Chronological
తూరుకు దేవుని సందేశం
23 తూరును గూర్చి విచారకరమైన సందేశం:
తర్షీషు ఓడలారా, మీరు విచారించండి.
మీ ఓడరేవు పాడుచేయబడింది.
(ఈ ఓడల మీద ఉన్న ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూఉండగా వారికి ఈ వార్త చెప్పబడింది).
2 సముద్ర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా ఆగండి, దుఃఖించండి.
తూరు, “సీదోను వ్యాపారి.” సముద్రం పక్కన ఉన్న ఆ పట్టణం సముద్రాల మీదుగా వ్యాపారులను పంపింది,
ఆ మనుష్యులు మిమ్మల్ని ఐశ్వర్యాలతో నింపారు.
3 ఆ మనుష్యులు ధాన్యం కోసం వెదుకుతూ సముద్రాల మీద ప్రయాణం చేశారు.
నైలునది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని,
ఆ ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు.
4 సీదోనూ, నీవు చాలా దుఃఖించాలి.
ఎందుకంటే, ఇప్పుడు సముద్రం, సముద్రపు కోట చెబుతున్నాయి.
నాకు పిల్లలు లేరు.
నాకు ప్రసవవేదన కలగలేదు
నేను పిల్లలను కనలేదు
నేను బాల బాలికలను పెంచలేదు.
5 తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది.
ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది.
6 ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి.
సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి.
7 గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభవించారు. అనాది నుండీ ఆ పట్టణం పెరుగుతూనే ఉంది.
ఆ పట్టణం ప్రజలు జీవనోపాది కోసం దూర దేశాలు తిరిగారు.
8 తూరు పట్టణం చాలామంది నాయకులను తయారు చేసింది.
ఆ పట్టణపు వ్యాపారులు యువరాజుల్లా ఉన్నారు.
క్రయ విక్రయ దారులు ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు.
కనుక తూరుకు వ్యతిరేకంగా పథకాలు వేసింది ఎవరు?
9 సర్వశక్తిమంతుడైన యెహోవాయే.
వాళ్లను ప్రముఖులుగా ఉండకుండా చేయాలని ఆయన నిర్ణయించాడు.
10 తర్షీషు ఓడలారా, మీరు తిరిగి మీ దేశం వెళ్లిపోండి.
సముద్రం ఒక చిన్న నదిలా దాటండి.
మిమ్మల్ని ఇప్పుడు ఆపు చేయడు.
11 యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు.
తూరుకు విరోధంగా యుద్ధం చేసేందుకు యెహోవా రాజ్యాలను సమకూరుస్తున్నాడు.
తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని
యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు.
12 “సీదోను కన్యా[a] నీవు పాడు చేయబడతావు
నీవు ఇంకెంత మాత్రం ఆనందించవు” అని యెహోవా చెబుతున్నాడు.
అయితే తూరు ప్రజలు, “కిత్తీము మాకు సహాయం చేస్తుంది” అంటున్నారు.
కానీ మీరు సముద్రం దాటి కీత్తీము వెళ్తే అక్కడ మీకు విశ్రాంతి స్థలం దొరకదు.
13 అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు.
కానీ కల్దీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు ఒక దేశం కాదు.
బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది.
అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది.
అష్షూరు బబులోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
14 అందుచేత, తర్షీషు ఓడలారా, దుఃఖించండి
మీ క్షేమ స్థానం (తూరు) నాశనం చేయబడుతుంది.
15 ప్రజలు తూరును డెబ్భయి సంవత్సరాలపాటు మరచిపోతారు. (అది ఒక రాజు పరిపాలనా కాలవ్యవధి) డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు ఈ పాటలోని వేశ్యలా ఉంటుంది.
16 ప్రజలు మరచిన ఓ ఆడదానా,
నీ స్వర మండలం తీసుకొని పట్టణంలో నడువు.
నీ పాటను చక్కగా వాయించు నీ పాటను తరచుగా పాడు.
అప్పుడు ప్రజలు నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటారు.
17 డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు విషయం యెహోవా పునః పరిశీలిస్తాడు, ఆయన దానికి తన నిర్ణయం తెలియజేస్తాడు. తూరు మళ్లీ వ్యాపారం చేస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటికీ తూరు ఒక వేశ్యలా ఉంటుంది. 18 కాని తూరు తాను సంపాదించిన ధనం ఉంచుకోదు. తూరు తన వ్యాపారం ద్వారా సంపాదించిన ధనం యెహోవా కోసం దాచబడుతుంది. యెహోవాను సేవించే వారికి ఆ ధనాన్ని తూరు ఇస్తుంది. కనుక యెహోవా సేవకులు తృప్తి పడేంతవరకు భోజనం చేస్తారు, మంచి దుస్తులు ధరిస్తారు.
దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు
24 చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు. 2 ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే. 3 ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది. 4 దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
5 దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు. 6 ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బ్రతుకుతారు.
7 ద్రాక్షవల్లులు చస్తున్నాయి. క్రొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు. 8 ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది. 9 ప్రజలు వారి ద్రాక్షమద్యం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.
