Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 22-23

యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట

22 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె. యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.

ఆలయ మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట

యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు. “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు. యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి. పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.

ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట

ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.

కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు. 10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.

11 రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలు వినగానే, తాను తలక్రిందులైనాననీ, విచారం చెందినాననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపుకొన్నాడు. 12 తర్వాత రాజు యాజకుడు హిల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమారుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ ఇచ్చాడు. 13 యోషీయా రాజు, “వెళ్లి మనమేమి చేయాలో యెహోవాని అడుగు. నా కోసము, ప్రజల కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీకులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడంవల్ల. మనకోసము వ్రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము పాటించలేదు” అని చెప్పాడు.

యోషీయా మరియు ప్రవక్త్రి అయిన హుల్దా

14 అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, అక్బోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్హను కుమారుడు తిక్వా కుమారుడైన షల్లూము భార్యయే హుల్దా. అతను యాజకుల వస్త్రాలను జాగరూకతతో చూస్తున్నాడు. హుల్దా యెరూషలేములో రెండవ ప్రదేశంలో నివసిస్తున్నది. వారు హుల్దా వద్దకు పోయి మాట్లాడారు.

15 తర్వాత హుల్దా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా వద్దకు పంపిన మనిషితో చెప్పు. 16 యెహోవా ఇలా చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలానికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించబడ్డవి. 17 యూదా ప్రజలు నన్ను విడిచి పెట్టారు. ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు తయారు చేశారు. అందువల్ల ఈ స్ధలము పట్ల నా కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్పశక్యము కానట్టి నిప్పు వంటిది.”

18-19 “యూదా రాజైన యోషీయా యెహోవా యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. యోషీయాకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ హృదయము మృదువైనది. ఈ విషయాలు వినగానే నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) భయంకర సంఘటనలు జరుగుతాయని నేను చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు చింపావు. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు. 20 నీ పూర్వికులతో వుండడానికి నేను నిన్ను తీసుకువస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూషలేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడవు.”

అప్పుడు యాజకుడు హిల్కీయా, అహికాము, అక్బోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకు ఆ సందేశము చెప్పారు.

ప్రజలు ధర్మశాస్త్రము వినుట

23 యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.

రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.

తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.

యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.

యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.

తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.

8-9 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).

10 అబద్ధపు దేవుడైన మొలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్‌హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించుకొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు. 11 వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశద్వారం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.

12 వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు ప్రాంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.

13 వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహమది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు. 14 యోషీయా రాజు స్మారక శిలలను పగులగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద చచ్చినవారి ఎముకలను వెదజల్లాడు.

15 యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను. 16 యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు.

తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.

17 “నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు.

“యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.

18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.

19 యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.

20 యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడుచేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.

యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట

21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.

22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.

24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.

25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.

26 కాని యూదా ప్రజలపట్ల యెహోవా తన ఆగ్రహాన్ని మానలేదు. మనష్షే చేసిన అన్ని పనులకు యెహోవా వారిపట్ల కోపముగా వున్నాడు. 27 “ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని బలవంతంగా వీడునట్లుగా నేను చేశాను. యూదాకు కూడా ఇలాగే చేస్తాను. నా దృష్టినుండి యూదాని మరలిస్తాను. నేను యెరూషలేమును అంగీకరించను. అవును. నేను నగరాన్ని ఏర్పరచుకున్నాను. నేను మాటలాడేటప్పుడు యెరూషలేము గురించి నేను ఇలా అన్నాను: ‘నా పేరు అక్కడ వుంటుంది’ అని. కాని నేను ఆ ప్రదేశంలో వున్న ఆలయాన్ని ధ్వంసము చేస్తాను” అని యెహోవా చెప్పాడు.

28 యోషీయా చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథములో వ్రాయబడివున్నవి.

యోషీయా మరణం

29 యెషీయా పరిపాలనా కాలంలో ఈజిప్టు రాజైన ఫరోనెకో యూఫ్రటీసు నది వద్ద అష్షూరు రాజుమీదికి దండెత్తి పోయెను. మెగిద్దోలో ఫరో యోషీయాను కలుసుకోడానికి వెళ్లాడు. ఫరో యోషీయాను చూసి, అతనిని చంపాడు. 30 యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము మీద వుంచి మెగిద్డోనుంచి యెరూషలేము వరకు మోసుకుపోయారు. వారు యోషీయాను అతని సమాధిలో సమాధి చేశారు.

తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించారు. వారు యెహోయాహాజును తమ క్రొత్త రాజుగా చేసుకున్నారు.

యెహోయాహాజు యూదా రాజుగా నియమింపబడుట

31 యెహోయాహాజు రాజగు నాటికి, అతను 23 యేండ్లవాడు. యెరూషలేములో అతను మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 32 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన ఆ పనులనే యెహోయాహాజు చేశాడు.

33 ఫరోనెకో హమాతు దేశములో రిబ్లా చెరసాలలో యెహోయాహాజును బంధించాడు.

