Print Page Options
Previous Prev Day Next DayNext

Historical

Read the books of the Bible as they were written historically, according to the estimated date of their writing.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 21-23

ఇశ్రాయేలీయులను లెక్కించిన దావీదు పాపం

21 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు.[a] కావున దావీదు యోవాబును, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.

కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”

కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు. లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు. దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు.

ఇశ్రాయేలును దేవుడు శిక్షించటం

పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”

9-10 గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు అవకాశాలు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’”

11-12 ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు’. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.”

13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయుము.”

14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు. 15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు[b] ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.

16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు. 17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”

18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.” 19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.

20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.

22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.

23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనుము! నీవు నా ఏలినవాడవైన రాజువు. నీవు కోరిన విధంగా చేయుము. దహన బలులుగా సమర్పించటానికి నేను నీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ నీకు ఇస్తాను!”

24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను ఉచితంగా తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”

25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు. 26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని క్రిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది. 27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.

28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు. 29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు. 30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)

22 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.

ఆలయ నిర్మాణానికి దావీదు ప్రణాళిక

ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని. దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు. దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.

దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.

పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు. సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవా నామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను. కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని చంపావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు. కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను.[c] సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను. 10 నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నాకు కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వుంటాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!’”

11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక! 12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. 13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయపడవద్దు.

14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను మూడువేల ఏడువందల ఏభై టన్నుల బంగారాన్ని, ముఫై ఏడువేల ఐదువందల టన్నుల వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు. 15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. 16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”

17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. 18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు. 19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”

ఆలయ సేవకై లేవీయులకు ఏర్పాట్లు

23 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు. ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు. లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు. దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు. నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”

దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.

గెర్షోను వంశం

లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు. లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు. షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.

10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా,[d] యూషు, బెరీయా. 11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.

కహాతు సంతతివారు

12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.

14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు. 15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు. 16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు.[e] 17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.

18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.

19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.

20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.

మెరారి సంతతివారు

21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు. 23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.

లేవీయుల పని

24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో వ్రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.

25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు. 26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”

27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.

28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని. 29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు. 30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు. 31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి. 32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International