Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 1-3

అహజ్యాకు సందేశం

అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.

ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.

కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకులను అడగటానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము. మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బయల్జెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.

దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.

దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్లు చేయడంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తావనియు యెహోవా చెప్పాడు!’”

“మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.

“ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు.

తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే అది” అని అన్నాడు.

అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము చేయుట

అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు.

10 ఏలీయా ఏభైమంది మనుష్యులను, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు.

అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.

11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ, క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.

12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు.

అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.

13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక! 14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”

15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు.

అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.

16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.

యెహోరాము అహజ్యా అంతఃపురాన్ని స్వాధీనం చేసుకొనుట

17 ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు.

18 అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

ఏలీయాని తీసికొని వెళ్ళటానికి యెహోవా నడిపించుట

సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.

ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు.

కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు.

బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”

“అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.

ఎలీషాతో ఏలీయా, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అని చెప్పాడు.

కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. అందువల్ల వారిరువురు మనష్యులు యెరికోకు వెళ్లారు.

యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”

ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అని చెప్పాడు.

ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు.

ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు.

ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.

వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు.

“నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు.

10 ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.

దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట

11 ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు.

12 అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు నీవె”[a] అని అరిచాడు.

ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. 13 ఏలీయా ధరించు కంబళి భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. 14 ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.

ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట

15 యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు. 16 అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి నీ యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండమీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.”

కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపవద్దు” అని చెప్పాడు.

17 ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు.

ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు. కాని వారు ఏలీయాను కనుగొనలేక పోయారు. 18 కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను గదా” అన్నాడు.

ఎలీషా నీటిని మంచి నీళ్లుగా చేయుట

19 ఆ నగర పౌరులు ఎలీషాతో, “అయ్యా, ఈ నగరం చక్కని ప్రదేశంలో వున్నట్టు మీరు చూస్తున్నారు. కాని నీళ్లు మంచివి కావు. అందువల్లనే ఈ ప్రదేశంలో పంటలు పండవు” అని చెప్పారు.

20 “ఒక కొత్త పాత్ర తీసుకురండి. అందులో ఉప్పు వేయండి” అని ఎలీషా చెప్పాడు.

పౌరులు పాత్రను ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. 21 తర్వాత భూమినుండి నీరు ప్రవహించే ఆ స్థలం వద్దకు ఎలీషా వెళ్లాడు. ఎలీషా ఆ ఉప్పును నీటిలోకి విసిరాడు. “నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని, ఇప్పటినుండి ఈ నీరు మరణము కలిగించదు. పంటలు పండనట్లుగా చేయదు” అని యెహోవా చెప్పాడు.

22 ఆ నీరు శుద్ధమయ్యింది. ఆ జలము నేటికీ మంచి నీరుగా ఉంది ఎలీషా చెప్పినట్లుగానే అది జరిగెను.

ఎలీషాని కొందరు పిల్లలు ఎగతాళి చేయుట

23 ఎలీషా ఆ నగరం నుండి బేతేలుకు వెళ్లాడు. ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. నగరం నుండి కొందరు పిల్లలు బయటకి వస్తున్నారు. ఎలీషాని చూచి, వారు ఎగతాళి చేశారు. అతనితో వారు ఇట్లు అన్నారు: “ఓ బట్టతల మనిషీ, పైకి వెళ్లుము.”

24 ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తర్వాత అడవినుండి రెండు ఎలుగు బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి.

25 ఎలీషా బేతేలు వీడి కర్మెలు పర్వతం వద్దకు వెళ్లాడు. మరియు అక్కడ నుండి, ఎలీషా షోమ్రోనుకు మరలి వెళ్లాడు.

ఇశ్రాయేలుకి యెహోరాము రాజవుట

అహాబు కుమారుడైన యెహోరాము షోమ్రోనులో ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోషాపాతు 18 వ పరిపాలనా సంవత్సరమున అతను పాలించడానికి మొదలు పెట్టాడు. యెహోరాము 12 సంవత్సరములు పరిపాలించాడు. యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోరాము చేశాడు. కాని యెహోరాము తన తల్లిదండ్రులవంటి వాడు కాడు. బయలు దేవతను పూజించేందుకు తన తండ్రి నిర్మించిన స్తంభాన్ని అతడు తొలగించాడు. కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను అతడు చేశాడు. యరొబాము ఇశ్రాయేలువారిని పాపములు చేసేటట్లు చేశాడు. యెహోరాము యరొబాము చేసిన పాపాలను అనుసరించాడు.

ఇశ్రాయేలు నుండి మోయాబు వేరు పడుట

మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేకలుండెను. మేషా 1,00,000 గొర్రెల ఉన్నిని 1,00,000 గొర్రె పొట్టేలుల ఉన్నిని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు. కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజ్యపరిపాలనకు తిరుగుబాటు చేశాడు.

