Beginning
ఫిలిష్తీయుల యుద్ధ సన్నాహం
28 తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.
2 “ఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు.
“చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు.
సౌలు మరియు ఏన్దోరు మంత్రగత్తె
3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు.
అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని[a] చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.
4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు. 5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. 6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము[b] ప్రయోగించ లేదు. 7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతుందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు.
“ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.
8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.
10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది.
“సమూయేలును” అన్నాడు సౌలు.
12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.
13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో.
“భూమిలో నుండి[c] ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.
14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు.
“అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది.
అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు. 15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో.
సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.
16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు? 17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు! 18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు. 19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.
20 సౌలు వెంటనే నేల మీదికి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు. సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.
21 ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి, అతను నిజంగానే చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలినయ్యాను. నేను నా ప్రాణానికి తెగిచిం నీవు చెప్పినట్లు చేసాను. 22 దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది” అని ఆమె చెప్పింది.
23 కానీ సౌలు తిరస్కరించాడు. “నేనేమి తినను” అన్నాడు.
సౌలు అధికార్లు ఆమెతో కలిసి సౌలును తినమని బ్రతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు. 24 ఆ స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే ఆమె ఆ దూడను చంపింది: కొంత పిండి తీసి, స్వయంగా కలిపి, దానిని పులియగపెట్టకుండా రొట్టెకాల్చింది. 25 ఆ ఆహారాన్ని సౌలు ముందు, అతని అధికార్ల ముందు ఆమె పెట్టింది. సౌలు, అతని అధికార్లు భోజనం చేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి వెళ్లిపోయారు.
దావీదు మనతో రావద్దు
29 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు. 2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.
3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు.
అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.
4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు. 5 ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ
‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు,
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’
అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.
6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు[d] కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు. 7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.
8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.
9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు. 10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.
11 అందుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.
అమాలేకీయులు సిక్లగును పట్టుకొనుట
30 దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు. 2 సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.
3 దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు. 4 దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు. 5 దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.
6 సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమార్తెలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు. 7 యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.
8 అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?”
అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారిని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.
దావీదు ఈజిప్టు బానిసను చూచుట
9-10 దావీదు తన ఆరువందల మంది మనుష్యులను తనతో బెసోరు సెలయేటి వద్దకు తీసుకుని వెళ్లాడు. కొంతమంది ఆ సెలయేటి వద్ద ఉండిపోయారు. అక్కడ నిలబడిపోయిన చాలా మంది అలసిపోయి ముందుకు వెళ్లలేనంత బలహీనంగా ఉన్నందువల్ల అక్కడే ఉండిపోయారు. కనుక దావీదు, మరో 400 మంది కలిసి, అమాలేకీయులను తరుముట కొనసాగించారు.
11 ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు. 12 అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.
13 “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు.
అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు. 14 కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.
15 “అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు.
“నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.
అమాలేకీయులను దావీదు ఓడించుట
16 ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపుకుంటున్నారు. 17 దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.
18 దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు. 19 ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్నదంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు. 20 గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.
కొల్లసొమ్మును దావీదు అందరికీ సమంగా పంచుట
21 అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు. 22 అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.
23 అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు. 24 మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందరు సమంగానే పంచుకోవాలి” అన్నాడు. 25 దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.
26 దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.
27 అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు, 28 అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో, 29 రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు 30 కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు 31 మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.
సౌలు మరణం
31 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు. 2 ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.
3 సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరం తూట్లు పడిపోయింది. 4 సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు.
5 అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు. 6 కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిపోయారు.
సౌలు మరణం గూర్చి ఫిలిష్తీయుల ఆనందం
7 లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.
8 ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు. 9 ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు. 10 వారు సౌలు కవచాన్ని అష్తారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు.
11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చి యాబేష్గిలాదు నివాసులు విన్నారు. 12 కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు. 13 తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.[e]
© 1997 Bible League International