Beginning
అదోనీయా రాజుగా ప్రకటించుకొనుట
1 దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు. 2 కావున అతని సేవకులు అతనితో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్తాము. ఆమె నీ పక్కలో పడుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు. 3 అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు. 4 ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.
5-6 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
7 సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు. 8 కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
9 అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు. 10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
నాతాను బత్షెబాకు సలహా ఇచ్చుట
11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు. 12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెబుతాను. 13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు. 14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెబుతాను.”
15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది. 16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.
17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహాసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు. 18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు. 19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు. 20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు. 21 నీ మరణానంతరం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”
22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు. 23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. 24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా? 25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులనందరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు. 26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు. 27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూ నీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”
28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: 30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
దావీదు సొలొమోనును రాజుగా చేయటం
32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. 33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ[a] దగ్గరకు తీసుకొని వెళ్లండి. 34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి. 35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక! 37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయపడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
38 కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు. 39 యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు. 40 ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు.
41 ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
42 యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు[b] నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
43 కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు. 44 రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు. 45 తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు. 46 సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. 47 రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు. 48 ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. 50 అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను[c] పట్టుకున్నాడు. 51 ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
52 అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు. 53 అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
దావీదు మరణించుట
2 దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు: 2 “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో. 3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పినవన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది. 4 నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’”
5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి. 6 కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
7 “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసి షిమీని నేను చంపనని చెప్పాను. 9 కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు. 11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
సొలొమోను, అదోనియ
12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు.[d]
13 ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు.
“నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది.
“అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం. 14 నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు.
“అయితే మాట్లాడు” అన్నది బత్షెబ.
15 అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు. 16 కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.”
“నీకేం కావాలి?” అని బత్షెబ అడిగింది.
17 “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు.
18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడతాను” అని బత్షెబ అన్నది.
19 కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి ప్రక్కగా కూర్చున్నది.
20 “నిన్నొక చిన్న విషయం అడగాలని వచ్చాను. దయచేసి తిరస్కరించవద్దు” అని బత్షెబ అతనితో అన్నది.
“నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! నేనెప్పుడూ తిరస్కరించను” అని రాజు అన్నాడు.
21 “అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోదరుడైన అదోనీయా వివాహమాడుటకు అనుమతి ఇవ్వు” అని బత్షెబ అన్నది.
22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
23 అప్పుడు సొలొమోను యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయా నన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను! ఇది వాని ప్రాణానికే ముప్పు తెస్తుందని ప్రమాణ వూర్వకంగా చెబుతున్నాను! 24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను!”
25 రాజైన సొలొమోను బెనాయాను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీయాను చంపేశాడు.
26 రాజైన సొలొమోను యాజకుడగు అబ్యాతారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని, కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు నీవు యెహోవా పవిత్ర పెట్టె మోయుటలో సహాయ పడ్డావు. పైగా నీవు నా తండ్రి కష్ట సమయాలలో నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు తెలుసు.” 27 అయితే ఇక నుంచి యెహోవా యాజకునిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సొలొమోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది.
28 యోవాబు జరిగినదంతా విని భయపడి పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు గాని, అబ్షాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నాడు. 29 యోవాబు దేవుని గుడారంలో బలి పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజైన సొలొమోనుకు చెప్పారు. సొలొమోను బెనాయాను పిలచి యోవాబును చంపమన్నాడు.
30 బెనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవాబుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని” చెప్పాడు.
“వద్దు, నేనిక్కడే చనిపోతాను” అని యోవాబు అన్నాడు.
కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న మాటలు రాజుకు చెప్పాడు. 31 “అయితే అతను చెప్పినట్లే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా యోవాబు అమాయకులను చంపాడు. 32 తనకంటె చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. వారిద్దరు నేరు కుమారుడైన అబ్నేరు, మరియు యెతెరు కుమారుడైన అమాశా. అబ్నేరు ఇశ్రాయేలు సైన్యాధిపతి. అమాశా యూదావారి సైన్యాధిపతి. అతడు వారిని చంపినట్లు నా తండ్రి దావీదుకు తెలియదు. కావున యెహోవా అతనికి తగిన శాస్తి చేస్తాడు. 33 వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సంతతివారికి, అతని కుటుంబానికి, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.”
34 కావున యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు. 35 తరువాత యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను సైన్యాధ్యక్షునిగా సొలొమోను నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో సాదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా నియమించాడు. 36 తరువాత, షిమీని రాజు పిలిచాడు. రాజు షిమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, నగరం వదిలి వెళ్లవద్దు. 37 నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు నీవే బాధ్యుడవు” అని అన్నాడు.
38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివసించాడు. 39 కాని మూడు సంవత్సరాల తరువాత షిమీ యొక్క ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్లు షిమీ విన్నాడు. 40 తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలను వెదుక్కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు.
41 కాని ఎవ్వరో సొలొమోను వద్దకు వెళ్లి షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.
42 అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికైనా వెళ్లితే తత్ఫలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడవవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై వుంటానని నీవు అన్నావు. 43 మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకోలేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు? 44 నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు. 45 కాని యెహోవానన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు.”
46 పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
© 1997 Bible League International