Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 140

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

కీర్తనలు. 142

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

కీర్తనలు. 141

దావీదు స్తుతి కీర్తన.

141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
    త్వరపడి నాకు సహాయం చేయుము.
యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
    నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.

యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
    చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
    చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
    అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
    అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.

మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
    అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
    ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
    ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.

కీర్తనలు. 143

దావీదు స్తుతి కీర్తన.

143 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
    నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
    నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
    వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
    నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
    నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
    నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
    యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
    నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
    సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
    నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
    నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
    నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
    నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.

2 రాజులు 23:36-24:17

36 యెహోయాకీము రాజగునాటికి, అతను 25 యేండ్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమాకి చెందిన పెదాయా కుమార్తె. 37 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహోయాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన పనులే యెహోయాకీము చేశాడు.

నెబుకద్నెజరు రాజు యూదాకు వచ్చుట

24 యెహోయాకీము కాలంలో బబులోను రాజయిన నెబుకద్నెజరు యూదా దేశానికి వచ్చాడు. యెహోయాకీము నెబుకద్నెజరుని మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము నెబుకద్నెజరుకు ప్రతికూలుడై అతని పరిపాలన నుండి విముక్తుడయ్యాడు. యెహోవా బబులోనువారి బృందాలు, సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలైన వారిని యెహోయాకీముకి విరుద్ధంగా యుద్ధము చేయునట్లు చేశాడు. యెహోవా ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపించాడు. ఇది యెహోవా చెప్పినట్లుగానే జరిగింది. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను అవి చెప్పడానికి ఉపయోగించాడు.

యూదాలో అవి జరుగేటట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యెహోవా వారిని తన దృష్టినుండి మరల్చాడు. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణాన యెహోవా ఇలా చేశాడు. మనష్షే పలువురు అమాయకులను చంపినందువల్ల, యెహోవా ఇదంతా చేశాడు. మనష్షే యెరూషలేమును వారి రక్తముతో నింపివేశాడు. మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు.

యెహోయాకీము చేసిన ఇతర కార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. యెహోయాకీము మరణించగా, అతని పూర్వికులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.

బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.

నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట

యెహోయాకీను, పరిపాలన ప్రారంభించిన నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలేములో 3 మాసాలు పరపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కుమార్తె. యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన అవే పనులు చేసాడు.

10 ఆ సమయమున బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క అధికారులు యెరూషలేముకు వచ్చి ముట్టిడించారు. 11 తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు నగరానికి వచ్చాడు. అతని సైన్యము అప్పటికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది. 12 యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.

13 నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.

14 నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతులను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలో చెయ్యి తిరిగినవారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని విడిచి పెట్టలేదు. 15 నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు. 16 7,000 మంది సైనికులుండిరి. నెబుకద్నెజరు సైనికులందరినీ, 1,000 మంది పనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు వెళ్లాడు. ఈ వ్యక్తులందరు యుద్ధానికి సిద్ధంగా వుండే సుశిక్షుతులైన సైనికులు. బబులోను రాజు వారినందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్లాడు.

సిద్కియా రాజు

17 బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన తండ్రి. అతను అతని పేరుని సిద్కియా అని మార్చి వేశాడు.

1 కొరింథీయులకు 12:12-26

ఒకే శరీరం, అనేక అవయవాలు

12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.

14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.

21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.

మత్తయి 9:27-34

ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం

27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.

28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.

32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.

34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International