Add parallel Print Page Options

యూదుల విజయం

పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలందరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. అది యూదులను చంపాలని యూదుల శత్రువులు ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువులకంటె యూదులు ఇప్పుడు బలంగా వున్నారు. అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు. సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పాటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం. మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం వుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.

యూదులు తమ శత్రువులందర్నీ ఓడించారు. వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషించినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు పెట్టారు: పర్షందాతా, దల్పోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10 ఈ పదిమందీ హామాను కొడుకులు. హమ్మెదాతా కొడుకైన హామాను యూదులకు గర్భశత్రువు. యూదులు హామాను కొడుకులందర్నీ చంపేశారుగాని, వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు.

11 ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజ తెలుసు కున్నాడు. 12 అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బాటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని నీవు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తాను. నీవు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”

13 ఎస్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మతమైతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడా యీ కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద వేలాడదీయించండి.”

14 మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ ఉత్తరువు షూషను నగరంలో మరోక రోజు అమలు జరిగింది. హామాను కొడుకులు పదిమందీ ఉరి కొయ్యలకు వేలాడదీయబడ్డారు. 15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.

16 అదే సమయంలో యితర సామంత రాజ్యాల్లోని యూదులు కూడా తమని తాము కాపాడుకోగల బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ మయ్యారు. వాళ్లు అలా తమ శత్రువులను వదిలించుకున్నారు. యూదులు తమ శత్రువుల్లో 75,000 మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తువులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు. 17 అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆరోజును తమ సంతోషకరమైన సెలవు దినం చేసుకున్నారు.

పూరీము పండుగ

18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు. 19 కాగా దేశంలో, చిన్నచిన్న గ్రామాల్లో జీవించే యూదులు ఈ పూరీము పండుగను అదారు నెల 14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు బహూమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. 21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.

23 యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు.

24 అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భశతృవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు 25 హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో అతను కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు.

26-27 ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం ఆచారం అయింది. 28 వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచుకోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచుకుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యంలోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచుకుంటారు.

29 పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు. 30 మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ[a] పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు. 31 పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లేఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిరపరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టుకొనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. 32 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.

Footnotes

  1. 9:30 శాంతిని … విశ్వాశాన్ని లేక “సహవాసము”, మరియు సత్యం. జెకర్యా 8:19లో జనం పండుగలను ఎలా జరుపుకోవాలో, దానిని దేవుడు వాళ్లకెందుకు యిచ్చాడో తెలియజేస్తాడు.