Chronological
మార్గదర్శకమైన రేకాబీయుల మంచి కుటుంబం
35 యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా సందేశం ఇలా ఉంది: 2 “యిర్మీయా, రేకాబీయుల[a] వద్దకు వెళ్లుము. యెహోవా దేవాలయపు ప్రక్కగదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. వారు తాగటానికి ద్రాక్షారసాన్ని అందించుము.”
3 కావున నేను (యిర్మీయా) యజన్యాను[b] తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా[c] అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను. 4 ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది ప్రక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు. 5 పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు ఉంచాను. “కొంచెం ద్రాక్షారసం తీసుకోండి” అని నేను వారికి చెప్పాను.
6 కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం త్రాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని త్రాగము. అతని ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు. 7 పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. ద్రాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.’ 8 కావున రేకాబీయులమైన మేము మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు బద్ధులమైయున్నాము. మేమెన్నడూ ద్రాక్షారసం త్రాగము. మా భార్యాలు, కుమారులు, కుమార్తెలు కూడా ద్రాక్షారసం త్రాగరు. 9 నివసించటానికి మేము ఇండ్లను నిర్మించము. ద్రాక్షాతోటలు గాని, పొలాలు గాని మేము కలిగివుండము. మేమెన్నడూ పంటలు పండించము. 10 మేము గుడారాల్లో నివసిస్తూ. మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ పాలిస్తున్నాము. 11 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళదాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నాము. ఆ విధంగా మేము యెరూషలేములో ఉండి పోయాము.”
12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది: 13 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు. 14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం త్రాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం త్రాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు. 15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు. 16 యెహోనాదాబు సంతతివారు వారి పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.”
17 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.”
18 రేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీరంతా మీ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధనలను మీరు అనుసరించారు. అతను చెప్పినదంతా మీరు ఆచరించారు. 19 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.’”
యిర్మీయా పుస్తకాన్ని రాజైన యెహోయాకీము తగలబెట్టటం
36 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. ఇది యెషీయా కుమారుడైన యెహోయాకీము యూదా రాజ్యాన్ని పాలిస్తున్న నాల్గవ సంవత్సరం. యెహోవా వర్తమానం ఇలా వుంది: 2 “యిర్మీయా, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను యిచ్చే సందేశాలన్నిటినీ గ్రంథస్థం చేయుము. ఇశ్రాయేలు, యూదా రాజ్యాల గురించి, తదితర రాజ్యాల గురించి నేను నీతో మాట్లాడియున్నాను. యోషీయా రాజైనప్పటి నుండి ఈ నాటి వరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ వ్రాయుము. 3 యూదా వంశం వారికి నేను చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.”
4 కావున బారూకు అనే వానిని యిర్మీయా పిలిచాడు. బారూకు తండ్రి పేరు నేరీయా, యెహోవా తనతో చెప్పిన సందేశాలన్నిటిని యిర్మీయా బయటికి పలికాడు. యిర్మీయా మాట్లాడుతూ ఉండగా, బారూకు గ్రంథస్థం[d] చేశాడు. 5 పిమ్మట బారూకుతో యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దేవాలయంలోనికి వెళ్లలేను. నేనక్కడికి వెళ్లటానికి అనుమతి లేదు. 6 అందుచేత నీవే దేవాలయానికి వెళ్లాలని నా కోరిక, ఉపవాసాల రోజున నీవక్కడికి వెళ్లి, నీవు వ్రాసిన విషయాలు ప్రజలకు చదివి వినిపించుము. నీవు రాసిన యెహోవా వర్తమానాలను నేను నీకు చెప్పిన విధంగా చదివి వినిపించు. యూదా పట్టణాల నుండి యెరూషలేముకు వచ్చే ప్రజలందరికీ ఆ వర్తమానాలను చదివి వినిపించు. 7 బహుశః ఆ ప్రజలు తమకు సహాయపడమని యెహోవాను వేడు కొనవచ్చు. బహుశః ప్రతి ఒక్కడూ చెడుకార్యాలు చేయటం మానివేయవచ్చు. వారిపట్ల తాను చాలా కోపంగా వున్నట్లు యెహోవా ప్రకటించియున్నాడు.” 8 కావున నేరీయా కుమారుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన ప్రకారం చేశాడు. బారూకు తాను గ్రంథస్థం చేసిన యెహోవా వర్తమానాన్ని బిగ్గరగా చదివాడు. అతను దానిని యెహోవా ఆలయంలో చదివాడు.
