Chronological
ఫరో కలలు
41 రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్లు అతనికి కల వచ్చింది. 2 అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి. 3 అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి. 4 అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు.
5 ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు.
6 తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. 7 అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేశాయి. ఫరోకు మరల మెళకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు. 8 మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు.
సేవకుడు యోసేపును గూర్చి ఫరోతో చెప్పుట
9 అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. 10 నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలలో వేసారు. 11 చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కలలు వచ్చాయి. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది. 12 హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు. 13 అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుదల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.”
కలల భావం చెప్పేందుకు యోసేపును పిలిపించుట
14 కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షౌరం చేసుకొని, శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు. 15 అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.
16 యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు కూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.
17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. 18 ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. 19 అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్ఠివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. 20 అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేశాయి. 21 అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.
22 “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. 23 తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. 24 అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేశాయి.
“మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”
కల భావం యోసేపు వివరించుట
25 అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబుతున్నాడు. 26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే. 27 బక్కచిక్కి ఉన్న ఆవులు ఏడు, పీలగా ఉన్న ధాన్యపు వెన్నులు కూడ ఏడు. అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి. 28 త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. 29 ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. 30 అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరవు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత అయినా, దానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. 31 సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.
32 “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. 33 కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. 34 ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. 35 రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. 36 ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”
37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. 38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.
39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. 40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.
41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. 42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. 43 రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.
44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”
45 ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.
46 యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు. 47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. 48 ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు. 49 యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.
50 ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు. 51 మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటిని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేశాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. 52 యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.
కరువు మొదలవుట
53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. 54 తరువాత సరిగ్గా యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. ఆ ప్రాంతల్లోని దేశాలలో ఎక్కడేగాని ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సమృద్ధిగా ఉంది. 55 కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో ఈజిప్టు ప్రజలతో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు.
56 కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరవు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరవు చాలా భయంకరంగా ఉంది. 57 మరియు ప్రాంతాలలోను కరవు తీవ్రంగానే ఉంది. కనుక ఇతర ఈజిప్టు చుట్టుప్రక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది.
కలలు నిజం అగుట
42 ఈ సమయంలో కనాను దేశంలోను కరవు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్లు యాకోబు తెలుసుకొన్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు: “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? 2 ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్లు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి, మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బ్రతుకుతాం.”
3 కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టుకు వెళ్లారు. 4 బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.
5 కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.
6 ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 7 యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.
ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.
8 ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు. 9 అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.
యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.
10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. 11 మేమంతా అన్నదమ్ములం. మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం” అని అతనితో చెప్పారు.
12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేము బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.
13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేము సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”
14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. 15 అయితే మీరు సత్యమే చెబుతున్నట్లు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలినవారు ఇక్కడే చెరసాలలో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేము చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజులపాటు చెరసాలలో పెట్టాడు.
షిమ్యోను బందీగా ఉంచబడుట
18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. 19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. 20 అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.”
ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. 21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.
22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.
23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. 24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. 25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.
26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. 27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. 28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
సోదరులు యాకోబుతో చెప్పుట
29 సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. 30 వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు. 31 కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. 32 మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం.
33 “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైనవాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి. 34 తర్వాత మీ చిన్న సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’”
35 అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.
36 యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు,
37 అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు.
38 అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”
© 1997 Bible League International