తర్వాత యెహోరాము రాజు షోమ్రోను నుండి వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీకరించాడు. యెహోరాము యూదారాజైన యెహోషాపాతు వద్దకు దూతలను పంపాడు. యెహోరాము ఇట్లన్నాడు: “మోయాబు రాజు, నా పరిపాలనపై తిరుగబడ్డాడు. మోయాబుతో యుద్ధము చేయడానికి నీవు నాతో కలసెదవా?”

యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తాను. మనమిద్దరము ఒక సైన్యమవుదాము. నా ప్రజలు నీ ప్రజలవలె వుంటారు. నా గుర్రములు నీ గుర్రములవలె వుంటాయి.” అని చెప్పాడు.

ఆ ముగ్గురు రాజులు ఎలీషా సలహా కోరుట

యెహోషాపాతు యెహోరాముతో, “మనము ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు.

“మనము ఎదోము ఎడారిద్వారా వెళ్లాలి” అని యెహోరాము సమాధానమిచ్చాడు.

అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము రాజులతో కలిసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు ప్రయాణం చేశారు. తమ సైన్యనానికి గానీ, జంతువులకు గానీ తగినంత నీరు దొరకలేదు. 10 చివరికి ఇశ్రాయేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, “యెహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.”

11 కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా యొక్క ఒక ప్రవక్త అక్కడే వున్నాడు. మనమేమి చేయవలెనో యెహోవాని అడగమని మనము ఆ ప్రవక్తను అడుగుదాము” అనిచెప్పాడు.

ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఎలీయా యొక్క సేవకుడు” అనిచెప్పాడు.

12 “యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని యెహోషాపాతు పలికాడు.

అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని దర్శించటానికి వెళ్లారు.

13 ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు.

ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు.

14 “నేను యూదా రాజయిన యెహోషాపాతును గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవాను నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యెహోషాపాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని. 15 కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు.

ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది. 16 అప్పుడు ఎలీషా, “యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు చేయండి. 17 యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది. 18 ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు. 19 నీవు ప్రతి దృఢమైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” అని పలికాడు.

20 ఉదయాన దేవునికి బలి జరిగే సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవహించడం ప్రారంభమయ్యింది. లోయ నిండింది.

21 మోయాబు లోని ప్రజలు తమతో యుద్ధం చేయడానికి గాను రాజులు వచ్చిన విషయము విన్నారు. కవచములు ధరించడానికి మనుష్యులందరు ఒక్కటిగా వయసు మళ్లిన వారైయున్నారు. వారు సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. 22 ఆ రోజు ఉదయం వారు పెందలకడనే మేల్కోన్నారు. లోయలోని నీళ్లలో ప్రభాత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మోయాబు ప్రజలకు నెత్తురువలె కనిపించింది. 23 “నెత్తురు చూడుడి! రాజులు తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీరముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు గాను మనము వెళ్దాము” అని మోయాబు ప్రజలు చెప్పుకున్నారు.

24 మోయాబు ప్రజలు ఇశ్రాయేలు గుడారము వద్దకు వచ్చారు. కాని ఇశ్రాయేలు వారు వెలుపలికి వచ్చి మోయాబు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు ప్రజల నుండి మోయాబు ప్రజలు పారిపోయారు. ఇశ్రాయేలు వారు మోయాబు దాకా పరుగెత్తుకు పోయి మోయాబు ప్రజలతో యుద్ధం చేశారు. 25 ఇశ్రాయేలు వారు నగరములను ధ్వంసం చేశారు. వారు మోయాబులోని ప్రతి మంచి పట్టణము మీదికి రాళ్లు విసిరివేశారు. నీటి బావులన్నిటినీ పూడ్చి వేసినారు. అన్ని ఊటలను ఆపి వేశారు. అన్ని మంచి చెట్లను నరికివేశారు. కీర్హరెశెతు వరకు వారు యుద్ధం చేస్తూ వెళ్లారు. ఇశ్రాయేలు సైనికులు కీర్హరెశెతు చుట్టు ముట్టి, దాని మీద దాడిచేశారు.

26 మోయాబు రాజు ఆ యుద్ధము తనకు కష్టమైనదిగా చూశాడు. అందువల్ల ఖడ్గములు ధరించిన ఏడువందల మంది మనుష్యుల్ని తీసుకొని సైన్యాన్ని ఛేదించడానికి, ఎదోము రాజుని హతమార్చడానికిగాను వెళ్లాడు. కాని వారు ఎదోము రాజుని ఎదుర్కొనలేక పోయారు. 27 తర్వాత మోయాబు రాజు తన పెద్దకొడుకుని వెంట తీసుకొనిపోయాడు. తన అనంతరము రాజు కావలసిన కుమారుడు అతడే. తన కుమారుని ప్రాకారము మీద దహన బలిగా అర్పించాడు. ఇది చూచిన ఇశ్రాయేలీయులు తల క్రిందులయ్యారు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుని విడిచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International