Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 93

93 యెహోవాయే రాజు!
    ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
    ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
    కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
    నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

కీర్తనలు. 96

96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
    సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
    శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
    దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
    ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
    కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
    దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
    స్తుతి కీర్తనలు పాడండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
    యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10     యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
    యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
    సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
    అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
    ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

2 రాజులు 4:8-37

షూనేములోని ఒక స్త్రీ ఎలీషాకి గది ఇచ్చుట

ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు.

ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు. 10 ఎలీషా కోసం మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది.

11 ఒక రోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు. 12 ఎలీషా తన సేవకుడైన గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.

సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా ఎదుట నిలిచింది. 13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినదంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?”

ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది.

14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు.

“ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.

15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు.

అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది. 16 ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు.

ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది.

షూనేము స్త్రీకి కొడుకు పుట్టుట

17 ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్లుగా, తరువాత వసంత ఋతువులో ఆమె ఒక కుమారుని ప్రసవించింది.

18 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పొలం లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు 19 తండ్రి చూచి, “అయ్యో, నా తల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు.

“అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని తండ్రి తన సేవకునికి చెప్పెను.

20 సేవకుడు ఆపిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద కూర్చొని వున్నాడు. తర్వాత ఆపిల్లవాడు మరణించాడు.

ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం

21 దైవజనుడైన (ఎలీషా) పడకమీద ఆమె తన పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి వెలుపలికి వెళ్లింది. 22 ఆమె తన భర్తను పిలిచి, “ఒక సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను దైవజనుని (ఎలీషా) కలుసుకునేందుకు తర్వగా వెళ్లెదను” అని చెప్పింది.

23 ఆమె భర్త, “దైవజనుని (ఎలీషా) వద్దకు నేడెందుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు.

“ఫరవాలేదు అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది.

24 తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ సేవకునితో, మనము తర్వగా వెళదాము, వేగముగా తోలుము, నేను చెప్పేంత వరుకూ నెమ్మదిగా తోలవద్దని చెప్పింది.

25 ఆ స్త్రీ దైవజనుడను (ఎలీషా) చూసేందుకు కర్మెలు పర్వతానికి వెళ్లింది.

దైవజనుడు (ఎలీషా) షూనేము స్త్రీ చాలాదూరంనుండి వస్తుండగా చూశాడు. ఎలీషా తన సేవకుడైన గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ, 26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు.

ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.

27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి, క్రిందికి వంగి, ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు.

28 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు కావలయునని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం చెయవద్దు” అన్నాను, అని అనగా

29 వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్లడానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్ద. ఎవరినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము అనికూడా చెప్పకుము. ఒకవేళ ఎవరైన నీకు, ‘నమస్కారము’ అన్నట్లయితే, అతనికి బదులు చెప్పకుము. నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము” అని చెప్పాడు.

30 కాని ఆబిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవం తోడు నీవు రాకుండా నేను వెళ్లను” అంది.

అందువల్ల ఎలీషా లేచి, షూనేము స్త్రీని అనుసరించాడు.

31 ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆ బిడ్డ ముఖము మీద ఆ కర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవలేదు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.

షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట

32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.

35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.

36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.

గేహజీ షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.

37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.

అపొస్తలుల కార్యములు 9:10-31

10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు.

“ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.

11 ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. 12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.

13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. 14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.

15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. 16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.

17 ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. 18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. 19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.

సౌలు డెమాస్కసులో బోధించుట

సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. 20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.

21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.

22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.

సౌలు యూదులనుండి తప్పించుకొనుట

23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. 24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. 25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.

యెరూషలేములో సౌలు

26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. 27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.

28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. 29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. 30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు.

31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

లూకా 3:7-18

ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.

10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.

11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.

12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.

13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.

14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.

అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.

15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.

16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International