Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 13-14

సౌలు చేసిన మొదటి తప్పు

13 అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలు పాలించేసరికి ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.

యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు.

“హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు. ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు.

సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.

ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు. కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.

సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు. “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. 10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.

11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు.

అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. 12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.

13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞను పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు. 14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు.

15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు.

మిక్మషువద్ద యుద్ధం

సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు. 16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, మరియు సైనికులు బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు.

ఫిలిష్తీయులు మిక్మషులో గుడారాలు వేసుకొనియుండిరి. 17 మెరుపు దాడులు చేసే మూడు దళాలు ఫిలిష్తీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. ఒక దళం ఉత్తరంగా షూయాలు ప్రాంతంలో ఓఫ్రా మార్గంలో వెళ్లింది. 18 రెండవది వాయవ్య దిశగా బేత్ హోరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా ఉంది.

19 ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ లేడు. “(కమ్మరివాళ్లు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తులను ఈటెలను చేయించుకొనెదరు” అని ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి. 20 ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును పెట్టగలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయాల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. 21 నాగళ్లు, పారలు సాన బెట్టడానికి ఫిలిష్తీ కమ్మరులు 1/3 వంతు ఔన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన బెట్టటానికి వారు 1/6 వంతు ఔన్సు (వెండి) (అక్షరాలషెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు. 22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.

23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.

యోనాతాను ఫిలిష్తీయులపై పడటం

14 సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.

మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు. వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.

కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండలున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ పేరు సెనే. ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.

యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.

“మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.

“అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము. వాళ్లు గనుక మనల్ని చూసి ‘తాము వచ్చే వరకూ ఆగండని’ అంటే, మనము అప్పుడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. వారి వద్దకు పోవద్దు. 10 కానీ ‘మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.

11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు. 12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు.

అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.

13-14 అప్పుడు యోనాతాను తన కాళ్లు, చేతులతో మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అనుసరించాడు. యోనాతాను మరియు అతని సహాయకుడు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారు. మొదటి వధయందు వారు ఇరవై మంది ఫిలిష్తీయులను అర ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదురుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మోసేవాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని చంపేసాడు.

15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.

16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు. 17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు.

వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.

18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది). 19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు క్రిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.

20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు. 21 గతంలో వారి క్రింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు. 22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.

23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.

సౌలు చేసిన మరో తప్పు

24 ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం క్రింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు.

25 ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది. 26 సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు. 27 అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.

28 సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు.

29 “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది! 30 ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను.

31 ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు. 32 వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు.

33 ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు.

అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు. 34 “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు.

ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు. 35 తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం.

36 “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు.

“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు.

కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు.

37 అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు.

38 “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము. 39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

40 సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు.

“మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు.

41 “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము[a] పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు.

సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు. 42 సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది.

43 “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు.

“నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను.

44 సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు.

45 అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” అని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు.

46 కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు.

ఇశ్రాయేలు శత్రువులతో సౌలు పోరాటం

47 సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు. 48 సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు.

49 యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్ద కుమార్తె పేరు మేరబు. అతని చిన్న కుమార్తె మీకాలు. 50 సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె. సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు.

అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి. 51 సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు.

52 సౌలు ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International