9 రాజైన యెహోయాకీము పాలన ఐదు సంవత్సరాలు దాటి తొమ్మిదవ నెల జరుగుతూ ఉండగా ఉపవాస దినం ప్రకటించబడింది. యెరూషలేము నగర వాసులు, యూదా పట్టణాల నుంచి యెరూషలేముకు వచ్చి నివసిస్తున్న వారందరం యెహోవా ముందు ఉపవాసము చేయవలసి ఉంది. 10 ఆ సమయంలో యిర్మీయా మాటలన్నిటినీ తాను వ్రాసి ఉంచిన పుస్తకంనుండి బారూకు చదివాడు. దానినతడు దేవాలయంలో చదివాడు. దేవాలయంలో చేరిన ప్రజలంతా వినేలా బారూకు తాను వ్రాసిన పుస్తకాన్ని చదివాడు. తన పత్రం (పుస్తకం) చదివినప్పుడు బారూకు పైఆవరణలో ఉన్న గెమర్యా గదిలో ఉన్నాడు. ఆలయ నూతన ద్వారం వద్ద ఆ గది నిర్మింపబడి ఉంది గెమర్యా తండ్రి పేరు షాఫాను. గెమర్యా అను వ్యక్తి దేవాలయంలో వ్రాయువాడు (లేఖికుడు)
11 పుస్తకం నుండి బారూకు చదివిన యెహోవా వర్తమానాలన్నిటినీ మీకాయా అనువాడు విన్నాడు. మీకాయా తండ్రి పేరు గెమర్యా గెమర్యా తండ్రి పేరు షాఫాను. 12 పుస్తకం నుండి చదవబడిన యెహోవా వర్తమానాలను విన్న మీకాయా రాజభవనంలో ఉన్న కార్యాదర్శి గదికి వెళ్లాడు. రాజభవనంలో ఉన్నతాధి కారులంతా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో కార్యదర్శి ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా మరియు తదితర రాజోద్యోగులు ఉన్నారు. 13 పుస్తకంలో నుండి బారూకు ప్రజలందరి ముందు చదవగా తాను విన్నదంతా మీకాయా ఆ అధికారులకు తెలియజేశాడు.
14 ఆ అధికారులంతా కలిసి యెహూది యను వానిని బారూకు వద్దకు పంపారు. యెహూది తండ్రి పేరు నెతన్యా. నెతన్యా తండ్రి పేరు షెలెమ్య. షెలెమ్య తండ్రి పేరు కూషి. యెహూది అనేతను బారూకు వద్దకు వెళ్లి, “నీవు చదివిన పుస్తకం తీసికొని నా వెంట రమ్మని” అన్నాడు.
నేరీయా కుమారుడైన బారూకు పుస్తకాన్ని తీసికొని యెహూది వెంట అధికారుల వద్దకు వెళ్లాడు.
15 ఆ అధికారులు బారూకును చూచి, “కూర్చో! మాకు ఆ ప్రతాన్ని చదివి వినిపించు” అని అన్నారు.
అప్పుడు బారూకు ఆ పత్రాన్ని వారికి చదివి వినిపించాడు.
16 గ్రంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.” 17 తరువాత ఆ అధికారులు బారూకును ఒక ప్రశ్న అడిగారు. “బారూకూ, నీవు వ్రాసిన ఈ వర్తమానములు నీకెలా లభ్యమైనాయి? యిర్మీయా నీతో మాట్లాడిన విషయాలను నీవు వ్రాసియున్నావా?” అని అడిగారు.
