Beginning
యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు
42 “నా సేవకుణ్ణి చూడండి!
నేను అతన్ని బలపరుస్తాను.
నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
2 అతడు వీధుల్లో కేకలు వేయడు
అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
3 అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు
అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”
ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా
5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.
8 “నేను యెహోవాను.
నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”
దేవునికొక స్తుతి గీతం
10 యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి.
భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా,
సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా,
మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా,
దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు
యెహోవాను స్తుతించండి
సెలా నివాసులారా ఆనందంగా పాడండి.
మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
12 యెహోవాకు మహిమ ఆపాదించండి.
దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు.
ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు.
ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు.
ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.
దేవుడు చాలా ఓర్పుగలవాడు
14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
నా ప్రజలను నేను విడువను.
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”
దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది
18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు[a] ఎక్కువ గుడ్డివాడు.
నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు.
నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు.
అతడు తన చెవులతో వినగలడు.
కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు.
కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
22 అయితే ప్రజలను చూడండి
ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు.
యువకులంతా భయపడ్తున్నారు.
వారు చెరలో బంధించబడ్డారు.
మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు.
వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు.
ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు.
“దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు.
23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి. 24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించుకోలేదు. 25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించలేదు.
దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు
43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. 2 నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 3 ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. 4 నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”
5 “కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. 6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. 7 నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”
8 “కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి. 9 ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”
10 యెహోవా చెబుతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, నా తర్వాత ఏ దేవుడూ ఉండడు. 11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు. 12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో క్రొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి. 13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”
14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) 15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.”
దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు
16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. 18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. 24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.
25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. 26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. 27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. 28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.
యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు
44 “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు చేసుకొన్నాను. నేను చెప్పే సంగతులు విను. 2 నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ[b] నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.
3 “దాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది. 4 వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుతారు. నీటి కాలువల పక్కగా పెరిగే చెట్లలా ఉంటారు వారు.
5 “ఒక వ్యక్తి అంటాడు, ‘నేను యెహోవాకు చెందినవాడను’ అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి ‘నేను యెహోవావాడను,’ అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”
6 యెహోవా ఇశ్రాయేలీయుల రాజు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు: “నేను ఒక్కడను మాత్రమే దేవుణ్ణి. ఇంక ఏ దేవుళ్లూ లేరు. నేనే ఆది, అంతము. 7 నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, తాను నావలె ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి.
8 “భయపడవద్దు! దిగులుపడవద్దు! ఏమి జరుగుతుందో అది నేను నీతో ఎల్లప్పుడూ చెప్పలేదా? మీరే నాకు సాక్షులు. నాతోపాటు ఇంకొక దేవుడున్నాడా? ఏ దేవుడూ లేడు. నేను ఒక్కడను మాత్రమే. ఇంకొక దేవుడున్నట్టు నాకు తెలియదు.”
అబద్ధపు దేవుళ్ళు నిష్ప్రయోజనం
9 కొంత మంది మనుష్యులు విగ్రహాలు (అబద్ధపు దేవుళ్ళు) చేసుకొంటారు. కానీ అవి నిష్ప్రయోజనం. ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు. కానీ ఆ విగ్రహాలు నిష్ప్రయోజనం. ఆ మనుష్యులే ఆ విగ్రహాలకు సాక్షులు, కానీ అవి మాట్లాడవు. వారికి ఏమీ తెలియదు. వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం కూడా వారికి తెలియదు.
10 ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పనికిమాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు? 11 చేతి పనివారు ఆ దేవుళ్లను చేశారు. ఆ పనివాళ్లంతా మనుష్యులే, దేవుళ్లు కారు. ఆ మనుష్యులంతా కలిసి వచ్చి, ఈ విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గుపడతారు, భయపడతారు.
12 ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడిచేయటానికి తన పనిముట్లు వాడతాడు. లోహాన్ని కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం అవుతాడు.
13 మరో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయోగిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది ఏమీ లేదు.
