Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 40-43

ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది

40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
యెరూషలేముతో దయగా మాట్లాడండి.
    ‘నీ సేవాసమయం అయిపోయింది
    నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”

వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
    ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
ప్రతి లోయనూ పూడ్చండి
    ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
    కరకు నేలను సమనేలగా చేయండి.
అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
    మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”

ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
    కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
    మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
    ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
    సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
    కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”

రక్షణః దేవుని శుభ వార్త

సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
    ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
    భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
    “చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
    మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
    వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
    యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
    గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”

దేవుడు లోకాన్ని చేశాడు; దాన్ని ఆయన పరిపాలిస్తాడు

12 మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు?
    ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు?
భూమిమీద ధూళి అంతటినీ కొలిచేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు?
    పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే.
13 యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు.
    యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు.
14 యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా?
    న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా?
    యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా?
    యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా?
    లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు.
15 చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి.
దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే
    అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి.
16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు.
    లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.
17 లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం
    దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు.

దేవుడు ఎలాంటివాడవి ప్రజలు ఊహించలేరు

18 నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా?
    లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు.
19 కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి
    వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు.
ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు.
    బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు.
20 పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు.
    కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు.
తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు.
    అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు.
21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ?
    తప్పక అది నీవు విన్నావు.
    ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు.
    భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.
22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు.
    ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు.
ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు.
    ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని క్రింద కూర్చునేందుకు పరిచాడు.
23 నిజమైన దేవుడు పరిపాలకులను ప్రాముఖ్యత లేనివారినిగా చేస్తాడు.
    ఆయన ఈ లోకపు న్యాయమూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు.
24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు
    కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే
దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు.
    దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి.
    గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.
25 పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా?
    లేదు. నాకు ఎవరు సమానం కాదు.”

26 పైన ఆకాశాలను చూడు.
    ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు?
    ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు?
    ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు?
సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు,
    అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.

27 యాకోబూ, ఇది నిజం!
    ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి!
“నేను జీవించే విధము యెహోవా చూడలేదు
    దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”

28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు.
    భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు.
29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు.
    శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు.
30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి.
    చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు.
31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది.
    వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు.
    వారు అలసి పోకుండా నడుస్తారు.

యెహోవా శాశ్వతమైన సృష్టికర్త

41 యెహోవా చెబుతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా, ధైర్యంగా ఉండండి.
    నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
    ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం.
ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు?
    మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
    వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
    వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
    అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
    ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
    యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
    అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
దూర దూర స్థలాలూ, మీరంతా
    చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ,
    మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
    నా మాటలు వినండి.

“పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”

యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు

యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
    యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
    నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
    నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
    నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
    నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
    భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
    నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
    కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
    కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
    పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
    నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
    అని నేను నీతో చెబుతున్నాను.
14     ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”

సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.

“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
    నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
    ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
    నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
    గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.

17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
    కానీ వారికి ఏమీ దొరకవు.
    వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
    నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
    లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
    ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
    దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
    ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
    ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”

అబద్దపు దేవతలకి యెహోవా సవాలు

21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.

24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.”

యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం

25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను.
    సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
    అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.

26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
    ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
    ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
    మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
    ‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
    ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”

28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
    వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
    కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
    వాళ్లు ఏమీ చేయలేరు.
    ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.

యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు

42 “నా సేవకుణ్ణి చూడండి!
    నేను అతన్ని బలపరుస్తాను.
    నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
    అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
    జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
అతడు వీధుల్లో కేకలు వేయడు
    అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
    మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
    అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
లోకానికి న్యాయం చేకూర్చేవరకు
    అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”

ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా

యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)

“మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
    నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
    నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
    అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
    అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.

“నేను యెహోవాను.
    నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
    నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
    ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
    అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”

దేవునికొక స్తుతి గీతం

10 యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి.
    భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా,
    సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా,
    మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా,
    దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
    యెహోవాను స్తుతించండి
సెలా నివాసులారా ఆనందంగా పాడండి.
    మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
12 యెహోవాకు మహిమ ఆపాదించండి.
    దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
    ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు.
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు.
    ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.

దేవుడు చాలా ఓర్పుగలవాడు

14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
    నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
    అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
    నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
    ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
    కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
    నా ప్రజలను నేను విడువను.
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
    బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
    కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”

దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది

18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
    గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు[a] ఎక్కువ గుడ్డివాడు.
    నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు.
నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
    కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు.
అతడు తన చెవులతో వినగలడు.
    కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు.
    కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
22 అయితే ప్రజలను చూడండి
    ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు.
యువకులంతా భయపడ్తున్నారు.
    వారు చెరలో బంధించబడ్డారు.
మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు.
    వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు.
ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు.
    “దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు.

23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి. 24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించుకోలేదు. 25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించలేదు.

దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు

43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”

“కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”

“కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి. ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”

10 యెహోవా చెబుతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, నా తర్వాత ఏ దేవుడూ ఉండడు. 11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు. 12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో క్రొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి. 13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”

14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) 15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.”

దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు

16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. 18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.

22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. 24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.

25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. 26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. 27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. 28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International