10 “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి. 11 ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షమద్యం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది. 12 పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.
13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు.
కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి.
రాజ్యాల మధ్య ఈ దేశానికి కూడ అలానే ఉంటుంది.
14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు
యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి!
దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి!
యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము.
ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
కానీ నేనంటాను: “చాలు,
నాకు సరిపోయింది!
నేను చూస్తున్న సంగతులు భయంకరం.
దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”
17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది.
వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు.
వారు భయపడిపోతారు.
కొంతమంది ప్రజలు పారిపోతారు.
కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు
వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు.
కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.
పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి.
వరదలు మొదలవుతాయి.
భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
19 భూకంపాలు వస్తాయి.
భూమి పగిలి తెరచుకొంటుంది.
20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి.
అందుచేత భూమి ఆ భారం క్రింద పడిపోతుంది.
ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది
త్రాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది.
భూమి ఇక కొనసాగలేదు.
21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు
పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను
యెహోవా తీర్పు తీరుస్తాడు.
22 ఎందరెందరో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు.
కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు.
వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు.
కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు.
పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది.
చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.
దేవునికి స్తుతి గీతం
25 యెహోవా, నీవు నా దేవుడివి
నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను.
అద్భుతమైన కార్యాలు నీవు చేసావు.
చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము.
నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.
2 పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం.
కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే
విదేశీ భవనం నాశనం చేయబడింది.
అది ఎన్నటికీ కట్టబడదు.
3 బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు.
బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.
4 యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు.
అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు.
యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు.
కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది,
కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.
5 శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు.
అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది.
అదే విధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి.
అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.
తన సేవకులకు, దేవుని విందు
6 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.
7 కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది 8 కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.
9 ఆ సమయంలో ప్రజలు అంటారు,
“ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
10 యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది.
మరియు మోయాబు ఓడించబడుతుంది.
యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు.
చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.
11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు
అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమకూరుస్తాడు
వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు.
యెహోవా వాటన్నింటినీ క్రింద పారవేస్తాడు
12 ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నింటిని యెహోవా నాశనం చేస్తాడు.
యెహోవా వాటిని నేల ధూళిలో పార వేస్తాడు.
దేవునికొక స్తుతి గీతం
26 ఆ సమయమందు యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు:
యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది.
మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.
2 తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు.
ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు.
3 యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు
నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
నీయందు విశ్వాసముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
4 కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి.
నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి.
5 అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు.
అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు.
ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు
అది ధూళిలో పడిపోతుంది.
6 అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు.
7 మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం
మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు.
మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి
దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
8 కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం.
నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
9 నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది.
ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది.
దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు
ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే
వాడు మంచి చేయటం నేర్చుకోడు.
చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు.
ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే
వారు దానిని చూస్తారు.
యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు.
అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం.
కనుక మాకు శాంతి ప్రసాదించు.
తన ప్రజలకు దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు
13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం.
మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం
కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి
ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు
నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు.
మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు
ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు
నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు.
నీవు ప్రజలను శిక్షించినప్పుడు
వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.
17 యెహోవా, మేం నీతో లేనప్పుడు
మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం
ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.
18 అదే విధంగా మాకు బాధ ఉంది
మేము కంటాము, కాని, గాలిని మాత్రమే.
ప్రపంచానికి మేం క్రొత్త మనుష్యుల్ని తయారు చేయం.
దేశానికి మేం రక్షణ కలిగించం
19 కాని యెహోవా చెప్పేదేమంటే,
“నీ ప్రజలు మరణించారు
కానీ వారు మళ్లీ లేస్తారు
నా ప్రజల శరీరాలు
మరణం నుండి లేస్తాయి.
భూమిలోని మృతులు లేచి,
సంతోషిస్తారు.
నిన్ను కప్పియున్న మంచు,
ఒక క్రొత్త రోజు వెలుతురులా ఉంది.
ఒక క్రొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది
ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”
తీర్పు: బహుమానం లేక శిక్ష
20 నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి.
తలుపులకు తాళాలు వేసుకోండి.
కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి.
దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.
21 యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు.
ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు.
చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది
భూమి ఇక ఎన్నటికీ చనిపోయిన వాళ్లను కప్పెట్టదు.
27 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును.
యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు,
కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు.
ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు.
2 ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు.
3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను.
సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను.
రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను.
ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు.
4 నేను కోపంగా లేను.
కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే
అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను.
5 అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే,
అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి.
6 ప్రజలు నా దగ్గరకు వస్తారు. మంచి వేరులు గల మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు.
వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు.
అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.”
దేవుడు ఇశ్రాయేలును దూరంగా పంపించివేస్తాడు
7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా?
8 యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి.
9 యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి.
10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి. 11 ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు.
ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.
12 ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు.
మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు. 13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు.
© 1997 Bible League International