Chronological
రాజ్యాలకు సంబంధించిన యెహోవా సందేశాలు
46 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.
ఈజిప్టును గురించిన వర్తమానం
2 ఈ వర్తమానం ఈజిప్టు[a] దేశాన్ని గురించి చెప్పబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నదీతీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి.
యుద్ధానికి నడవండి.
4 గుర్రాలను సిద్ధం చేయండి.
సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి.
యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి.
మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి.
మీ ఈటెలకు పదును పెట్టండి.
మీ కవచాలను ధరించండి.
5 నేనేమిటి చూస్తున్నాను?
ఆ సైన్యం భయపడింది!
సైనికులు పారిపోతున్నారు.
ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు.
వారు తత్తరపడి పారిపోతున్నారు.
వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు.
ఎటు చూచినా భయం.”
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
6 “వేగంగా పరుగెత్తేవారు,
బలవంతులు కూడా తప్పించుకోలేరు.
వారు తూలి పడిపోతారు.
ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.
7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు?
పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?
8 పొంగి ప్రవహించే నైలు నదిలా
వచ్చేది ఈజిప్టు దేశమే.
మహా వేగంతో ప్రవహించే
మహా నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే.
‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను.
నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.
9 గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి.
సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి.
యోధుల్లారా ముందుకు పదండి.
కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి.
లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.
10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు!
ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు.
యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది.
దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది.
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది.
ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో.
నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు.
నీ గాయాలు మానవు.
12 నీ రోదనను దేశాలు వింటాయి.
నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది.
ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు.
ఆ యోధులిద్దరూ కలిసి క్రింద పడతారు.”
13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.
14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి.
మిగ్దోలు నగరంలో బోధించండి.
ఈ సందేశాన్ని నోపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి:
‘యుద్ధానికి సిద్ధపడండి.
ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’
15 ఈజిప్టూ, నీ బలమైన యోధులెందుకు చంపబడతారు?
వారు నిలువలేరు.
ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!
16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు.
వారొకరి మీద మరొకరు పడతారు.
వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం.
మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము.
మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు.
మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.
17 వారి స్వస్థలాలో ఆ సైనికులు,
‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు;
అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.’”
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు.
“నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేస్తున్నాను.
ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు.
తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
బందీలై పోవటానికి సిద్ధమవండి.
ఎందువల్లనంటే, నోపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది.
నగరాలు నాశనమవుతాయి.
వాటిలో ఎవరూ నివసించరు!
20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు.
శత్రు దాడికి వారు తట్టుకోలేరు.
వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది.
వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
22 బుసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
పాములా ఈజిప్టు వుంది.
శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు.
అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది.
గొడ్డళ్లు చేపట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు.
వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”
23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
“ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు.
అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని
అది నరికివేయబడుతుంది.
మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు.
లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”
25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును[b] నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. 26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.
“చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం
27 “నా సేవకుడవైన యాకోబూ,[c] భయపడవద్దు.
ఇశ్రాయేలూ, బెదరవద్దు.
ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను.
వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను.
యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి.
అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
28 యెహోవా ఇలా అంటున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, భయపడకు.
నేను నీతో వున్నాను.
నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను.
ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను.
నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి.
కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను.
నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
ఫిలిప్తీయుల గురించిన సందేశం
47 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.
తండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించలేరు.
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు!
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన
వారందరినీ నాశనం చేస్తాడు.
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.
క్రేతు[d] ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?[e]
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”
మోయాబును గురించిన సందేశం
48 ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“నెబో పర్వతానికి[f] చేటు కలుగుతుంది.
నెబో పర్వతం నాశనమవుతుంది.
కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది.
అది పట్టుబడుతుంది.
బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది.
అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు.
మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు.
‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు.
మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు.
కత్తి నిన్ను వెంటాడుతుంది.
3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను.
అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
4 మోయాబు ధ్వంసం చేయబడుతుంది.
దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.
5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు.
వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు.
హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను,
బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి!
ఎడారిలో అరుహ వృక్షం[g] వీచినట్లు మీరు పారిపొండి.
