Add parallel Print Page Options

జనముల అభివృద్ధి, విస్తరణ

10 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:

యాఫెతు సంతానము

యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా

యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.

మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతులవారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.

హాము సంతానము

హాము కుమారులు కూషు, మిస్రాయిము,[a] పూతు, కనాను.

కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.

రాయమా కుమారులు షేబ, దదాను.

కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.

10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదుకల్నే అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది. 11 నిమ్రోదు అష్షూరుకు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె, రహోబోతీరు, కాలహు, 12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు పట్టణానికి మధ్య రెసెను ఉంది.)

13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 14 పత్రుసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారే.)

15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. 16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి.

కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. 19 ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.

20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు.

షేము సంతానము

21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.

22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

23 అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష.

24 అర్పక్షదు షేలహుకు తండ్రి.

షేలహు ఏబెరుకు తండ్రి.

25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు[b] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.

26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27 హదోరము, ఊజాలు, దిక్లాను 28 ఓబాలు, అబీమాయెలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. 30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.

31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.

32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.

Footnotes

  1. 10:6 మిస్రాయిము ఇది ఈజిప్టు యొక్క మరో పేరు.
  2. 10:25 పెలెగు అనగా విభజన