14 ఒకడు దేవదారు, సరళ లేక సింధూర వృక్షాన్ని సరికివేయవచ్చును. (ఆ చెట్లు పెరిగేటట్టు అతడేంచేయలేదు. ఆ చెట్లు అడవిలో వాటి స్వంత శక్తి మూలంగా పెరిగాయి. ఒకడు ఒక తమాల వృక్షాన్ని నాటితే వర్షం దాన్ని పెంచుతుంది.)
15 అప్పుడు అతడు మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కలుగా నరుకుతాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు అతడు ఆ కట్టెలను వాడుకొంటాడు. కొన్ని కట్టెలతో అతడు మంట చేసి, రొట్టె కాల్చుకొంటాడు. అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగపడతాడు. 16 ఆ మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు ఆ కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు. 17 అయితే కొంచెం కట్టె మిగిలింది. కనుక అతడు ఆ కట్టెతో ఒక విగ్రహం చేసి, దాన్ని తన దేవుడు అని పిలుస్తాడు. ఈ దేవుని ముందు అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు ఆ దేవుని ప్రార్థించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు” అంటాడు.
18 ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. అది వారు గ్రహించరు. అది వారి కళ్లు మూసుకొనిపోయి, వారు చూడలేనట్టు ఉంటుంది. వారి హృదయాలు (మనసులు) అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించవు. 19 ఆ మనుష్యులు ఈ విషయాలను గూర్చి ఆలోచించలేదు. ఆ మనుష్యులు గ్రహించరు గనుక, “సగం కట్టెలు నేనే కాల్చేశాను, నా రొట్టె కాల్చుకొనేందుకు, నా మాంసం వండుకొనేందుకు ఆ నిప్పులు నేను వాడుకొన్నాను. ఆ మాంసం నేను తిన్నాను. మరి మిగిలిన కట్టెను ఉపయోగించి ఈ భయంకరమైన పని చేశాను. నేను ఒక చెక్క ముక్కనే పూజిస్తున్నాను” అని వారి మట్టుకు వారు ఎన్నడూ తలంచలేదు.
20 ఆ మనిషి ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అతడు గందరగోళం అయ్యాడు, కనుక అతని హృదయం అతన్ని తప్పు మార్గంలో నడిపించింది. అతడు తనను తాను రక్షించుకోలేడు. అతడు చేస్తున్నది తప్పు అని అతడు చూడలేడు. “నేను పట్టుకొన్న ఈ విగ్రహం అబద్ధపు దేవుడు” అని అతడు చెప్పడు.
నిజమైన దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు సహాయం చేస్తాడు
21 “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో.
ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో.
నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు.
కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు.
22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి.
కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను.
గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా
నీ పాపాలు పోయాయి.
నేను నిన్ను తప్పించి కాపాడాను,
కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”
23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి.
భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది.
పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి.
అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి.
ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక.
ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.
24 నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా చేశాడు.
నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా దీనిని చేశాడు.
“యెహోవాను, నేనే సమస్తం చేశాను.
ఆకాశాలను నేనే అక్కడ ఉంచాను.
నేనే భూమిని నా యెదుట పరచాను.” అని యెహోవా చెబుతున్నాడు.
25 అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు. 26 ప్రజలకు సందేశాలు అందించేందుకు యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందేశాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయాల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది అని యెహోవా సూచిస్తున్నాడు.
యూదాను పునర్మించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు
“ప్రజలు మరల నీలో నివసిస్తారు” అని యెరూషలేముతో యెహోవా చెబుతున్నాడు.
“మీరు మరల నిర్మించబడతారు” అని యూదా పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు.
“నేను మరల మిమ్మల్ని పట్టణాలుగా చేస్తాను” అని నాశనం చేయబడిన పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు.
27 “ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను”
అని లోత్తెన జలాలతో యెహోవా చెబుతున్నాడు.
28 యెహోవా కోరేషుతో[c] చెబుతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి.
నేను కోరిన వాటిని నీవు చేస్తావు.
‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబుతావు.
‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి’” అని నీవు ఆలయంతో చెబుతావు.
© 1997 Bible League International