుంబంలాగే గౌరవప్రదమవును గాక!”
13 బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. 14 ఆ ఊరిలో స్త్రీలు నయోమితో,
“నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు.
అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
15 అతడే నీకు బలాన్ని యిచ్చి,
నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక!
నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది.
ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది.
ఆమెకు నీవంటే చాలా ప్రేమ.
ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.”
అని అనిరి.
16 నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది. 17 ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.
రూతు, బోయజు కుటుంబము
18 పెరెసు కుటుంబ చరిత్ర ఇది.
పెరెసు హెస్రోనుకు తండ్రి.
19 హెస్రోను రాముకు తండ్రి.
రాము అమ్మి నాదాబుకు తండ్రి.
20 అమ్మినాదాబు నయసోనుకు తండ్రి.
నయసోను శల్మానుకు తండ్రి.
21 శల్మాను బోయజుకు తండ్రి.
బోయజు ఓబేదుకు తండ్రి.
22 ఓబేదు యెష్షయికి తండ్రి.
యెష్షయి దావీదుకు తండ్రి.
మెలితే ద్వీపం
28 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. 2 ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. 3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. 4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. 6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7 ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. 8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
రోమాకు రావటం
11 చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.” 12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. 13 మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేర గలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. 14 అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము. 15 రోమాలో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్,[a] ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
రోమా నగరంలో బోధించటం
16 మేము రోమా పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వికుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోమా అధికారులకు అప్పగించారు. 18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. 20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయనుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు. 22 కాని అన్ని ప్రాంతలవాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’(A)
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29 [b]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
యిర్మీయా నీళ్లగోతిలోనికి తోయబడటం
38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: 2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ 3 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”
4 ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు.
5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.
6 దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి[a] దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా)[b] రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 8-9 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”[c]
10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు[d] మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”
11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. 12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. 13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు.
యిర్మీయాను సిద్కియా కొన్ని ప్రశ్నలడగటం
14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.
15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.
16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”
17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. 18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’”
19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.
20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది. 21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు: 22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు.
‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు.
నీవారు నీకంటె బలవంతులైనారు.
అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు.
నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి.
నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’
23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”
24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. 25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు. 26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి క్రిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.”
27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.
28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
“పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
వారి బాణాలను వారు గురి చూస్తారు.
మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.
12 యెహోవా, నన్ను రక్షించుము!
మంచి మనుష్యులంతా పోయారు.
భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.
5 కాని యెహోవా చెబుతున్నాడు,
“దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”
6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.
7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.
© 1997 Bible League International