Add parallel Print Page Options

బిలాము—మోయాబు రాజు

22 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.

2-3 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.

మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు.

అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. బెయోరు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు:

“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మేసేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”

మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.

బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.

దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.

10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”

12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.

13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.

14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.

15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”

18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”

20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.

బిలాము, అతని గాడిద

21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు. 22 బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికి కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు.

23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు.

24 తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి 25 మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు.

26 తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది. 27 యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.

28 అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.

29 “నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో.

30 అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో.

“అది నిజమే” బిలాము అన్నాడు.

31 అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యెహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు.

32 యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను. 33 గాడిద నన్ను చూచి మూడు సార్లు నా నుండి పక్కకు తప్పుకొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడ్ని కాదు.”

34 అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.

35 “లేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో చెప్పేమాటలే నీవు చెప్పాలి” అన్నాడు బిలాముతో యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యులతో బిలాము వెళ్లాడు.

36 బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక అర్నోను సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం దగ్గర అతణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది అతని దేశపు పొలిమేర. 37 బాలాకు బిలామును చూడగానే “నీవు రావాలని ఇది చాలా ముఖ్యమయిందని ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్లించ లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో.

38 అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవాబిచ్చాడు.

39 అప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్ హుచ్చోతుకు వెళ్లాడు. 40 బాలాకు తన బలి అర్పణగా కొన్ని ఎడ్లను, గొర్రెలను వధించాడు. ఆ మాంసం కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయకులకు అతడు ఇచ్చాడు.

41 ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.

బిలాము మొదటి సందేశం

23 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు. బిలాము అడిగినట్టే బాలాకు అవన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు.

అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.

అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.

అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా.

కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు. అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు
    రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు.
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!
    ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు,
    వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు
    అందుచేత నేనుకూడ వారిని శపించలేను.
ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు
    అందుచేత నేను అలా చేయలేను.
కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను.
    ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను.
ఒంటరిగా బ్రతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను,
    వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
10 ఇసుక రేణువులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”

11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.

12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.

13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు. 14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.

15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు.

16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు. 17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.

బిలాము రెండో సందేశం

18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బాలాకూ లేచి నా మాట విను.
    సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను.
19 దేవుడు మనిషికాడు,
    ఆయన అబద్ధం చెప్పడు.
దేవుడు మానవ కుమారుడు కాడు,
    ఆయన నిర్ణయాలు మారవు.
ఏదైనా చేస్తానని యెహోవా చెబితే
    ఆయన అలానే చేస్తాడు.
యెహోవా ఒక వాగ్దానం చేస్తే,
    ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
    యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు.
    ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు.
యెహోవా వారి దేవుడు,
    ఆయన వారితో ఉన్నాడు.
మహారాజు వారితో ఉన్నాడు.
22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు.
    అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు.
23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు.
    ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు.
‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి,
    ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు.
    సింహంలా వారు పోరాడతారు.
ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు.
    తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”

25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో.

26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు.

27 అప్పుడు బాలాకు, “అలాగైతే నాతో మరో బలిపీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ దేవుడు సంతోషించి, అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని బిలాముతో చెప్పాడు. 28 కనుక బాలాకు పీయోరు కొండకు బిలామును తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని చూడవచ్చు.

29 “ఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత బలికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు బిలాము. 30 బిలాము అడిగినట్టు బాలాకు చేసాడు. ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బాలాకు బలిగా వధించాడు.

బిలాము మూడో సందేశం

24 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు. బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు.
నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను.
    నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను.
    నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.

“యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
భూమి మీద మీ గుడారాలు లోయల్లా
    పరచుకొన్నాయి.
అవి నదీ తీరంలో
    తోటలా ఉన్నాయి.
యెహోవా నాటిన అది చక్కటి
    సువాసనగల మొక్కలా ఉంది.
అది నీళ్ల దగ్గర పెరిగే
    అందమైన చెట్లలా ఉంది.
మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది.
    మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు.
ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు.
    వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.

“ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు.
    వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు.
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు.
    వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు.
వారు నిద్రపోతున్న కొదమ
    సింహంలా ఉన్నారు.
దానిని మేల్కొలి పేందుకు
    ఎవడికి ధైర్యం చాలదు.
నిన్ను ఆశీర్వదించే వారు
    ఆశీర్వాదం పొందుతారు.
నిన్ను ఎవరైనా శపిస్తే వారికి
    గొప్ప కష్టాలు వస్తాయి.”

10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. 11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”

12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”

బిలాము చివరి సందేశం

15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి.
విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి.
    మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను.
    నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను.
    నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.

17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు.
    ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు.
యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది.
    ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు.
    షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు.
అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు[a] దొరుకుతాయి.

19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
పట్టణంలో ఇంకా బ్రతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”

20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది.
    కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!

21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:

“మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం.
    ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు.
అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”

23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు:

“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బ్రతకలేడు.
24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి.
ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి.
    అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి.”

25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.

Footnotes

  1. 24:18 శేయీరు ఎదోముకి మరో పేరు.