34 అందువల్ల యెహోయాహాజు యెరూషలేములో పరిపాలించలేకపోయాడు. ఫరోనెకో 7,500 తులాల వెండిని, 75 పౌన్ల బంగారమును యూదా కట్టునట్లుగా చేశాడు. ఫరోనెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని యెహోయాకీము అని మార్చాడు. మరియు ఫరోనెకో ఎల్యాకీము యెహోయాహాజుని ఈజిప్టుకు తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో మరణించాడు. 35 యెహోయాకీము వెండి బంగారాలు ఫరోనెకోకి ఇచ్చాడు. కాని యెహోయాకీము ప్రజలచేత పన్నులు కట్టింపజేసి, ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు. అందువల్ల ప్రతి వ్యక్తి తనవంతు వెండిని, బంగారాన్ని ఇచ్చాడు. మరియు యెహోయాకీము రాజు ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు.

36 యెహోయాకీము రాజగునాటికి, అతను 25 యేండ్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమాకి చెందిన పెదాయా కుమార్తె. 37 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహోయాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన పనులే యెహోయాకీము చేశాడు.

2 దినవృత్తాంతములు 34-35

యూదా రాజుగా యోషీయా

34 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు. ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు. యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు. బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు. బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు. మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. ఆ పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు. యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండిగా పగుల గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పిండిగా పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు.

యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆ మేరకు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు. 10 ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు.

11 ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి. 12-13 పనివారంతా విశ్వాసంగా పనిచేశారు. వారిపై తనిఖీ అధికారుల పేర్లు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను వాయించుటలో నేర్పురులైన లేవీయులు కూడా బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులుగాను పనిచేశారు.

ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనుట

14 ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. 15 హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. 16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు. 17 వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.” 18 తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు. 19 రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.[a] 20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు. 21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”

22 హిల్కీయా, రాజసేవకులు[b] కలిసి ప్రవాదిని హుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు. 23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము. 24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా[c] నా కోపం చల్లారదు!’

26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక, 28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు[d] తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.

29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. 30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది. 31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు. 32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు. 33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.

యోషీయా పస్కా పండుగ జరుపుట

35 యెరూషలేములో యెహోవాకు యోషీయా రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి నెలలో పదునాల్గవ రోజున పస్కా గొఱ్ఱెపిల్ల చంపబడింది. వారి వారి విధులు నిర్వర్తించటానికి యోషీయా యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహపర్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్నవారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులైన లేవీయులతోను, యోషీయా మాట్లాడినాడు. ఆ లేవీయులతో అతడిలా అన్నాడు: “సొలొమోను నిర్మించిన ఆలయంలో పవిత్ర పెట్టెను వుంచండి. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర పెట్టెను ఇక మీరు మీ భుజాల మీద ఒకచోటు నుండి మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన యెహోవాకు ఇప్పుడు మీరు సేవ చేయండి. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. మీమీ వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమవ్వండి. రాజైన దావీదు, అతని కుమారుడు రాజైన సొలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు చేయండి. కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిలబడాలి. ప్రజలలో ప్రతి వంశంవారికి సహాయపడే నిమిత్తం, మీరలా నిలబడండి. పస్కా గొఱ్ఱెపిల్లను వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసికొనండి. మీ సోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు గొఱ్ఱెపిల్లలను సిద్ధం చేయండి. యెహోవా మనకు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని మోషేద్వారా మనకు ప్రసాదించాడు.”

పస్కా బలులుగా అర్పించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు యోషీయా ముప్పైవేల గొఱ్ఱెలను ఇచ్చాడు. ప్రజలకు అతడింకా మూడువేల పశువులను కూడా ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజైన యోషీయా పశుసంపద నుండి ఇవ్వబడినాయి. పస్కా పండుగలో వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీయులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన యాజకుడు హిల్కీయా, జెకర్యా, యెహీయేలు అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజకులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకలను, మరియు మూడువందల గిత్తలను ఇచ్చారు. పైగా కొనన్యా, అతని సోదరులు షెమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలులకుగాను ఐదువందల గొఱ్ఱెలను, మేకలను, మరియు ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా లేవీయుల పెద్దలు.

10 పస్కా సేవ ప్రారంభానికి సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. రాజు ఆ మేరకు వారిని ఆజ్ఞాపించాడు. 11 పస్కా గొఱ్ఱెపిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకులకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 12 పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది. 13 లేవీయులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త్ర ప్రకారం అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండలలోను, పాత్రలలోను, పెనముల మీద వుడకబెట్టారు. వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు. 14 ఇది జరిగిన తరువాత లేవీయులు, అహరోను సంతతి యాజకులు తమ వంతు మంసాన్ని తీసుకున్నారు. ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్నమయ్యారు. దహనబలి మంసాన్ని అర్పణల కొవ్వును కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు. 15 రాజైన దావీదు నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవీ గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, మరియు రాజు యొక్క ప్రవక్త యెదూతూను. ప్రతిద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ తీర్చారు.

16 రాజైన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించబడ్డాయి. 17 అక్కడున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు. 18 ప్రవక్తయగు సమూయేలు జీవించియున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుపబడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజైన యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక పద్ధతిలో జరిపారు. 19 యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.

యోషీయా మరణం

20 యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు. 21 కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు.

వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినది కాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”

22 కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు. 23 రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.

24 దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు. 25 యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికలు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతిక ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందుపర్చబడినాయి.

26-27 తాను రాజుగా వున్న కాలంలో యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. ఆ గ్రంథం యెహోవాపట్ల అతనికున్న ప్రేమ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన తీరును తెలియజేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International