Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 12-14

అంతర్యుద్ధం

12 1-2 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారిపోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సొలొమోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీము కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి వచ్చాడు. రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకులతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు.

రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు. ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.

దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెబుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.

సొలొమోను జీవించి వున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.

పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”

కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను సలహా అడిగాడు. “నా తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.

10 రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది. 11 నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.

12 రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు. 13 అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు. 14 తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు. 15 కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.

16 ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు:

“మనం దావీదు వంశానికి చెందినవారమా?
    కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా?
రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి,
    దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!”

తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు. 17 అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.

18 కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు. 19 అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.

20 యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశారు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.

21 రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక. 22 కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు: 23 “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు. 24 మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.

25 యరొబాము తరువాత షెకెమును చాలా బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయీము కొండలలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ మంచి పటిష్ఠమైన నగరంగా చేశాడు.

26-27 యరొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాలయానికి యథాప్రకారంగా వెళుతూ వుంటే, వారు దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. యూదా రాజైన రెహబామునే వారు మళ్లీ అనుసరించవచ్చు. ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు.” 28 అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహామేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు. 29 అలా అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర మందును ప్రతిష్ఠించాడు. 30 కాని ఇది ఘోరమైన పాపం. ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప్రయాణమై కోడెదూడల విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టారు.

31 గుట్టల మీద, కొండల మీద యరొబాము ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయులనుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక చేయలేదు). 32 రాజైన యరొబాము ఒక కొత్త పండుగరోజు ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. (ఒకటవ నెల పదిహేనవ రోజున కాదు). యూదాలో బేతేలు నగరంలో వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్పించాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మలకు రాజు బలులు అర్పించేవాడు. తను ఏర్పాటు చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజైన యరొబాము యాజకులను బేతేలు నుండి కూడ తీసుకున్నాడు. 33 కావున రాజైన యరొబాము ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. ఆ సమయంలో అతను నిర్మించిన బలిపీఠాల వద్ద అతడు బలులు సమర్పించి, ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు నగరంలో నిర్వహించేవాడు.

దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట

13 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు. ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను ఇలా చెప్పాడు:

“బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”

ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.

బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు. అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు. అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు.

తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.

అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.

అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, త్రాగను. ఏదీ తినకూడదని త్రాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు. 10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.

11 ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు. 12 అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు. 13 వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.

14 ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు.

“అవును నేనే” అన్నాడు దైవజనుడు.

15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.

16 కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను. 17 ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’”

18 “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.

19 ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు. 20 వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు. 21 ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు. 22 ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, త్రాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”

23 దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు. 24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి. 25 కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.

26 ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు. 27 “తన గాడిదపై గంతవేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన కుమారులు గాడిదపై గంతవేశారు. 28 వృద్ధ ప్రవక్త దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను గాయపర్చటం గాని చేయలేదు.

29 వృద్ధ ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవజనుని మృతికి సంతాపం తెలియజేయటానికి శవాన్ని ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు. 30 శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ఆ ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు. 31 వృద్ధ ప్రవక్త దైవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమారులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పడు నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను అతని అస్థికల పక్కనే ఉంచండి. 32 యెహోవా అతని ద్వారా చెప్పిన మాటలు నిజమయి తీరుతాయి. యెహోవా బేతేలులోని బలిపీఠానికి, సమరియ పట్టణాలలోని ఉన్నత స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించుకున్నాడు.”

33 రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా[a] ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది. 34 ఇది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం కావటానికి ప్రధాన కారాణమయ్యింది.

యరొబాము కుమారుని మరణం

14 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు. ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”

అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది. కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది.

ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు. కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది. 10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”

12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. 14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. 15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు. 16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”

17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.

19 రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి. 20 యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.

యూదా రాజుగా రెహబాము

21 యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.

22 యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు. 23 ఆ ప్రజలు ఉన్నత స్థలాలను,[b] స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు. 24 దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు[c] అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.

25 రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు. 26 షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు. 27 అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు. 28 రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.

29 రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి. 30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.

31 రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International