M’Cheyne Bible Reading Plan
యూదా రాజుగా అబీయా
13 ఇశ్రాయేలు రాజుగా యరొబాము[a] పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు. 2 అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా.[b] మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. 3 అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.
4 అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి. 5 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక[c] ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు. 6 కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు. 7 అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.
8 “ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు. 9 మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంత యాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.
10 “కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు. 11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు. 12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు!”
13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు. 14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సైన్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటున్నట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు. 15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది. 16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు. 17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు. 18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.
19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.
20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు. 21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 22 అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.
సార్దీసులోని సంఘానికి
3 “సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. 2 నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. 3 నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.
4 “మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. 5 విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. 6 సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.
ఫిలదెల్ఫియలోని సంఘానికి
7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.
లవొదికయలోని సంఘానికి
14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఈ విషయాలకు ఆమేన్[a] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.
15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.
19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.
21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”
ఇది ఆలయ నిర్మాణానికి సమయం
1 దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు). ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే, 2 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
3 పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: 4 “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది. 5 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! 6 నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. అయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! 8 మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.
9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు. 10 ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”
11 ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ, జంతువులన్నీ బలహీనమౌతాయి.”
క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం
12 పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, మరియు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువయు, మిగిలియున్న ప్రజలును తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తమకు తెలియజేసిన మాటలను విని, దేవుడైన యెహోవాపట్ల భయభక్తులను చూపారు.
13 దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.
14 పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులందరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతా వచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 15 వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.
కానా పట్టణంలో వివాహం
2 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. 2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. 3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.
4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.
5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.
6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.
7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.
వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. 9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.
యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం
(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)
13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.
17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:
“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)
18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.
19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”
20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.
21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.
23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.
© 1997 Bible League International