Chronological
30 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని రాహేలు తెలుసుకొంది. రాహేలు తన సోదరి లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను” అంది రాహేలు యాకోబుతో.
2 యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. “నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది దేవుడు” అని చెప్పాడు యాకోబు.
3 అప్పుడు రాహేలు “నా దాసిని బిల్హాను నీవు తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నేను తల్లినవుతాను” అని చెప్పింది.
4 కనుక రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇచ్చింది. యాకోబు బిల్హాతో శయనించాడు. 5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.
6 “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేశాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను”[a] అని పేరు పెట్టింది.
7 బిల్హా మరల గర్భవతియై, యాకోబుకు మరో కుమారుని కన్నది. 8 రాహేలు “నా అక్కతో పోటీలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి ఆ కుమారునికి “నఫ్తాలి” అని పేరు పెట్టింది.
9 లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని గ్రహించింది. అంచేత తన దాసి జిల్ఫాను ఆమె యాకోబుకు ఇచ్చింది. 10 అప్పుడు జిల్ఫాకు ఒక కొడుకు పుట్టాడు. 11 లేయా “నేను అదృష్టవంతురాలిని” అనుకొని, ఆ కుమారునికి “గాదు”[b] అని పేరు పెట్టింది. 12 జిల్ఫాకు మరో కుమారుడు పుట్టాడు. 13 “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు” అని లేయా ఆ కుమారునికి “ఆషేరు”[c] అని పేరు పెట్టింది.
14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు[d] అతనికి కనబడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని లేయాను అడిగింది.
15 లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసుకొన్నావు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది.
కాని రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయనించవచ్చు” అని జవాబిచ్చింది.
16 ఆ రాత్రి యాకోబు పొలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో పండుకొన్నాడు.
17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది. 18 లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని లేయా అతనికి ఇశ్శాఖారు[e] అని పేరు పెట్టింది.
19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది. 20 లేయా అంది “ఒక చక్కని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరుగురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను[f] అని ఆ కుమారునికి పేరు పెట్టింది.
21 తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతురుకు దీనా అని పేరు పెట్టింది.
22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్లుగా దేవుడు చేశాడు. 23-24 రాహేలు గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని ఆమె చెప్పింది. “దేవుడు నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించు గాక” అంటూ రాహేలు ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది.
యాకోబు లాబానును మోసగించుట
25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు. 26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”
27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యెహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు. 28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”
29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి. 30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”
31 “అలాగైతే నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు.
యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నీవు నన్ను ఈ ఒక్క పని చేయనిస్తే చాలు: నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను. 32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న ప్రతి గొర్రె పిల్లను నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని, చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం. 33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్లు నీకు తెలుస్తుంది.”
34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను. 35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేశాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని కూడ లాబాను దాచిపెట్టేశాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు. 36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేశారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.
37 కనుక బూరగ, బాదం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. ఆ చువ్వల పైబెరడును అక్కడక్కడ యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి. 38 నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి. 39 ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.
40 మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేశాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు. 41 మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి. 42 అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి. 43 ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.
వెళ్లాల్సిన సమయం—యాకోబు పారిపోవుట
31 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు. 2 అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్లు యాకోబు గమనించాడు. 3 అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
4 కనుక యాకోబు తన గొర్రెలు, మేకల మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు. 5 రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు. 6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. 7 అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు.
8 “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి. 9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
10 “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. అలా కలుస్తున్న మగ మేకలు మాత్రమే మచ్చలు, చారలు గలవిగా నేను చూశాను. 11 కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు.
“‘చిత్తం’ అన్నాను నేను.
12 “ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్లు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. క్రొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. 13 బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’”
14-15 రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు ఆ తరువాత మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు. 16 మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”
17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. 18 అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. 19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.
20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. 21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.
22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. 23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. 24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.
దొంగిలించిన దేవుళ్ల కోసం వెదకుట
25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.
26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? 27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. 28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. 29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. 30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”
31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. 32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.
33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. 34 రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.
35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.
36 అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? 37 నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్లు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు. 38 ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి కూడా నేను తినలేదు. 39 ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను. 40 పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది. 41 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేశాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు. 42 అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేశాడు.”
యాకోబు, లాబాను సంధి
43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. 44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్లు సూచనగా దాన్ని నిలువబెట్టాడు. 46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేశారు. 47 ఆ స్థలానికి యగర్ శాహదూత[g] అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు[h] అని పేరు పెట్టాడు.
48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.
49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. 51 ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ. 52 మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప, ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు. 53 ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.”
యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు. 54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు. 55 మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.
© 1997 Bible League International