7 “మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు.
కావున మీరు పట్టుబడతారు.
కెమోషు[h] దైవం బందీగా కొనిపోబడతాడు.
అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.
8 వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు.
ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు.
లోయ శిథిలము చేయబడుతుంది.
ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది.
యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన
ఇది జరిగి తీరుతుంది.
9 మోయాబు పొలాలపైన ఉప్పు[i] చల్లుము.
దేశం వట్టి ఎడారి అయిపోతుంది.
మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి.
వాటిలో ఎవ్వరూ నివసించరు.
10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా,
వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది.[j]
11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు.
కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది.
మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు.
అతడు నిర్బంధించబడి ఇతర దేశానికి కొనిపోబడలేదు.
పూర్వంవలెనే అతడు ఇప్పుడూ రుచిగానే వున్నాడు.
అతని సువాసన మారలేదు.”
12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“కాని మిమ్మల్ని మీ జాడీలలో[k] నుంచి బయట పోయుటకు
అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను.
ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు.
తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”
13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు[l] నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’
అని మీరు చెప్పుకోలేరు.
15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు.
శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు.
మోయాబు యువ వీరులంతా నరకబడతారు.”
ఈ వర్తమానం రాజునుండి వచ్చినది.
ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
16 “మోయాబు అంతం దగ్గర పడింది.
మోయాబు త్వరలో నాశనమైపోతుంది.
17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి.
మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు.
అందువల్ల వానికొరకు మీరు విచారించండి.
‘అధిపతుల అధికారం విరిగిపోయింది.
మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’
అని మీరు చెప్పండి.
18 “దీబోను వాసులారా
గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి.
నేలమీద మట్టిలో కూర్చోండి.
ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు.
అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
19 “అరోయేరు నివాసులారా,
దారి ప్రక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి.
పారిపోయే మనిషిని చూడండి.
పారిపోయే స్త్రీని చూడండి.
ఏమి జరిగిందో వారిని అడగండి.
20 “మోయాబు పాడుపడి,
అవమానముతో నిండి పోతుంది.
మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది.
మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది[m] వద్ద ప్రకటించండి.
21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు.
తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,
22 దీబోను, నెబో, బేత్-దిబ్లాతయీము,
23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది.
మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.
25 మోయాబు బలం తగ్గిపోయింది.
మోయాబు చేయి విరిగిపోయింది.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది.
కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి.
మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు.
ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.
27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు.
ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది.
నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి,
ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.
28 మోయాబు ప్రజలారా,
మీ పట్టణాలను వదిలిపెట్టండి.
వెళ్లి గుట్టల్లో నివసించండి.
గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”
29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము.
అతడు మిక్కిలి గర్విష్ఠి.
తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు.
అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు.
అతడు మహా గర్విష్ఠి.”
30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు.
కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు.
అతను చెప్పేవి చేయలేడు.
31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను.
మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను.
కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.
32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను!
సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి.
అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి.
కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.
33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి.
గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను.
రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి
వారి అలరింతలు అంతమయ్యాయి.
34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది. 35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
36 “మోయాబు కొరకు నేను మిక్కిలి ఖిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి. 37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నది.[n] ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు. 38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.
39 “మోయాబు విచ్ఛిన్నమవటంతో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు.
అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.
41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి.
బలమైన దుర్గాలు ఓడింపబడతాయి.
ఆ సమయంలో మోయాబు సైనికులు
ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.
42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది.
ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”
43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు[o] పొంచివున్నాయి.
44 ప్రజలు భయపడి పారిపోతారు.
పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు.
ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే
అతడు ఉరిలో చిక్కుకుంటాడు.
మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.”
ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు.
వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు.
అయినా అక్కడ రక్షణ దొరకలేదు.
హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది.
సీహోను పట్టణంలో[p] నిప్పు చెలరేగింది.
అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.
46 మోయాబూ, నీకు చెడు దాపురించింది.
కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు.
నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి
బందీలుగా కొనిపోబడుతున్నారు.
47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం.
ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.
© 1997 Bible League International