Chronological
ఇశ్రాయేలీయులతో దేవుని ఒడంబడిక
19 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము చేరుకొన్నారు. 2 ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు. 3 అప్పుడు మోషే పర్వతం[a] మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు: 4 ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె[b] నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. 5 కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. 6 మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”
7 కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. 8 ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు.
తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు. 9 “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.
అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.
10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని 11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 12-13 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.
14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.
15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.
16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.
20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.
21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు. 22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.
23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.
24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.
25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.
పది ఆజ్ఞలు
20 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
2 “నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
3 “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
4 “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. 5 ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను.[c] ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. 6 అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
7 “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. 10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.
12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.
13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.
14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.
15 “నీవు దొంగతనం చేయకూడదు.
16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.
17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
ప్రజలకు దేవుడంటే భయం
18 ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.
19 అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.
20 అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.
21 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు. 22 అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు. 23 కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
24 “నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25 మీరు బండలతో[d] బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను. 26 బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”
వేరే నియమాలు, ఆజ్ఞలు
21 (అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:
2 “హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు. 3 ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు. 4 బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”
5 “అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి. 6 ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”
7 “ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు. 8 ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు. 9 ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”
10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి. 11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”
12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి. 13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు. 14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”
15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చంపెయ్యాలి.”
16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు. 19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.
20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి. 21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”
22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. 23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, 25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే. 27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. 29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి. 30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి. 32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”
33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. 34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.
35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది. 36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”
© 1997 Bible League International