Chronological
ఇథియోపియాకు దేవుని సందేశం
18 ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు. 2 ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది.
వేగంగా పోయే సందేశహరులు,
ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు.
(ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం.
వారు బలంగల రాజ్యం.
వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది.
నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
3 వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి.
ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు.
ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు.
ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు.
యుద్ధానికి ముందు ఊదే శంఖంలా
వారు దీనిని తేటగా వింటారు.
4 యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. 5 అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు. 6 కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.”
7 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
ఈజిప్టుకు దేవుని సందేశం
19 చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.
2 దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి. 3 ఈజిప్టు ప్రజలు గందరగోళమవుతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.” 4 సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.”
5 నైలునది ఎండిపోతుంది. 6 నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి. 7 నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.
8 “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది. 9 బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు. 10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
11 “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.” 12 ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.
13 సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు. 14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు. 15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్మలు, కాండాలు.”)[a]
16 ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు. 17 యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి. 18 ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం”[b] అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.
19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.
21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).
23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.
అష్షూరు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తుంది
20 అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని పట్టుకొన్నాడు. 2 ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు. 3 అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టలు లేకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవత్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టు, ఇథియోపియాకు సంకేతం. 4 అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తాడు. అష్షూరు బందీలను పట్టుకొని, వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, యువతీ యువకులు బట్టలు చెప్పులు లేకుండానే తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానించబడతారు. 5 ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”
6 సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. అవి మమ్మల్ని అష్షూరు రాజు నుండి విమోచిస్తాయని మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించుకోగలుగుతాం?” అని అంటారు.
బబులోనుకు దేవుని సందేశం
21 సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం:
అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్నుండి వీచే గాలిలా అది వస్తోంది.
అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.
2 జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను.
దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను.
ప్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను.
ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి.
మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు.
ఆ పట్టణంలో చెడు సంగతులన్నింటినీ నేను అంతం చేస్తాను.
3 ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను.
నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది.
నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి.
నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.
4 నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను.
సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.
5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు:
“బల్ల సిద్ధం చేయండి!
బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!”
కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి,
యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.
6 ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు. 7 కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”
8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు:
“నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను.
ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ
9 అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.”
అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు:
“బబులోను ఓడించబడింది.
బబులోను నేల మట్టంగా కూలిపోయింది.
దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ
నేలకు కొట్టబడ్డాయి, ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”
10 యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”
ఎదోముకు దేవుని సందేశం
11 దూమాను గూర్చిన విచారకరమైన సందేశం:
శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు,
“కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?
కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”
12 కావలివాడు జవాబిచ్చాడు,
“ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది.
నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే
తిరిగి వచ్చి అడుగుము.”
అరేబియాకు దేవుని సందేశం
13 అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం:
దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు
అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.
14 దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు.
ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు
15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి
ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు.
గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి
వారు పారిపోతున్నారు.
కష్టతరమైన యుద్ధంనుండి
వారు పారిపోతున్నారు.
16 ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది. 17 ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బ్రతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.
యెరూషలేముకు దేవుని సందేశం
22 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం:
ప్రజలారా మీకు ఏమయింది?
మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
2 గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
నీ ప్రజలు చంపి వేయబడ్డారు.
కానీ కత్తులతో కాదు.
ప్రజలు మరణించారు
కానీ యుద్ధం చేస్తూ కాదు.
3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు
కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు.
నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు.
కానీ వాళ్లు బంధించబడ్డారు.
4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు!
నన్ను ఏడ్వనివ్వండి.
యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”
5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు. 6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల పొదిని తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు. 7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు. 8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.
9-11 దావీదు పట్టణపు గోడలు బీటలు వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత కాలువ నీళ్లు నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు.
ఇదంతా మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీటన్నింటినీ చాలకాలం క్రిందట చేసిన వానిని (దేవుణ్ణి) మీరు చూడరు. 12 కనుక నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి స్నేహితుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు. 13 అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా అంటున్నారు:
మనం వేడుక చేసుకొందాం పశువుల్ని,
గొర్రెల్ని వధించండి. మీరు భోజనం తిని, ద్రాక్షరసం త్రాగండి
తినండి, త్రాగండి, ఎందుకంటె రేపు మనం చస్తాం.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
షెబ్నాకు దేవుని సందేశం
15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి. 16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.
17-18 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.”
యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు. 19 ఇక్కడి నీ ప్రముఖ పదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖ పదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు. 20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. 21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.
22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు. 23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను. 24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.
25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)
© 1997 Bible League International