Chronological
యోవాషు పరిపాలన ప్రారంభించుట
12 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. 2 యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. 3 కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.
యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట
4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.
6 కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. 7 అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.
8 ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. 9 అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.
10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.
13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.
హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట
17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతికూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.
18 యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.
యోవాషు మరణం
19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. 21 షిమాతు కుమారుడైన యోజాకారు[a], షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు.
దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అమజ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
యెహోయాహాజు తన పరిపాలన ప్రారంభించుట
13 యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అహజ్యా కుమారుడైన యోవాషు యూదా రాజుగా ఉన్న 23వ సంవత్సరమున ఇది జరిగింది. యెహోయాహాజు 17 ఏళ్లపాటు పరిపాలించాడు.
2 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులను చేశాడు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను యెహోయాహాజు అనుసరించాడు. యెహోయాహాజు వీటిని చేయడం మానలేదు. 3 అప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కోపగించెను. సిరియా రాజయిన హజాయేలు, హజాయేలు కుమారుడైన బెన్హదదులకు యెహోవా ఇశ్రాయేలు దేశపు అధికారాన్ని ఇచ్చెను.
ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా దయ
4 తర్వాత యెహోయాహాజు తనకు సహాయం చేయమని యెహోవాను ప్రార్ధించాడు. యెహోవా అతని మొర ఆలకించాడు. ఇశ్రాయేలు కష్టాలను యెహోవా చూశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు వారిని ఎలా కష్టపెట్టెనో కూడా చూశాడు.
5 అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి నుండి విడిపింపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు పూర్వం చేసినట్లుగా, తమ ఇళ్లకు పోయారు.
6 కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలును పాపానికి గురి చేసిన యరొబాము కుటింబీకుల పాపాలను ఆపలేదు. యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. వారు షోమ్రోనులో అషెరా స్తంభాలు ఉంచారు.
7 సిరియా రాజు యెహోయాహాజు యొక్క సైన్యాన్ని ఓడించి సైన్యంలోని చాలామందిని సిరియా రాజు నాశనం చేశాడు. అతను ఏబై మంది గుర్రాల సైనికులను, పదిరథాలను, పదివేలమంది సైనికులను మాత్రమే విడిచిపెట్టాడు. యెహోయాహాజు యొక్క సైనికులు నూర్పిడి సమయాన గాలికి చెదరకొట్టబడే పొట్టువంటి వారైనారు.
8 యెహోయాహాజు చేసిన ఘనకార్యాలన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. 9 యెహోయాహాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలతనిని సమాధి చేశారు. యెహోయాహాజు కుమారుడు యెహోయాషు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
యెహోయాషు ఇశ్రాయేలుని పాలించుట
10 యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోయాషు పరిపాలించిన 37వ సంవత్సరంలో ఇది జరిగింది. యెహోయాషు ఇశ్రాయేలీయులను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 11 యెహోవా తప్పు అని చెప్పిన కార్యాలను యెహోయాషు జరిగించాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు పాపకార్యాలకు గురిచేసిన ఆ చెడు కార్యాలను అతను నివారించలేక పోయాడు. యెహోయాషు ఆ పాపాలు కొనసాగించాడు. 12 యెహోయాషు చేసిన ఆ ఘనకార్యాలు అతను యూదా రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యుద్ధాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. 13 యెహోయాషు మరిణించగా, అతని పూర్వికులతో పాటుగా అతడు సమాధి చేయబడ్డాడు. యరొబాము క్రొత్తగా రాజయ్యాడు. యెహోయాషు సింహాసనం మీద యెరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజులతో పాటు షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు.
యెహోయాషు ఎలీషాని సందర్శించుట
14 ఎలీషా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా ఆ జబ్బుతో మరణించాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, ఎలీషా కోసం విలపించాడు. “నా తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలువారి రథాలకు, గుర్రాలకు ఇది సమయమేనా?”[b] అని అడిగాడు.
15 యెహోయాషుతో, “విల్లు, కొన్ని బాణాలు తీసుకొనుము” అని ఎలీషా చెప్పాడు.
