Historical
సొలొమోను జ్ఞానాన్ని కోరటం
1 యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
2 సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. అతడు సైన్యాధికారులతోను, దళాధిపతులతోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలులోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ పెద్దతోను మాట్లాడాడు. 3 పిమ్మట సొలొమోను, అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని సన్నిధి గుడారం అక్కడ ఉంది. యోహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్నప్పుడు ఈ గుడారాన్ని నిర్మించాడు. 4 దేవుని ఒడంబడిక పెట్టె[a] దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఒడంబడిక పెట్టెను వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు. 5 బెసలేలు కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు తండ్రిపేరు ఊరి. ఊరి తండ్రి పేరు హూరు. కాని ఈ కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట వుంది. అందువల్ల సొలొమోను, ప్రజలు కలిసి దేవుని సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు. 6 సన్నిధి గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు సొలొమోను వెళ్లాడు. బలపీఠం మీద సొలొమోను వెయ్యి దహనబలులు అర్పించాడు.
7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుతో స్వప్నములో యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
8 సొలొమోను దేవునితో యిలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు. 9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది. 10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బ్రతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను. 12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
సొలొమోను సైన్యాన్ని వృద్దిచేయటం
14 సొలొమోను గుర్రాలను, రథాలను సేకరించాడు. అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూషలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సొలొమోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం కూడా వుంది. 15 యెరూషలేములో సొలొమోను విస్తారంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించాడనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. సొలొమోను సరళ వృక్షాల కలపను చాలా సేకరించాడు. అతడు సరళ చెట్ల కలపను పల్లపు ప్రాంతాలలో విస్తరించి వున్న మేడి చెట్లంత ఎక్కువగా సేకరించాడు. 16 ఈజిప్టు నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణటర్కీ ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పించాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు. 17 రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరువందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట యేబది తులాల వెండిని వెచ్చించి కోనేవారు, ఆ కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మేవారు.
ఆలయ, రాజగృహ నిర్మాణానికి సొలొమోను యత్నం
2 యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. 2 సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.
3 తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:
“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. 4 నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
5 “మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. 6 నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
7 “కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు తెరల పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. 8 సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. 9 సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భుతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల[b] గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేల గేలనుల (మూడు వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”
11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:
“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.
15 “నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షారసం నాకు పంపుతానని వ్రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంత కలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పె పట్టణం మీదుగా సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు బండ్లమీద మోయించవచ్చు.”
17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.
సొలొమోను ఆలయాన్ని నిర్మించటం
3 యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు. 2 తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.
3 ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు. 4 ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు. 5 పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు. 6 ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). 7 ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.
8 తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం[c] ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు). 9 బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు. 10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. 11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. 12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది. 13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.
14 నీలం, ఊదా, ఎరుపు బట్టలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు[d] చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.
15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు. 16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు. 17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి ప్రక్క, రెండవ స్తంభం ఎడమ ప్రక్కన నిలిపారు. సొలొమోను కుడి ప్రక్క స్తంభానికి “యాకీను”[e] అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు”[f] అని పేరు పెట్టాడు.
ఆలయ సామగ్రి
4 ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. 2 కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును[g] (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు. 3 కోనేరు (సముద్రం) క్రింది అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం) ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. 4 ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి, మూడు దక్షిణానికి, మూడు తూర్పుకు, మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాల క్రింద మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. 5 కంచు కోనేరు (సముద్రపు) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచు తామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.
6 సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.
7 సొలొమోను పది బంగారపు దీపస్తంభాలు చేయించాడు. ఈ దీపస్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అనుకరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిప్రక్క ఐదు, ఎడమప్రక్క ఐదు దీపస్తంభాలను వుంచాడు. 8 సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిప్రక్కన, ఐదు బల్లలు ఎడమప్రక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు. 9 ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు. 10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.
11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు. 12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పైన పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు. 13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి. 14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు. 15 హూరాము కంచు కోనేరును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు. 16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి. 18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.
19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు. 20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. 22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.
© 1997 Bible League International