Chronological
యిర్మీయా భూమిని కొనుట
32 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం[a] గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. 2 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. 3 (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. 4 కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. 5 బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”)
6 యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: 7 నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.
8 “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’”
అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. 9 అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. 10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచాను. 11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసుకున్నాను. 12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూకునకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.
13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: 14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ 15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’”
16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:
17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు. 18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయామయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు. 19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు. 20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు. 21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!
22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది. 23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసుకున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకరమైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.
24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.
25 “యెహోవా, నా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!’ మనీ చెపుతున్నావు. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”
26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది: 27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.” 28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. 29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది. 30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. 31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. 32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.
33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు. 34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.
35 “బెన్హిన్నోము[b] లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తిని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. 38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. 39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారికి కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.
40 “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు. 41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’”
42 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును నేనే సంభవింపజేశాను. అదే మాదిరి నేను వారికి మేలు కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. 43 ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. ఇందులో మనుష్యులు లేరు, జంతువులు గాని లేవు. కల్దీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు అని అనుకుంటారు. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ ఇక్కడ పొలాలు కొంటారు. 44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్రపరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాలలోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.
దేవుని వాగ్దానం
33 యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. 2 యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: 3 “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. 4 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
5 “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.
6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. 7 యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. 8 వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను. 9 అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. 11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
12 సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. 13 గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”
మంచి కొమ్మ
14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. 18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”
19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. 20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, 21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”
23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: 24 “యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”
25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. 26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
సిద్కియాకు హెచ్చరిక
34 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన క్రింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.
2 ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: యిర్మీయా, యూదా రాజైనా ‘సిద్కియా వద్దకు వెళ్లి ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా ఈ విధంగా తేలియ జెప్పుచున్నాడు: యెరూషలేము నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబెడతాడు! 3 సిద్కియా, బబులోను రాజు నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు. 4 కాని, యూదా రాజువైన సిద్కియా! యెహోవా వాగ్దానం శ్రద్ధగా వినుము. నిన్ను గురించి యెహోవా యిలా చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు. 5 నీవు ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. అదే రీతిగా ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు జరుపుతారు. వారు నీ కొరకు విలపిస్తారు. “అయ్యో, మా నాయకుడా!” అని విచారిస్తారు. నాకై నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.
6 యెహోవా యొక్క ఈ సమాచారాన్ని యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా ఇచ్చాడు. 7 అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ప్రజలు ఒప్పందాన్ని ఉల్లంఘించుట
8 హెబ్రీ బానిసలకు స్వేచ్ఛ నివ్వాలని రాజైన సిద్కియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడంబడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది. 9 ప్రతి పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల చేయవలసి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండ హెబ్రీ బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంశీయులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకోరాదు. 10 అందువల్ల యూదా నాయకులు, ప్రజలు ఈ ఒడంబడికను అంగీకరించారు. ప్రతి పౌరుడు తన వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదలచేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని చేయించరాదు. అందుకు ప్రతి పౌరుడు ఒప్పుకున్నాడు. దానితో బానిసలంతా స్వేచ్ఛగా వదిలివేయబడ్డారు. 11 కాని ఆ తరువాత[c] బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.
12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు చేరింది: 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “‘యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ పూర్వీకులను ఈజిప్టు నుండి నేను తీసుకొని వచ్చాను. నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన చేసినాను. 14 మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు. 15 కొద్ది కాలంక్రిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు. 16 కాని ఇప్పుడు మీరు మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించరని నిరూపించుకున్నారు. ఇది మీరెలా చేశారు? వదిలి పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ తిరిగి తీసుకున్నారు. వారు తిరిగి బానిసలయ్యేలా ఒత్తిడి చేశారు.’
17 “అందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ సాటి హెబ్రీయులకు స్వేచ్ఛ నివ్వలేదు. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా నేను స్వేచ్ఛ నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను స్వేచ్ఛ నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.’” ఇదే యెహోవా వాక్కు. “‘మిమ్మల్ని గురించి చెప్పగానే ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చర్యం చెందేలా మీకు మహా విపత్తు కలుగజేస్తాను. 18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే.[d] 19 యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోని ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు. 20 కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తాను. వారిని చంప తలపెట్టిన ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. వారి శవాలు పక్షులకు, క్రూర మృగాలకు ఆహారమవుతాయి. 21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి[e] నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను. 22 బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలిపిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు ‘ఆ సైన్యం యెరూషలేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, దానికి నిప్పుపెట్టి తగలబెడతారు. నేను యూదా రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు వట్టి ఎడారులవలె మారి పోతాయి. మనుష్యులెవ్వకూ అక్కడ నివసించరు.’”
© 1997 Bible League International