యెహోయాషు ఒక విల్లు, కొన్ని బాణాలు తీసుకున్నాడు. 16 అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో ఇలా చెప్పాడు: “వింటిమీద నీ చేయి వేయుము.” యెహోయాషు వింటిమీద తన చేయి వేశాడు. తర్వాత ఎలీషా రాజు చేతులమీద తన చేతులు ఉంచాడు. 17 “తూర్పు కిటికి తెరువుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు కిటికి తెరిచాడు. తర్వాత, “గురిచూసి బాణం వదులుము” అని ఎలీషా చెప్పాడు.
యెహోయాషు బాణం వదిలాడు. అప్పుడు ఎలీషా, “అది యెహోవా యొక్క విజయాస్త్రం! సిరియా మీద విజయాస్త్రం. నీవు సిరియన్లను అఫెకు అనే చోట ఓడిస్తావు. మరియు వారిని నాశనం చేస్తావు” అని చెప్పాడు.
18 “బాణాలు తీసుకో” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజుతో, “నేల మీద కొట్టుము” అని ఎలీషా చెప్పాడు.
మూడుసార్లు యెహోయాషు నేలను కొట్టాడు. తర్వాత ఆపివేశాడు. 19 దైవజనుడు అయిన ఎలీషా యెహోయాషుపై కోపగించాడు. “నీవు ఐదు లేక ఆరుసార్లు కొట్టి వుండవలసింది. అప్పుడు నీవు సిరియాను నాశనమయ్యేంత వరకు ఓడించేవాడివి. కాని ఇప్పుడు నీవు సిరియాని మూడు సార్లు మాత్రమే ఓడించగలవు” అని ఎలీషా చెప్పాడు.
ఎలీషా సమాధిలో ఆశ్చర్యకరమైన విషయం
20 ఎలీషా మరణించగా, ప్రజలతనిని సమాధి చేశారు.
వసంత ఋతువులో ఒకసారి, మోయాబు సైనిక బృందం ఇశ్రాయేలుకు వచ్చింది. యుద్ధంలోని వస్తువులను తీసుకోడానికి వారు వచ్చారు. 21 కొందరు ఇశ్రాయేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు వారు ఆ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసరివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల మీద నిలబడగలిగాడు!
యెహోయాషు ఇశ్రాయేలు నగరాలను జయించుట
22 యెహోయాషు పరిపాలించిన ఆ రోజులలో, సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలుకు ఇబ్బంది కలిగించాడు. 23 కాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఒడంబడిక వల్ల, యెహోవా ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని విసర్జించడు.
24 సిరియా రాజయిన హజాయేలు మరణించాడు. అతని తర్వాత అతని కుమారుడు బెన్హదదు క్రొత్త రాజయ్యాడు. 25 అతను మరణించడానికి పూర్వం, యుద్ధంలో హజాయేలు కొన్ని నగరాలను యెహోయాషు తండ్రి అయిన యెహోయాహాజు నుండి తీసుకొనెను. కాని ఇప్పుడు యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు నుండి యీ నగరాలు మరల పొందెను. యెహోయాషు, బెన్హదదును మూడుసార్లు ఓడించి, ఇశ్రాయేలు నగరాలను మరల తీసుకున్నాడు.
యోవాషు ఆలయాన్ని పునరుద్ధరించుట
24 యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు. 2 యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు. 3 యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు.
4 కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరించాలని యోవాషు నిర్ణయించాడు. 5 యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు.
6 ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు.
7 గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.
8 రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు. 9 పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం. 10 పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు. 11 తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు. 12 తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు.
13 పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు. 14 పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బ్రతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు.
15 యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు. 16 దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజలతనిని అక్కడ సమాధి చేశారు.
17 యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు. 18 రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు. 19 వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.
20 దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెబుతున్నాడు. ‘ప్రజలారా, యెహోవా ఆజ్ఞలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలివేస్తున్నాడు!’”
21 కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు. 22 రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.
23 సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. 24 అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు. 25 అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు.
26 జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ. 27 యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.
© 1997 Bible League International