18 అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా మాట్లాడగా, ఆ వర్తమానాలన్నిటినీ నేను సిరాతో ఈ పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు.
19 అది విన్న రాజ్యాధికారులు బారూకుతో, “నీవు, యిర్మీయా పోయి తప్పక దాగుకోవాలి, మీరెక్కడ దాగియున్నారో ఎవ్వరికీ తెలియనీయవద్దు” అని అన్నారు.
20 పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం గురించి అంతా చెప్పారు.
21 అప్పుడు రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని[e] తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకుడైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి యెహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు. 22 ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల[f] కావటంతో, రాజైన యెహోయాకీము శీతకాలపు గదిలో (వెచ్చని గది) కూర్చుని ఉన్నాడు. రాజుముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ వుంది. 23 చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న ఆ గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు. 24 పైగా రాజైన యెహోయాకీము, అతని సిబ్బంది ఆ వర్తమానాన్ని విని భయపడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారు తమ బట్టలను చించుకొనలేదు.
25 ఎల్నాతాను, దెలాయ్యా మరియు గెమర్యా అనేవారు రాజుతో మాట్లాడి గ్రంథాన్ని తగులబెట్టకుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు వినలేదు. 26 రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కోలేకపోయారు.
27 యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. యెహోవా నుండి వచ్చిన సందేశాలన్నీ పొందుపర్చబడిన సుదీర్గ పుస్తకాన్ని రాజైన యెహోయాకీము తగులబెట్టిన పిమ్మట ఇది జరిగింది. యిర్మీయా ఆ విషయాలు బారూకుతో చెప్పగా, బారూకు వాటన్నిటినీ పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయాకు వచ్చిన యెహోవ సందేశం ఇలా ఉంది:
28 “యిర్మీయా, మరో పత్రం తీసికో. దానిమీద మొదటి చుట్టలో వున్న వర్తమానములన్నిటినీ నీవు తిరిగి వ్రాయుము. ఆ మొదటి పుస్తకాన్నే యూదా రాజైన యెహోయాకీము తగుల బెట్టాడు. 29 యిర్మీయా, యూదా రాజైన యెహోయాకీముకు ఈ విషయం కూడా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు వ్రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు చెప్పాడు?” అని నీవు అన్నావు. 30 కావున, యూదా రాజైన యెహోయాకీము విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీము సంతతివారు దావీదు సింహాసనంపై కూర్చొనరు. యెహోయాకీము చనిపోయినప్పుడు రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరగవు. అతని కళేబరం నేలమీద పారవేయబడుతుంది. అతని శవం పగలు ఎండకు ఎండి, రాత్రి మంచుకు నానిపోతుంది. 31 ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.’”
32 యిర్మీయా మరో గ్రంథాన్ని తీసికొని లేఖకుడు నేరీయా కుమారుడు బారూకుకు ఇచ్చాడు. రాజైన యెహోయాకీము నిప్పులో వేసి తగులబెట్టిన పుస్తకంలో వున్న వర్తమానములన్నిటినీ, యిర్మీయా చెప్పుచుండగా బారూకు ఆ పత్రం మీద మరల వ్రాశాడు. పాత వర్తమానాల వంటివే మరికొన్ని క్రొత్తగా ఈ రెండవ గ్రంథములో చేర్చబడ్డాయి.
యిర్మీయాను బంధించటం
37 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను[g] స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు. 2 యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.
3 యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”
4 (ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు. 5 అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి వచ్చిన సైన్యం (కల్దీయులు) తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)
6 యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది: 7 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది. 8 ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’ 9 యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు. 10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’”
11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో 12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి[h] వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు. 13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం[i] వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు” అని అన్నాడు.
14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధికారుల వద్దకు తీసికొని వెళ్లాడు. 15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు. 16 యోనాతాను ఇంటి క్రిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి క్రింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.
17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు.
“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు. 18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు? 19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు. 20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”
21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.
© 1997 Bible League International